ఓపెన్ కోర్టును కేసీఆర్ వద్దన్న కారణమిదేనా ?
విచారణ సమయంలో గదిలో జస్టిస్ పీసీ ఘోష్-కేసీఆర్, కమిషన్ కార్యదర్శి మురళీధర్ మాత్రమే ఉన్నారు;
చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించానని చెప్పుకునే కేసీఆర్ బహిరంగ విచారణను ఎందుకు వద్దనుకున్నారు ? బుధవారం మధ్యాహ్నం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. 50 నిముషాలు జరిగిన విచారణ వన్ టు వన్ పద్దతిలో జరిగింది. ఇప్పటివరకు విచారణకు హాజరైన వారంతా ఓపెన్ కోర్టు పద్దతిలోనే కమిషన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే కేసీఆర్(KCR) మాత్రమే ఇన్ కెమెరా పద్దతిలో తనను విచారించాలని కమిషన్ను రిక్వెస్టు చేశారు. కమిషన్ కూడా కేసీఆర్ రిక్వెస్టుకు సానుకూలంగా ఇన్ కెమెరా విచారణే చేసింది. విచారణ సమయంలో గదిలో జస్టిస్ పీసీ ఘోష్-కేసీఆర్, కమిషన్ కార్యదర్శి మురళీధర్ మాత్రమే ఉన్నారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కమిషన్ విచారణకు హాజరైన 114 మందిలో ఎవరూ తమను ఇన్ కెమెరా పద్దతిలో విచారించమని అడగలేదు. అలాంటిది కేసీఆర్ మాత్రమే ఎందుకని ఇన్ కెమెరా విచారణ కోరుకున్నారు ? ఎందుకంటే దీనికో నేపధ్యముంది. అదేమిటంటే ఇన్ని సంవత్సరాలుగా ఎవరినైనా కేసీఆర్ ప్రశ్నించటమే కాని తనను ఎవరూ ప్రశ్నించిందిలేదు. తనను ఒకళ్ళు ప్రశ్నించటాన్నే కేసీఆర్ తట్టుకోలేరు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేసీఆర్ వందలాది మీడియా సమావేశాలను నిర్వహించుంటారు. అందులో తనను ఇబ్బందిపెట్టేట్లుగా ఎవరైనా రిపోర్టరు ప్రశ్నవేయగానే కేసీఆర్ కు మండిపోయేది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రిపోర్టరును బాగా అవమానించేవారు. రిపోర్టును పట్టుకుని ‘నీకు ధిమాకుందా ? నీకు తలకాయుందా ? నీదే పేపర్ ? నీదే ఛానల్’ ? అంటు అందరిముందు బాగా చులకనగా మాట్లాడేవారు. కేసీఆర్ ధోరణిని గమనించిన మిగిలిన మీడియా కూడా నోరెత్తటం మానేసింది. ఈ విధంగా మీడియా నోరుమూయించేశారు.
అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష సభ్యుల నోళ్ళు లేవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీలను చీల్చి చెండాడేశారు. పై పార్టీల్లోని ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి బీఆర్ఎస్ లోకి లాగేసుకున్నారు. టీడీపీని నామరూపాలు లేకుండా చేసిన కేసీఆర్ కాంగ్రెస్ ను కూడా అంతపనీ చేశారు. టీడీపీ(TDP) ఎంఎల్ఏగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ఒక్కడే ధీటుగా కేసీఆర్ తో పాటు కేటీఆర్(KTR), కవిత(Kavitha)పైన విరుచుకుపడేవాడు. ఆసమయంలోనే రేవంత్ ఓటుకునోటు(Note for Vote)లో ఇరుక్కుని కొంతకాలం జైలుకు వెళ్ళాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీ నుండి నెలపాటు సస్పెండ్ చేయించారు. అసెంబ్లీలో రేవంత్ నోరెత్తకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఏదో కారణంతో అరెస్టుచేయించి జైలుకు పంపించారు. దాంతో అసెంబ్లీలో తనకు ఎదురు మాట్లాడే సభ్యులను లేకుండా కేసీఆర్ చేసుకున్నారు.
