కర్నూలు ప్రమాదం.. మృతుల్లో తెలంగాణ వారి వివరాలివే..
20 మంది మృతుల్లో తెలంగాణ వారు ఆరుగురు.
కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాద మృతుల్లో తెలంగాణకు చెందిన వారు ఆరుగురు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మెదక్ నుంచి ఇద్దరు, హైదరాబాద్ నుంచి ఇద్దరు, యాదాద్రి, ఖమ్మం నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అయితే కర్నూలు ప్రమాద మృతుల్లో ఆరు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. బీహార్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఈ ప్రమాదం అనేక కుటుంబాలకు శోకాన్ని మిగిల్చాయి. పండగకని, చుట్టాలను కలవడానికి ఇలా అనేక కారణాలతో వచ్చి వెళ్తున్నవారు.. మార్గమద్యలో అనంతలోకాలకు వెళ్లిపోయారు.
మృతుల్లో తెలంగాణ వారు వీరే..
కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన ఆరుగురు తెలంగాణ వాసుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. గిరిరావ్(48)-హైదరాబాద్, ఆగ్ర బందోపాధ్యాయ్(23)-హైదరాబాద్, చందన(23)-మెదక్, సంధ్యారాణి(43)-మెదక్, అనూష(22)-యాదాద్రి, మేఘనాథ్(25)-ఖమ్మం జిల్లా. అయితే ఈ ఘటన మృతుల్లో ఒకరి వివరాలు ఇంకా తెలీలేదు. వాటిని తెలుసుకోవాడం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తప్పించుకున్న తెలంగాణ వారు
ఈ ఘోర బస్సు ప్రమాదం నుంచి తప్పించుకున్న 27 మందిలో తెలంగాణకు చెందిన వారు 11 మంది ఉన్నారు. వారిలో కొందరు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరికొందరు తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.
1. అశ్విన్ రెడ్డి, హైదరాబాద్, కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు.
2. ఎం.సత్యనారాయణ, ఖమ్మం, కర్నూలు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.
3. గుణసాయి, హైదరాబాద్, కర్నూలు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.
4. ఆండోజు నవీన్ కుమార్, హైదరాబాద్, కర్నూలు జీజీ హెచ్లో చికిత్స పొందుతున్నారు.
5. ఎంజి, రామరెడ్డి, ఈస్ట్ గోదావరి, హైదరాబాద్ వెళ్లి పోయారు
6. జయసూర్య, హైదరాబాద్, కర్నూలు జీజీహెచ్ చికిత్స పొందుతున్నారు.
7. ఉమాపతి, హైదరాబాద్, బెంగళూరు వెళ్లిపోయారు
8. చరిత్, హైదరాబాద్, బెంగళూరు వెళ్లారు
9. కీర్తి, హైదరాబాద్, హైదరాబాద్ వెళ్లారు
10. జయంత్ కుశ్వల, హైదరాబాద్, కర్నూలులో ఉన్నారు.
11. కె.అశోక్, రంగారెడ్డి జిల్లా. కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
యాక్షన్లో మంత్రి జూపల్లి..
ప్రమాద ఘటన సమాచారం అందిన వెంటనే తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు.. కర్నూలు బయలుదేరారు. అక్కడకు చేరుకున్న అంనతరం ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటన తెలంగాణకు చెందిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడించారు. కాగా ప్రమాదం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే జరిగిందని, ప్రైవేటు యాజమాన్యాలు సరైన శిక్షణ పొందిన డ్రైవర్లనే నియమించుకునేలా తమ ప్రభుత్వం అతి త్వరలో ఆదేశఆలు జారీ చేస్తుందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారం అందించడం కోసం గద్వాల కలెక్టరేట్లో, పోలీసు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.
కొనసాగుతున్న డ్రైవర్ విచారణ..
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. వారిలో శివరానాయణ ఒకరు, లక్ష్మయ్య మరొకరు. ప్రమాదం జరిగిన సమయంలో లక్ష్మయ్య డ్రైవింగ్లో ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే లక్ష్మయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా ఈ ఘటనపై డ్రైవర్ శివనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శివనారాయణ మాట మారుస్తున్నాడని పోలీసులు తెలిపారు. మరోవైపు లక్ష్మయ్య కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.