పర్యావరణ పరిరక్షణ నినాదం కాదు బాధ్యత’

తెలంగాణలో గ్రీన్ కవర్ 24% నుంచి 31%కి పెరిగింది. అంటే 7.7% వృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.;

Update: 2025-06-05 07:59 GMT

జూన్ 5.. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. పర్యావరణ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పర్యావరణ విధ్వంసానికి సుప్రీంకోర్టులో సమాధానాలు చెప్పుకునే దుస్థితికి వచ్చిందంటూ హెచ్‌సీయూలో జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్‌ ముందు చూపును హరీష్ రావు కొనియాడారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలైన హరిత హారం కార్యక్రమం రాష్ట్రంలో హరిత విప్లవాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో గ్రీన్ కవర్ 24% నుంచి 31%కి పెరిగింది. అంటే 7.7% వృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. మొత్తం 250 కోట్ల మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చిన ఘనత కెసిఆర్ ది’’ అని పేర్కొన్నారు.

‘‘మేం కేవలం ఆకుపచ్చని తెలంగాణ గురించి మాట్లాడలేదు, దాన్ని సాకారం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పర్యావరణ పరిరక్షణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కల నాటే హరిత నిధిని 53% తగ్గించింది. (రూ. 36 కోట్ల నుంచి రూ. 17 కోట్లకు) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో చెట్లను నరికివేసి, పర్యావరణానికి, అక్కడి వన్యప్రాణులకు తీవ్ర నష్టం కలిగించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యావరణ విధ్వంసంతో పాటు పాలనలో కూడా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. HCUలోని చెట్లు రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యలకు బలైపోయాయి. HCUలోని అటవీ ప్రాంతాన్ని వెంటనే పునరుద్ధరించాలని, ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ కేవలం నినాదం కాదు, అది మన బాధ్యత. తెలంగాణ ప్రజల కోసం మేం ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం’’ అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News