‘మూడు రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు రావాలి’
ప్రభాకర్ రావు పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించకూడదుని, ప్రభాకర్ రావు.. ఫోన్ టాపింగ్ కేసుకు పూర్తిగా సహకరించాలని కూడా ఆదేశాలిచ్చింది.;
ఫోన్ టాపింగ్ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకుంది. ఇన్ని రోజులు అమెరికాలో ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే విధంగా ఆయనకు మూడు రోజుల్లో పాస్పోర్ట్ జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. దాంతో పాటుగానే ప్రభాకర్ రావు పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించకూడదుని, ప్రభాకర్ రావు.. ఫోన్ టాపింగ్ కేసుకు పూర్తిగా సహకరించాలని కూడా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం స్పష్టం చేసింది.
అసలేమైందంటే
శాశ్వతంగా తాను అమెరికాలోనే ఉండిపోయేట్లుగా ప్రభాకరరావు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా కుదరలేదు. ఇదేసమయంలో నిందితుడిని అమెరికా నుండి రప్పించేందుకు సిట్ అధికారులు చేసిన ప్రయత్నాలు కూడా సక్సెస్ కాలేదు. కోర్టులో పిటీషన్ వేసిన పోలీసులు ముందు లుక్ అవుట్ నోటీసు జారీచేయించారు. లాభంలేకపోవటంతో అమెరికాలోని ఇంటర్ పోల్(Interpol) అధికారుల ద్వారా రెడ్ కార్నర్(Red corner Notice) నోటీసు ఇప్పించారు. అయినా ఉపయోగంలేకపోవటంతో ఆయన పాస్ పోర్టును రద్దుచేయించారు. అప్పటికీ లాభంలేకపోయింది. ఒకవైపు పోలీసులు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే తనను అరెస్టుచేయకుండా ముందస్తు బెయిలిస్తే తాను ఇండియాకు వచ్చి విచారణకు హాజరవుతానని ప్రభాకరరవు కోర్టుకే షరతులు విధించారు.