‘బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలి’

బ్రిటిష‌ర్ల కంటే బీజేపీ నాయ‌కులు ప్ర‌మాద‌కారులు.. మోదీకి వ్య‌తిరేకంగా పోరాడేందుకు మ‌న‌మంతా సిద్దంగా ఉండాలని రేవంత్ పిలుపునిచ్చారు.;

Update: 2025-04-09 11:51 GMT

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మోదీ పరివార్.. గాడ్సే పరివార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ ప్రసంగించారు. ఇచ్చిన మాట మీద నిలబడిన నేత రాహుల్ గాంధీ అని, దేశంలో కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశం తిరోగమనం చెందుతూ వచ్చిందని విమర్శించారు.

‘‘మ‌హ‌త్మా గాంధీ, స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ల గ‌డ్డ‌పైన, స‌బ‌ర్మ‌తీ న‌ది ఒడ్డున రెండు రోజులుగా మ‌నం మేధో మ‌ద‌న (చింత‌న్ బైఠ‌క్‌) స‌ద‌స్సు జ‌రుపుకుంటున్నాం. అధికారం చేప‌ట్టిన త‌ర్వాత దేశంలో మోదీ చేస్తున్న విభ‌జ‌న రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌ను ఏకం చేసేందుకు స‌బ‌ర్మ‌తీ ఒడ్డున మ‌నం ఇక్క‌డ స‌మావేశ‌మ‌య్యాం. గాంధీజీ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో మ‌నం ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.

‘‘గాడ్సే ఆలోచ‌న విధానాన్ని దేశంలో వ్యాపింప‌జేసేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌య‌త్నిస్తున్నారు. గాడ్సే వార‌సుల ఆలోచ‌న ధోర‌ణిని అడ్డుకునేందుకు గాంధీ కుటుంబ స‌భ్యులు, రాహుల్ గాంధీ గారి మిత్రులు, దేశ న‌లుమూలల ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ మోదీకి వ్య‌తిరేకంగా పోరాడాలి. మోదీ రైతుల‌కు వ్య‌తిరేకంగా న‌ల్ల చ‌ట్టాలు తెచ్చారు.. వాటికి వ్య‌తిరేకంగా రైతులు 14 నుంచి 15 నెల‌లు ధ‌ర్నాలు చేసినా చ‌ర్చ‌ల‌కు రాలేదు. మోదీ మణిపూర్‌లో మంట‌లు రాజేశారు.. దేశ మూల వాసుల జీవ‌న హ‌క్కును కాల‌రాసే ప్ర‌య‌త్నం మోదీ చేశారు. మరో వైపు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నాలుగు వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేశారు. కుల గ‌ణ‌న‌, రైతు రుణ మాఫీ, యువతకు ఉద్యోగాల క‌ల్ప‌న‌, మహిళల సంక్షేమంపై ఆయ‌న వాగ్దానాలు చేశారు’’ అని గుర్తు చేశారు.

‘‘పాద‌యాత్ర‌లో భాగంగా తెలంగాణ‌కు వ‌చ్చినప్పుడు కుల గ‌ణ‌న‌, రైతు రుణ‌మాఫీ, నిరుద్యోగ నిర్మూల‌న‌, మ‌హిళ‌ల సంక్షేమానికి రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారు. రాహుల్ గాంధీ వాగ్దానం మేర‌కు ప్రకారం తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప‌ది నెల‌ల్లోనే 25 ల‌క్ష‌ల కుటుంబాల‌కు రూ.21 వేల కోట్లు రుణ‌మాఫీ చేశాం. మేం తెలంగాణ‌లో కుల గ‌ణ‌న చేసి చూపించాం. కుల గ‌ణ‌న‌పై రాహుల్ గాంధీ లోక్‌స‌భ‌లో మాట్లాడాతార‌నే భ‌యంతో ఆయ‌న‌కు లోక్‌స‌భ‌లో మోదీ మైక్ ఇవ్వ లేదు. ప్ర‌తి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. పదకొండు సంవ‌త్స‌రాలు దాటిపోయింది.. ఈ లెక్క‌న 20 కోట్ల‌కు పైగా ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇచ్చారా?’’ అని ప్రశ్నించారు.