ఇక పార్టీలో, ప్రభుత్వంలో కేసీఆర్ ను ప్రశ్నించేంత దమ్ము ఎవరిలో ఉంది ? ఈపద్దతిలో దాదాపు పదేళ్ళు తనను ఎవరు ప్రశ్నించకుండా జగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేకతెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పనిచేసిన ఉద్యమకారుల్లో కొందరు కేసీఆర్ పై ఆరోపణలు, విమర్శు చేసినా వారిని లెక్కచేయలేదు. అయితే కాలం ఎల్లకాలం ఒకటిగా ఉండదన్న విషయాన్ని కేసీఆర్ మరచిపోయారు. 2023 ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ వ్యతిరేకశక్తులన్నీ ఒక్కసారిగా విజృంభించాయి. పైగా తమకు బద్ధశతృవైన రేవంత్ ముఖ్యమంత్రి అవటాన్ని కేసీఆర్ అసలు జీర్ణించుకోలేకపోయారు. అసెంబ్లీలో తనను నిలదీస్తారని, వారికి సమాధానాలు చెప్పుకోవాల్సొస్తుందనే కేసీఆర్ అసెంబ్లీ సమవేశాలకు వెళ్ళటమే మానుకున్నారు.
తనకు వ్యతిరేకంగా జనాల్లో, రాజకీయపార్టీల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతకు సమాధానం చెప్పుకోవాల్సొస్తుందని చివరకు ఫామ్ హౌస్ వదిలి బయటకు రావటమే మానుకున్నారు. అలాంటి కేసీఆర్ ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరవ్వాల్సొచ్చింది. మీడియా సమావేశాల్లో రిపోర్టర్లను తిట్టినట్లు లేదా ఉన్నతాధికారులను చులకనగా మాట్లాడినట్లు కమిషన్(Kaleswaram Commission) విచారణలో మాట్లాడితే కుదరదు కదా. జ్యూడిషియల్ కమిషన్ విచారణలో నోటికొచ్చినట్లు కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జగ్రత్తగా సమాధానాలు చెప్పాలి. తనను ప్రశ్నించటాన్ని తట్టుకోలేని కేసీఆర్ కమిషన్ ముందు పొందికగా సమాధానాలు చెప్పటాన్ని అవమానంగా భావించారేమో. అందుకనే ఇన్ కెమెరా విచారణను కోరుకున్నారు. ఓపెన్ కోర్టు విచారణ అయితే పార్టీ నేతలతో పాటు ఇతరులు కూడా చాలామంది ఉంటారు.
కమిషన్ విచారణలో తాను ఏవిధంగా సమాధానాలు చెబుతున్నది అందరు గమనిస్తారు. అందరిముందు తాను జాగ్రత్తగా కమిషన్ కు సమాధానాలు చెప్పుకోవటాన్ని కేసీఆర్ అవమానంగా భావించినట్లున్నారు. అందుకనే ఓపెన్ కోర్టు కాకుండా ఇన్ కెమెరా విచారణ కోరుకున్నారు. అందుకు తనకు ఆరోగ్యం సరిగాలేదని, జలుబు చేసిందని చెప్పారని ప్రచారం జరుగుతోంది. అనారోగ్యమైనా, జలుబుచేసినా, ఓపెన్ కోర్టయినా, ఇన్ కెమెరా అయినా కమిషన్ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలైతే చెప్పకతప్పదు. ఓపెన్ కోర్టయితే తాను సమాధానాలు చెప్పటం అందరికీ తెలిసిపోతుంది. అదే ఇన్ కెమెరా అయితే బయటవాళ్ళకు లోపల ఏమి జరిగిందో తెలీదు కాబట్టి విచారణ తర్వాత బయటవాళ్ళకు కేసీఆర్ ఏమి చెబితే అంతే.
కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగకపోతే, తనతప్పు ఏమీలేకపోతే అదే విషయాన్ని ఓపెన్ కోర్టులోనే చెప్పవచ్చు. తనపైన ఆరోపణలకు కేసీఆర్ ధీటుగా సమాధానం చెప్పారన్న సంకేతాలు జనాలకు అందేవి. అలా కాకుండా ఇపుడు విచారణ ఇన్ కెమెరా పద్దతిలో జరగటంతో బహిరంగ విచారణకు కేసీఆర్ భయపడ్డారనే ప్రచారం పెరిగిపోతోంది. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని ప్రచారం చేసుకునే బాహుబలి లాంటి కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ ఓపెన్ కోర్టు విచారణను ఎదుర్కొనే దమ్ములేదా అని కాంగ్రెస్ నేతలు ఎద్దేవాచేస్తున్నారు. మరి దీనికి కేసీఆర్ ఏమి సమాధానం చెబుతారో చూడాలి.