కాంగ్రెస్‌లో నేతల మధ్య కూడా సఖ్యత లేదా..!

మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలపైనే మాట్లాడాలి.;

Update: 2025-06-16 10:49 GMT

తెలంగాణ కాంగ్రెస్.. అందిస్తున్న సంక్షేమ పథకాలకన్నా అంతర్గత వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. పదవులు, ప్రాధాన్యతలు ఇలా అనేక కారణాలతో నేతల అనుచరులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. పార్టీ ఆఫీసులు, గాంధీ భవన్‌లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. కాంగ్రెస్ మహిళా నేతలు సైతం పార్టీ పదవుల కోసం పార్టీ పెద్దలను నిలదీశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా వింగ్ అధ్యక్షురాలు సునీతరావు.. నిరసనకు కూడా దిగారు. దీంతో వెంటనే అధిష్ఠానం రంగంలోకి దిగి విషయాన్ని హ్యాండిల్ చేసింది. కాగా ఇప్పుడు చిన్న నేతల్లోనే కాదు.. పెద్దనేతల మధ్య కూడా సఖ్యత లేదన్న విషయం స్పష్టమవుతోంది. మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనం.

ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడీ నడుస్తోంది. ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. అదే విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందించాలని బీఆర్ఎస్ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేసేలా కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కాంగ్రెస్‌కు చాలా సున్నితమైన అంశంగా మారింది. అందుకే ఈ విషయంపై ఏ నేత కూడా పెద్దగా మాట్లాడటం లేదు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఇది కాస్తా పార్టీలో వివాదాలకు దారితీశాయి. పొంగులేటి ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీలో చర్చించకుండా అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారు? అని నిలదీశారు.

పొంగులేటి ఏమన్నారంటే..

నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని పొంగులేటి అన్నారు. ప్రజా సమస్యలను తీర్చడమే ధ్యేయంగా అంతా పనిచేయాలని సూచించారు. ‘‘స్థానిక ఎన్నికలకు రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని, ఎన్నికలకు సిద్ధం కావాలి. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే. గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించుకోవడం మాత్రమే కాదు.. వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలి. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది” అని స్పష్టం చేశారు.

ఇదెక్కడి పద్దతి: మహేష్ కుమార్

ప్రస్తుతం కాంగ్రెస్‌లో తీవ్ర గందరగోళానికి దారితీస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. పార్టీలో చర్చించకుండా ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. అసలు ఇదెక్కడి పద్దతి అని ఆగ్రహం వ్యక్తం చేరశారు. క్యాబినెట్‌లో చర్చించాల్సిన విషయాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. ‘‘ఒకరి మంత్రిత్వశాఖ అంశంపై మరొకరు మాట్లాడం ఏంటి? కోర్డు పరిధిలో ఉన్న అంశంపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలపైనే మాట్లాడాలి. సున్నితమైన, కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని సూచించారు.

Tags:    

Similar News