‘‘మోదీ, అమిత్ షాకు ఇద్ద‌రికే ఉద్యోగాలు వ‌చ్చాయి. ప్ర‌తి ఏటా 2 కోట్ల యువ‌కుల‌కు ఉద్యోగాలు రాలేదు. దేశంలోని మూల‌మూల‌న ఉన్న గాంధేయ‌వాదులు మోదీ వ్య‌తిరేక పోరాటంలో రాహుల్‌గాంధీకి అండ‌గా నిల‌వాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నా. గాంధీ ఆలోచ‌న‌ధార‌తో ఉన్న మన‌మంతా గాడ్సే వార‌సులను, మోదీని ఓడించాలి. రైతులు, యువ‌త‌, మ‌హిళ‌ల కోసం సీడ‌బ్ల్యూసీలో సాగిన చ‌ర్చ‌ల‌పై ఆశ‌తో నేను ఇక్క‌డి నుంచి వెన‌క్కు వెళుతున్నా. తెలంగాణలో మేం బీజేపీకి అవ‌కాశం ఇవ్వం... గుజరాత్ గ‌డ్డ‌పై నుంచి నేను చెబుతున్నా.. మేం నిజాం ప్ర‌భుత్వం కింద ఉన్న‌ప్పుడు జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ నాయ‌క‌త్వంలో వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో మాకు స్వాతంత్య్రం వ‌చ్చింది’’ అని అన్నారు.

‘‘అందుకే గుజరాత్ ప్ర‌జ‌ల‌తో, వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ వార‌సుల‌తో మా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సంబంధం ఉంది. మాకు స్వాతంత్య్రం ప్ర‌సాదించిన వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌తో మాకు హృద‌య‌పూర్వ‌క‌మైన బంధం ఉంది. మాకు స్వాతంత్య్రం వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఇచ్చారు.. తెలంగాణ‌ను మాకు సోనియా గాంధీ అందించింది. వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ భూమి నుంచి నేను ఒక్క‌టే చెబుతున్నా... సోనియా గాంధీ నాయకత్వంలో మేం బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. బీజేపీని అడ్డుకుంటాం.. వారిని ఎవ‌రూ క్ష‌మించ‌రు. గాంధీజీ బ్రిటిష్ పాల‌న‌కు వ్యతిరేకంగా దండి స‌త్యాగ్ర‌హంతో పాటు 30 ఏళ్ల పాటు అనేక పోరాటాలు చేశారు.. .కానీ బ్రిటిష్‌వాళ్లు ఎప్పుడూ గాంధీజీ మీద లాఠీ ప్రయోగం చేయలేదు’’ అని చెప్పారు.

‘‘స్వాతంత్య్రం వ‌చ్చిన ఆరు నెలల్లోనే గాడ్సే వార‌సులు గాంధీజీపై తుటా పేల్చి ఆయ‌న‌ను హ‌త్య చేశారు. బ్రిటిష‌ర్ల కంటే బీజేపీ నాయ‌కులు ప్ర‌మాద‌కారులు... బ్రిటిష‌ర్ల‌ను దేశం నుంచి త‌రిమికొట్టిన‌ట్లే రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో మ‌నమంతా బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలి. మోదీకి వ్య‌తిరేకంగా పోరాడేందుకు మ‌న‌మంతా సిద్దంగా ఉండాలి. తెలంగాణ‌లో బీజేపీని అడ్డుకునేందుకు, ఓడించేందుకు మేం ఇక్క‌డి నుంచి ఆశ‌ను, ఆదేశాన్ని తీసుకొని వెళుతున్నాం. రానున్న రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్య‌తను ప్ర‌తి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌, గాంధీ వార‌సులు ఇక్క‌డి నుంచి తీసుకొని వెళ్లాల‌ని నా విజ్ఞ‌ప్తి’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News