ముగ్గురు లక్కీ ఎంఎల్ఏలు ఎవరు ?
రాజ్ భవన్ నుండి మంత్రివర్గ విస్తరణపై ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని పార్టీవర్గాల సమాచారం;
ఆ అదృష్టవంతులు ముగ్గురు ఎవరు ? ఇపుడిదే ప్రశ్న అధికార కాంగ్రెస్ ఎంఎల్ఏల్లో బాగా పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే ఆదివారం ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మంత్రివర్గంలో ఇపుడు రేవంత్ తో కలిసి 12 మంది మంత్రులున్నారు. మరో ఆరుగురికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి విస్తరణలో ముగ్గురికి మాత్రమే అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముగ్గురిని మాత్రమే అదనంగా క్యాబినెట్లో చేర్చుకోవాలని రేవంత్ కు చెప్పింది కాబట్టే ఆ లక్కీ ముగ్గురు ఎవరు ? అన్న ప్రశ్న పెరిగిపోతోంది. బహుశా ఈరోజు సాయంత్రానికి ముగ్గురు ఎవరన్న విషయంలో క్లారిటి వచ్చే అవకాశముంది. రాజ్ భవన్ నుండి మంత్రివర్గ విస్తరణపై ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని పార్టీవర్గాల సమాచారం.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మంత్రివర్గంలో చోటుకోసం చాలామంది ఎంఎల్ఏలు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి(Komatireddy), మల్ రెడ్డి రంగారెడ్డి, బీర్ల ఐలయ్య, విజయశాంతి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శనరెడ్డి, అద్దంకి దయాకర్, ఎస్టీ ఎంఎల్ఏలు చాలామంది ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఏ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వబోతున్నారన్న విషయం కూడా సస్పెన్సుగా మారిపోయింది. ఎందుకంటే బీసీలకు పెద్దపీట వేయాలని బీసీ ఎంఎల్ఏలు, తమకు అవకాశం ఇచ్చి తీరాలని ఎస్సీల్లో మాలలు, మాదిగలు, 2023 ఎన్నికల్లో హామీలిచ్చారు కాబట్టి తమకు అవకాశం ఇవ్వాల్సిందే అని కోమటిరెడ్డి, వివేక్..ఇలా ఎవరి వాదన వాళ్ళు వినిపించుకుంటు ఇటు రేవంత్ తో పాటు అటు అధిష్ఠానం దగ్గర తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. రేవంత్ తో కలిపి ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్లు నలుగురు ఉన్నారు కాబట్టి రెడ్డి సామాజికవర్గాన్ని పక్కన పెట్టే అవకాశం కూడా ఉందని సమాచారం.
మంత్రివర్గ విస్తరణలో ఎవరిని తీసుకోవాలన్నా, ఎవరిని పక్కనపెట్టాలన్నా సామాజికవర్గాలు, సీనియారిటి, ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకునే ఇంతకాలం రేవంత్+అధిష్ఠానంలో అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. మొదట్లో నలుగురు లేదా ఐదుగిరితో మంత్రివర్గాన్ని విస్తరించాలని రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్ఠానం తాజాగా ముగ్గురికి మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించింది. కారణం ఏమిటంటే తొందరలోనే మరో విస్తరణ ఉంటుందన్న సంకేతాలు ఇచ్చి అసంతృప్తులను బుజ్జగించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది. ఏదేమైనా లక్కీ ముగ్గురు ఎవరో తేలాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయక తప్పదు.