కేరళ తరహాలో కృష్ణా, గోదావరి నదుల్లో బోట్ ఫెస్టివల్
తెలంగాణ పర్యాటక శాఖ భారీ ప్రణాళిక;
By : Saleem Shaik
Update: 2025-06-10 10:20 GMT
కేరళ బోట్ ఫెస్టివల్ తరహాలో కృష్ణా, గోదావరి నదుల ఉత్సవాలు జరపాలని తెలంగాణ పర్యాటక శాఖ(Telangana Tourism) నిర్ణయించింది. దీనిలో భాగంగా కృష్ణా, గోదావరి నదుల్లో పడవల పోటీలు సైతం నిర్వహించనున్నారు. తెలంగాణలో అడ్వెంచర్ స్పోర్ట్సు, వారాంతపు విహారయాత్ర కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.పర్యాటక ప్రాంతాల్లో హెలిప్యాడ్ లను నిర్మించి వాయు కనెక్టివిటీ పెంచాలని తెలంగాణ 2025-2030 పర్యాటక రంగ ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకున్నారు.
నదీ తీర ప్రాంతాల్లో పర్యాటకరంగ అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం నుంచి పారుతున్న గోదావరి, కృష్ణానదుల్లో జెట్టీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నదీ తీర ప్రాంతాల్లో బోట్లలో పర్యాటకులు రాకపోకలు సాగించేందుకు వీలుగా స్టేషన్లు నిర్మించాలని, వాటర్ స్పోర్ట్స్, హౌస్ బోట్లను నడపాలని నిర్ణయించారు. నదీ తీర ప్రాంతాల్లో అడ్వెంచర్ స్పోర్ట్సు, పిల్లల రిక్రియేషన్ జోన్ లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లోని సరస్సుల తీర ప్రాంతాల్లో వాటర్ ఫ్రంట్ లను అభివృద్ధి చేయాలని సంకల్పించారు.తెలంగాణ రాష్ట్రంలో నదీ ఉత్సవాలను కోలాహలంగా నిర్వహించాలని నిర్ణయించారు.తెలంగాణ ఉత్సవాల్లో భాగంగా కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాల్లో బోట్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంతో ఇవి ఏర్పాటు చేయనున్నారు. బిల్ట్ ఆపరేట్, అండ్ ట్రాన్స్ ఫర్ బిల్ట్ పద్ధతిలో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో వీటిని చేపట్టబోతున్నారు.
కేరళలో బోట్ రేసింగ్ ‘వల్లంకాళీ’
కేరళ రాష్ట్రం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పడవల పందెం...మలయాళ నెల చింగంలో అంటే ఓనం పండుగ సమయమైన ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జరుపుకునే పడవల పందెలను మళయాళీయులు వల్లంకాళీ (Vallam kali) అని పిలుస్తుంటారు. పొడవైన పడవలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ జరిగే రేసింగ్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. వల్లం కళీ ఈవెంట్ స్నేక్ బోట్ రేస్(Snake Boat Race) కేరళలోని అలప్పుజలోని పున్నమాడ సరస్సులో నెహ్రూ ట్రోఫీ పడవల పందేలు నిర్వహిస్తారు.కేరళలో అరన్ముల పడవల పోటీ పతనం తిట్ట జిల్లాలోని పంపానదీ తీరంలోని అరణ్ములా గ్రామంలో జరుగుతుంటాయి. జలోత్సవం హరిపాడు సమీపంలోని పాయిప్పాడ్ సరస్సులో , కల్లాడ నిలో కల్లాడ జలోత్సవం(Kallada Jalotsavam) నిర్వహిస్తున్నారు.
పర్యాటక కేంద్రాలకు తెలంగాణ నిలయం
జలకళతో కళకళలాడుతున్న సరస్సులు, పచ్చని చెట్లతో అలరారుతున్న అడవులు, వివిధ రకాల వన్యప్రాణులు, పురాతన కట్టడాలకు తెలంగాణ నిలయం.ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటైన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, ఐటీ హబ్, టీకాలకు రాజధానిగా, ఔషధ కేంద్రంగా, పర్యాటక, చలనచిత్రపరిశ్రమ కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. తెలంగాణలోని పర్యాటక కేంద్రాల్లోపోలీసు గస్తీని పెంచి మహిళా పర్యాటకులకు భద్రత కల్పించడం ద్వారా ఈ రంగాన్ని ప్రోత్సహించనున్నారు. అన్ని పర్యాటక ప్రాంతాల్లో సీసీటీవీ నిఘాు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రాబోయే అయిదేళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు
2025-2030 తెలంగాణ పర్యాటక విధానంలో భాగంగా రాబోయ అయిదు సంవత్సరాల్లో రూ,15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయిదేళ్లలో పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా మూడు లక్షల మందికి ఉపాధి కల్పించాలని, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకల్లో తెలంగాణను టాప్ రాష్ట్రాల్లో నిలబెట్టేందుకు తెలంగాణ పర్యాటక శాఖ కృషి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర జీడీపీలో పర్యాటక రంగం నుంచి 10 శాతం పెంచాలని నిర్ణయించారు.
