కవిత బెయిల్ పై మొదటిసారి రేవంత్ రియాక్షన్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ ముఖ్య నాయకురాలు కవితకి బెయిల్ వచ్చిన తర్వాత మొదటిసారి ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

Update: 2024-08-28 10:19 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ ముఖ్య నాయకురాలు కవితకి బెయిల్ వచ్చిన తర్వాత మొదటిసారి ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కవితకి బెయిల్ రావడంపైనా ఆయన స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ మైత్రీవల్లే ఆమెకి బెయిల్ వచ్చిందని విమర్శించారు. "పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ బీజేపీకి ట్రాన్స్‌ఫర్ చేశారు. అందుకే కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, సిసోడియాకు నెలలు దాటినా రాలేదు. బీఆర్‌ఎస్‌కు ఒక న్యాయం, మిగితా వారికి మరో న్యాయం జరుగుతుంది" అని సీఎం ఆరోపించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టైన కవితకి మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో దాదాపు ఐదు నెలల జైలు జీవితం అనుభవించిన ఆమె నిన్న రాత్రి తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో జరిగే లిక్కర్ పాలసీ సీబీఐ కేసు చార్జ్ షీట్‌పై విచారణకు కవిత వర్చువల్ గా హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి విస్తారా ఫ్లైట్ లో బయలుదేరారు.

బీఆర్ఎస్ కాంగ్రెస్ వార్...

కవితకి బెయిల్ రావడంపై కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ల లోపాయికారిక ఒప్పందంతోనే కవితకి బెయిల్ వచ్చిందంటున్నారు. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా చేసింది. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంకు షేర్ చేసి కవితకి బెయిల్ తెచ్చుకున్నారని కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహాలో వ్యాఖలు చేయడం గమనార్హం. కాగా, కాంగ్రెస్ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ వ్యాఖ్యలు పద్ధతి కాదంటూ హితవు పలుకుతున్నాయి. 

Tags:    

Similar News