తెలంగాణలో ఏడు రోజులపాటు వర్షాలు, ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో శుక్రవారం నుంచి రాగల ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.;

Update: 2025-06-13 13:50 GMT

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో రాగల ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. శుక్రవారం నుంచి జూన్ నెల 19వతేదీ వరకు రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడించారు. ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలోని దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఆయన తెలిపారు. నైరుతి రుతపవనాలు చురుకుగా కదులుతుండటంతో దీని ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని అధికారులు పేర్కొన్నారు.


మరో గంటలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉరుములు, మెరుపులతో వర్షం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉరుముులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నారాయణపేట్, సూర్యాపేట్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ప్రస్థుతం పసిఫిక్ ప్రాంతంలో ఎన్ నినో దక్షిణ ఆసిలేషన్ పరిస్థితుల కారణంగా రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని ఐఎండీ అధికారులు చెప్పారు.

12 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
శుక్రవారం నుంచి జూన్ నెల 18వతేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు అవకాశం ఉందని హైదరాబాద్ కేంద్రం ఐఎండీ అధికారులు చెప్పారు. ఉరుములు,మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురు గాలులు వీచే అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు. భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీచేశారు. జూన్ 14వతేదీ శనివారం తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశమున్నందున ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 15వతేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో, జూన్ 16వతేదీన ఆదివారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ శాస్త్రవేత్త ధర్మరాజు వెల్లడించారు.

హైదరాబాద్ లో ఉరుములు,మెరుపులతో వర్షాలు
హైదరాబాద్ నగరంలో శుక్ర, శనివారాల్లో తదుపరి 48 గంటలపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం ఈదురుగాలులు వీస్తాయని, ఉదయం వేళ పొగమంచుతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశముందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్షియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News