ఉపాధితో జీడీపీ పెంపు
ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ద్వారా 10.5 శాతం అంటే 334 మిలియన్ల మందికి ఉపాధి లభించడంతోపాటు దీని ద్వారా జీడీపీలో 10.4 శాతం అంటే 10.3 ట్రిలియన్ల ఆదాయం వస్తుందని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ వెల్లడించింది. దుబాయ్, సింగపూర్ బాటలో పయనిస్తూ తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని తెలంగాణ యోచిస్తోంది.
- వివాహ షాపింగ్, షాపింగ్, అవుట్ లెట్ మాల్స్, ఫర్నిచర్, నిర్మాణ మెటీరియల్స్ మాల్స్ ప్రపంచ స్థాయి షాపింగ్ సౌకర్యాలు కల్పించడం ద్వారా గ్లోబల్ కొనుగోలుదారులను ఆకర్షించాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా షాపింగ్ పండుగల క్యాలెండర్ నిర్వహించాలని నిర్దేశించారు.
- గోల్ఫ్ టూరిజం, భౌద్ధ పర్యాటకం ద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలని నిర్ణయించారు. వారసత్వ భవనాలు, కోటలు, రాజభవనాలు, సమాధులు, పర్యాటక ఆకర్షణల పరిరక్షణ కోసం కార్పొరేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. అంతర్జాతీయ స్టేడియాలను నిర్మించి ప్రపంచ క్రీడాభిమానులను రప్పించనున్నారు.
- తెలంగాణలో ఆథ్యాత్మిక,వారసత్వ, ఎకో, వెల్ నెస్, క్రాఫ్ట్, వాటర్ ఫాల్స్, బుద్ధిస్ట్ పర్యాటక స్థలాలను అభివృద్ధి చేసేందుకు వాటర్ ఫాల్, బుద్ధిస్ట్ సర్క్యూట్లను ఏర్పాటు చేయాలని నిర్నయించారు.
27 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
తెలంగాణలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. 27 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందించారు.యాదగిరిగుట్ట, భువనగిరి ఫోర్ట్, బస్వాపూర్, కొలనపాక దేవాలయాలతో ఆథ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు.
- రాములవారి దేవస్థానమున్న భద్రాచలం కేంద్రంగా పర్ణశాల, కిన్నెరసాని డ్యామ్, అభయారణ్యం, కనకగిరిహిల్స్ అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
- బాసర కేంద్రంగా ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం, వ్యాస మహర్షి దేవాలయం, పరిసర ప్రాంతాలను యాత్రా కేంద్రంగా చేయనున్నారు.
- వేములవాడ రాజన్న దేవాలయం కేంద్రంగా కొండగట్టు, కోటిలింగాల, ధర్మపురి పుణ్య క్షేత్రాలను అభివృద్ధి చేయనున్నారు.
- ఆలంపూర్ సోమశిల కేంద్రంగా ఆలంపూర్ శక్తిపీఠం, బీచుపల్లి, జట్ ప్రోల్, కొల్లాపూర్, సోమశిల బ్యాక్ వాటర్ కేంద్రాలుగా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు.
- మహదేవ్ పూర్ లోని కాళేశ్వరం కేంద్రంగా శివారం అభయారణ్యం, గాంధారి కోటలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు.
- మెదక్ చర్చ్ కేంద్రంగా మెదక్ కోట, పోచారం రిజర్వాయర్, పోచారం అభయారణ్యం, ఏడుపాయల దేవాలయం, నర్సాపూర్ అటవీ ప్రాతం, మంజీరా అభయారణ్యం, సింగూర్ డ్యామ్ లను పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దనున్నారు.
- వరంగల్ కోట,భద్రకాళీ దేవాలయాలు, పాఖాల సరస్సు, గూడూరు వన్యప్రాణుల అభయారణ్యాలను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు.
-నల్గొండ లోని పానలగ్ దేవాలయాలు, దేవరకొండ కోట, పాలకుర్తిలోని బమ్మెర, పెంబర్తి హస్తకళల కేంద్రం, చేర్యాల, వాల్మిడి, జఫర్ గడ్ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు.
-కరీంనగర్ జిల్లాలోని ఎలగందల్ కోట, సిల్వర్ ఫిలిగ్రీ, మంథనీ దేవాలయాలు, రామగిరి కోటలను అభివృద్ధి చేయనున్నారు.
- చార్మినార్ క్లస్టరులో భాగంగా చార్మినా్, మక్కా మసీదు, లాడ్ బజార్, సాలార్జంగ్ మ్యూజియం, నిజాంమ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్, తారామతి బారాదరి, బుద్ధపూర్ణిమ, కీసరగుట్ట, నెట్ జీరో సిటీ, ఎకోపార్కు, శామీర్ పట సరస్సు, అర్బన్ ఫారెస్ట్ పార్కులకు కొత్త కళ కల్పించనున్నారు.
