‘రాజకీయాలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్’
యుద్ధం మీ సొంత వ్యవహారం కాదు… దేశ భద్రత అంశం. మోదీ ప్రభుత్వం దేశ భద్రతను ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు.;
ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మరో ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ ఆదేశం మేరకు మేడ్చల్లోని బాచుపల్లిలో కాంగ్రెస్ ‘జైహింద్ ర్యాలీ’ నిర్వహించింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావు లేదని అన్నారు. రాజకీయాలకు అతీతంగానే ఆపరేషన్ సిందూర్ జరిగిందని, అందులో భారత సైన్యం విజయవంతంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. ‘‘పహల్గామ్ లో భారతీయుల గుండెల్లో తూటాలు దించిన ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండొద్దని ఆనాడు నెక్లెస్ రోడ్ వేదికగా నినదించాం. ప్రపంచ పటంలో పాకిస్థాన్ కనిపించొద్దని…ఇందుకు ప్రధానికి మనమంతా మద్దతుగా ఉంటామని ప్రకటించాం’’ అని అన్నారు
‘‘మీ అభిమానం, మీ శ్రమ ఫలితమే ఇవాళ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడ్డా. అఖిలపక్ష భేటీకి హాజరై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే స్పష్టంగా కేంద్రానికి మద్దతు పలికారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలుపుకునేందుకు పాక్ పై యుద్ధం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. కానీ నాలుగు రోజుల యుద్ధం తరువాత ఏం జరిగిందో గానీ అర్ధాంతరంగా మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని ముగించింది. యుద్ధ విరమణ చేసే ముందు ఎందుకు అఖిలపక్షం అభిప్రాయం తీసుకోలేదు..? గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధ తంత్రాన్ని నడిపించగలడు.. ఆనాడు చైనాపై యుద్ధం ప్రకటించి చైనాకు గట్టిగా బుద్ధి చెప్పిన ఘనత ఇందిరమ్మది’’ అని పేర్కొన్నారు.
‘‘మన ఆర్మీ జవాన్ కల్నల్ సంతోష్ ను చైనా పొట్టన పెట్టుకుంటే మోదీ కనీసం చైనాకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయలేదు. 1971 లో భారత్- పాక్ యుద్ధ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పిన ధీశాలి ఇందిరమ్మ. ఆనాటి యుద్ధంలో ఇందిరమ్మ పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసి చూపారు. ఇందిరమ్మ స్ఫూర్తితో పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయాలని.. ఇందుకు మద్దతుగా ఉంటామని నేను ప్రకటించా… దేశ ప్రజలు వీరతిలకం దిద్ది యుద్ధం చేయమంటే ట్రంప్ చెప్పాడని మోదీ యుద్ధం విరమించారు. మరి ఇవాళ దేనికోసం బీజేపీ నేతలు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు?’’ అని చెప్పుకొచ్చారు.
‘‘యుద్ధం మీ సొంత వ్యవహారం కాదు… దేశ భద్రత అంశం. మోదీ ప్రభుత్వం దేశ భద్రతను ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే… వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కాంగ్రెస్ జైహింద్ యాత్ర చేపట్టింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, గాంధీ కుటుంబానిది. మోదీ కాలం చెల్లిన నాణెం లాంటి వారు… దేశానికి రాహుల్ గాంధీ లాంటి నాయకుడు కావాలి … రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చూసే వరకు మనం విశ్రమించొద్దు’’ అని పిలుపునిచ్చారు.