Revanth Reddy | ‘లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్’
2000కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలకు తెలంగాణ నిలయమన్న రేవంత్ రెడ్డి.;
తెలంగాణను ఫార్మా రంగంలో సైతం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకోసం తమ ప్రభుత్వం నిరంతరం నిర్విరామంగా పనిచేస్తుందని చెప్పారు. అతి త్వరలో భారతదేశ లైఫ్సైన్సె క్యాపిటల్గా హైదరాబాద్ అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ‘ఎలీ లిల్లీ’ గచ్చిబౌలిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ను సీఎం రేవంత్.. ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఫార్మా రంగంలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు.
‘‘తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చరిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగింది. ఇందుకు ఇవాళ్టి ఈ కార్యక్రమమే తిరుగులేని నిదర్శనం. మా ప్రభుత్వ చిత్తశుద్ధి, దృష్టికోణం, కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది. ఈ విజయం సాధించడంలో అహర్నిశలు శ్రమించిన మంత్రి శ్రీధర్ బాబుకి, జయేష్ రంజన్కి, పాలుపంచుకున్న అధికారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇది తెలంగాణ రైజింగ్ 2047(Telangana Rising 2047) దిశగా మేము వేసిన మరొక ముఖ్యమైన అడుగు’’ అని తెలిపారు.
‘‘తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమిగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం. ఎలీ లిల్లీ (Eli Lilly) సంస్థ లీడర్ షిప్ ను, ఉద్యోగులను హైదరాబాద్ నగరానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. తెలంగాణపై నిరంతర నమ్మకం ఉంచి, అండగా నిలిచి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నందుకు పారిశ్రామికవేత్తలు-పెట్టుబడిదారులు, ప్రపంచ శ్రేణి కార్పొరేషన్లకు, కంపెనీలకు ధన్యవాదాలు. ఈ రోజు ప్రారంభమైన ఎలీ లిల్లీ నూతన కేంద్రం… ఆ సంస్థ గ్లోబల్ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది’’ అని చెప్పారు.
‘‘ఈ టెక్నాలజీ, ఇన్నొవేషన్ సెంటర్, ప్రపంచవ్యాప్తంగా రోగులకు పరిష్కారాల కోసం పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడమంటే ఈ నగరం ఘనతను మీరు ప్రపంచానికి చాటి చెప్పినట్లే. హైదరాబాద్ నగరంలో టాలెంట్ ఉంది, లీడర్షిప్ ఉంది, విజన్ ఉంది, మంచి పాలసీ ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందుకే ఎలీ లిల్లీ లాంటి గ్లోబల్ లీడర్కు ఇది అనుకూలమైన కేంద్రంగా మారింది. భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ఇప్పటికే గుర్తింపు పొందింది. 2000కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. 200కి పైగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నగరం నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
‘‘భారత్లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40 శాతం తెలంగాణలోనే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 టీకాలలో ఒకటి హైదరాబాద్లో అభివృద్ధి చేయడం లేదా తయారవుతుండటం మాకు గర్వకారణం. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ, భారతదేశంలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ పరిశోధన- అభివృద్ధి సముదాయంగా నిలిచింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థల కోసం హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారింది. ఈరోజు, ఎలీ లిల్లీ సంస్థ రాకతో, లైఫ్ సైన్సెస్ రంగంలో మేము మరో మెట్టుకు చేరుకున్నాం. మధుమేహం, ఆంకాలజీ, ఇమ్యునాలజీ, న్యూరోసైన్స్ రంగాలలో ఎలీ లిల్లీ సంస్థ కృషి ఒక గేమ్-ఛేంజర్ గా నిలిచిపోతుంది’’ అని అన్నారు.
‘‘ఎలీ లిల్లీ సంస్థ చేసిన కృషి మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేయడంతో వారిని రక్షించడానికి తోడ్పడింది. నేను, మా ప్రభుత్వం అన్ని వేళలా మీకు అండగా ఉంటాం. పారదర్శకత, అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తాం. హైదరాబాద్లో పని చేయబోయే ఎలీ లిల్లీ ఉద్యోగులు.. కేవలం హైదరాబాద్లో నివసించడం, పనిచేయడం మాత్రమే కాదు ఇప్పుడు మీరు మా కుటుంబ సభ్యులుగా మారారు. మీరు హైదరాబాద్ నుంచి గ్లోబల్ హెల్త్కేర్ భవిష్యత్తును తీర్చిదిద్దనున్నారు. మీ సహకారంతో, తెలంగాణను భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మాత్రమే కాకుండా…. ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు నంబర్ వన్ హబ్గా తీర్చిదిద్దుతాం. మనమందరం కలిసి కొత్త ఆవిష్కరణలు చేద్దాం, ప్రజల జీవితాలను మారుద్దాం, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్ నిర్వచిద్దాం’’ అని కోరారు.