పోలీసులకు తెలంగాణ హైకోర్టు వార్నింగ్

‘సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు’;

Update: 2025-06-17 12:38 GMT

చట్టాలను పకడ్డందీగా అమలు చేయించాల్సిన పోలీసులే చట్టాలను తమ చేతుల్లో తీసుకుంటున్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులే నేరస్థులకు అండగా నిలుస్తున్నారు. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై మంగళవారం( జూన్ 17) తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చడంపై హైకోర్టు మండిపడింది. ఎన్ని సార్లు చెప్పినా మీ బుద్ది మారదా అని హైకోర్టు పోలీసులను నిలదీసింది. ఇటీవలికాలంలో సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం బాగా పెరిగిపోయింది. బాధితులంతా ఒక్కొక్కరుగా హైకోర్టునాశ్రయించారు. వీళ్లంతా సివిల్ వివాదాల్లో కోర్టు కేసులను ఎదుర్కొంటున్న వారే. పోలీసులపై 30పిటిషన్ లు దాఖలైతే సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై 25 పిటిషన్లు దాఖలయ్యాయి.

పాతబస్తీ బార్కాస్ కు చెందిన మొహిసిన్ 256 గజాల స్థల వివాదం కోర్టులో ఉంది. కోర్టులో విచారణలు జరుగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ మొహిసిన్ ను బెదిరించింది. ఇక్కడ బాధితుడైన మొహిసిన్ కు అండగా నిలవాల్సిన పోలీసులు.. నిందితులకు  అండగా నిలిచారు. దీంతో మొహిసిన్ హైకోర్టును ఆశ్రయించాడు. స్థలం వివాదంలో కేసు వెనక్కి తీసుకోవాలని తనపై వత్తిడి పెరిగిందని మొహిసిన్ న్యాయస్థానానికి మొరపెట్టుకున్నాడు. హైకోర్టు  ఈ కేసును స్వీకరించి విచారణ ప్రారంభించింది. సివిల్ వివాదాల్లో మీ జోక్యం ఎందుకని ప్రత్యర్థి పోలీసులను ప్రశ్నించింది. ఫిర్యాదుదారుడు ఎండల్లో పోలీస్ స్టేషన్ కు వెళితే కనీనం మంచి నీళ్లు కూడ ఇవ్వరా అని హైకోర్టు పోలీసులను నిలదీసింది. రెంట్ కంట్రల్ యాక్ట్ బాధ్యతలను తమకే అప్పగించాలని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వంచేత చట్టాన్ని తీసుకురావాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ టి. వినోద్ కుమార్ పోలీసుల పనితీరును తప్పుబట్టారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న చాంద్రాయణ గుట్ట స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారి చేశారు. ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ న్యాయ వివాదాల్లో పోలీసులు ఇకపై జోక్యం చేసుకోబోరని హామీ ఇవ్వడంతో పిటిషన్ పై విచారణ ముగిసింది.

74 ఏళ్ల వయసులో తప్పని తిప్పలు

సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చడం తెలుగు రాష్ట్రాల్లో రివాజుగా మారింది. గత నెలలోనే ఏపీ హైకోర్టు విశాఖ, ప్రకాశం, పల్నాడు జిల్లాల పోలీసులను తప్పుబట్టింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం మీకు లేదని, వాటి పరిష్కారానికి సివిల్ కోర్టులు, న్యాయ సేవాధికార సంస్థలున్నాయని స్పష్టం చేసింది. సివిల్ ప్రోసీజర్ కోడ్ క్రింద సివిల్ కోర్టులున్నాయని స్పష్టం చేసింది.

ఓ సివిల్ వివాదంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ తనను పదే పదే వేధిస్తున్నారని , సివిల్ వివాదంలో జోక్యం చేసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నంకు చెందిన 74 ఏళ్ల వృద్దురాలు ఎస్ శ్యామల ఏపీ హైకోర్టునాశ్రయించారు. ఈ పిటిషన్ పై జస్టిస్ లక్ష్మణ్ రావు విచారణ జరిపారు. పిటిషనర్ తరపున న్యాయవాది వట్టికూటి సూర్య నారాయణ వాదనలు వినిపించారు. వెంకట కృష్ణ రాజు, గోపాల్ రాజు, వెంకట సత్య నారాయణ రాజులతో వృద్దురాలికి వివాదం ఉంది.

ప్రి లిటిగేషన్ కౌన్సిలింగ్ పేరుతో ...

శ్యామల విషయంలోనూ అదే జరిగింది. ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ పేరుతో పోలీసులు సివిల్ వివాదంలో తలదూర్చారు. ఎటువంటి చట్టబద్దత లేని ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ పై న్యాయమూర్తి పోలీసులను వివరణ కోరారు. వివాద పరిష్కారానికి పార్టీలను కౌన్సిలింగ్ కు మాత్రమే పిలుస్తామని పోలీసులు బుకాయించారు. వివాదాన్ని సెటిల్ చేసి ప్రత్యర్థి పార్టీ ల నుంచి ప్రీలిటిగేషన్ కౌన్సిల్ పేరిట పోలీసులు డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. శ్యామల కేసులో వాదనలు విన్న ఏపీ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. సివిల్ వివాదాల్లో తల దూర్చకూడదని పోలీసులను హెచ్చరించింది.

ప్రకాశం జిల్లా ముండ్ల పూరు పోలీసులు ఓ సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవడాన్ని  ఎపి హైకోర్టు తప్పు పట్టింది. క్రింద కోర్టులో వేసిన పిటిషన్ ను ఉఫసంహరించుకోవాలని పోలీసులు కోరడాన్ని ఆక్షేపించింది. 

‘భారతీయ చట్టాల ప్రకారం సివిల్ వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదు. ఆస్తుల వివాదాలు, డబ్బు వివాదాలు కోర్టుల పరిధిలో వస్తాయి. పోలీసులు నేరాలను మాత్రమే కట్టడి చేయాలి. జరిగిన సంఘటనలపై విచారణ జరపాలి’ అని  న్యాయవాది వాకిటి వెంకటేశం అన్నారు.


Similar News