- నల్లమల సర్క్యూట్ లో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు, ఫర్హాబాద్, సలేశ్వరం, మల్లెలతీర్థం, మన్ననూర్, ఉమామహేశ్వరం దేవాలయం, మాధవస్వామి దేవాలయం, బేది ఆంజనేయస్వామి దేవాలయాలకు కొత్త కళ కల్పించనున్నారు.
- సిద్ధిపేటలోని రంగనాయక సాగర్, దేవాలయం, అన్నపూర్ణరిజర్వాయర్, వర్గల్ రాక్ ఆర్ట్స్, గొల్లభామ క్రాఫ్ట్, శ్రీరాంసాగర్ రిజర్వాయర్, సప్తగుండాల జలపాతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు.
- జన్నారంలోని కడెం జలాశయం, కవ్వాల్ పులుల అభయారణ్యం, ట్రైబల్ క్లస్టరులోని జోడేఘాట్, ఉట్నూర్, ఉషేగాం, కేస్లాపూర్, కాగజ్ నగర్ టైగర్ ల్యాండ్ స్కేప్, మహబూబ్ నగర్ కోయిల్ సాగర్, పిల్లలమర్రి, మన్యంకొండ, వికారాబాద్ లోని అనంత పద్మనాభస్వామి దేవాలయం, అనంతగిరి హిల్స్, కోటపల్లి,పరిగి, దామగుండం చెరువులు, నాగార్జునసాగర్ బుద్ధిస్ట్ హెరిటేజ్, బ్యాక్ వాటర్, ఐర్లాండులను తీర్చిదిద్దనున్నారు.
- పోచంపల్లి చరలు, నారాయణ పేట చేనేత వస్త్రాలు, గద్వాల్, కొత్తకోట చేతివృత్తులను ప్రోత్సహించనున్నారు. దీంతోపాటు తెలంగాణలోని కోరటికల్, కుంటా, పొచ్చెర, గాయత్రి జలపాతాల వద్ద పర్యాటకులకు సౌకర్యాలు కల్పించనున్నారు. కొండాపూర్, ధూళికట్ట, కారుకొండ, నేలకొండపల్లి, బుద్ధవనం, ఫణిగిరి, గాజులబండ ప్రాంతాలను బుద్ధిస్ట్ సర్క్యూట్ గా అభివృద్ధి చేయనున్నారు.
తెలంగాణ జరూర్ ఆనా అన్న ప్రపంచ సుందరీమణులు
మిస్ వరల్డ్ -2025 పోటీలు విజయవంతం కావడంతో తెలంగాణ పర్యాటక శాఖ వృద్ధిపై ఆశలు పెట్టుకుంది. ప్రపంచ దేశాల అందాల భామలు తెలంగాణ జరూర్ ఆనా అంటూ ప్రచారం చేశారు. దీంతో ప్రపంచ పర్యాటకుల చూపు తెలంగాణ రాష్ట్రం అందులోనూ హైదరాబాద్ వైపు పడింది. పర్యాటకాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం 2025-2030 టూరిజం పాలసీని ఖరారు చేసింది.మిస్ వరల్డ్ -2925 పోటీలు హైదరాబాద్ లో విజయవంతంగా నిర్వహించడంతో తెలంగాణ పర్యాటక స్థలాలు, హైదరాబాద్ ప్రాధాన్యం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.తెలంగాణ జరూర్ ఆనా (TelanganaZarurAana) అంటూ ప్రపంచ సుందరీమణులు పిలుపు ఇవ్వడంతో తెలంగాణ పర్యాటక రంగం బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఆహార ఉత్సవాలు, మేళాలు
తెలంగాణ చేనేత, చేతిపనులు, కళలు, వంటకాలతో ఆహార ఉత్సవాలు, మేళాల నిర్వహణ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. పాఠశాల విద్యార్థులకు తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక, వారసత్వ పర్యాటక కేంద్రాల సందర్శన కల్పించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధికి సదస్సులు, రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఎన్నెన్నో పండుగలు, ఉత్సవాలు
బతుకమ్మ పండుగ, తెలంగాణ క్రీడా ఉత్సవం,బోనాలు పండుగ, రంజాన్ పండుగ,అంతర్జాతీయ బౌద్ధ ఉత్సవం నృత్యం, నాటక ఉత్సవం,కాకతీయ ఉత్సవం, అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం,వంటల పండుగలు, పిల్లల చలనచిత్రోత్సవం,తెలంగాణ చేతిపనుల ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆధారిత బతుకమ్మ ఉత్సవాన్ని ఒక ప్రత్యేకమైన రాష్ట్ర ఉత్సవంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.హైదరాబాదీ బిర్యానీ, హలీమ్, తెలంగాణ వంటకాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించనున్నారు.