‘ఆలయ అభివృద్ధిని డబ్బులతో కాదు భక్తితో చూడాలి’
మేడారం ఆలయ అభివృద్ధి వంద రోజుల్లో పూర్తి కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమ్మక్క-సార్లమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగానే మేడారం ఆలయ అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ఆలయ అభివృద్ధిని డబ్బుతో కాకుండా భక్తితో చూడాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్షలో ఆలయ అర్చకులు, ఆదివాసీ సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు. వారికి ఆలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లను వివరించారు సీఎం. అనంతరం వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అందరి నుంచి ఏకాభిప్రాయం పొందిన తర్వాతనే అభివృద్ధి పనులను ప్రారంభించాలని అధికారులకు సీఎం సూచించారు. గత పాలకులు సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో వివక్ష చూపారని విమర్శించారు. ఆదివాసీల సంప్రదాయాలు, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామని, వారి సంప్రదాయంలో ఏ మార్పు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
‘‘ఇది కేవలం ఒక బాధ్యత కాదు.. ఇది బాధ్యతతో కూడిన భావోద్వేగం. ఆనాడు పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారు. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఆనాడు ఇక్కడినుంచే నేను పాదయాత్ర మొదలుపెట్టా. ఫిబ్రవరి 6, 2023 న ఈ గడ్డపై నుంచి తెలంగాణకు పట్టిన చీడ, పీడను వదిలించేందుకు అడుగులు వేశాం. ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం. ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేస్తున్నాం’’ అని తెలిపారు.
‘‘సమ్మక్క సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో సీతక్కకు, నాకు ఈ జన్మ ధన్యమైనట్లే. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆదివాసీలను, పూజారులను, సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం. రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయి. అందుకే సమ్మక్క సారలమ్మ అభివృద్ధిలో రాతి కట్టడాలే నిర్మిస్తాం. మహా జాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తాం. పగలు, రాత్రి నిర్విరామంగా పనులు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. స్థానికుల భాగస్వామ్యం, సహకారం ఉంటేనే ఇది జరుగుతుంది’’ అని చెప్పారు.
‘‘సమ్మక్క సారక్క మాలధారణ చేసినట్లుగా భక్తితో పనులను నిర్వహించాలని అధికారులను ఆదేశించా. మహాజాతరకు మళ్లీ వస్తా… ఈసారి జాతరను గొప్పగా చేసుకుందాం. కుంభమేళాకు వేలకోట్లు ఇస్తున్న కేంద్రం… ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడంలేదు. జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నా’’ అని అన్నారు.