తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందా? అంటే అవునంటున్నారు తెలంగాణ మంత్రి. ‘‘తెలంగాణపై ఎందుకు ఇంత వివక్ష? గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇచ్చి, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదా?’’ అని కేంద్రంపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నల వర్షం కురిపించారు.తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు బాధ్యత తీసుకోరా? అని ప్రశ్నించారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని పలుసార్లు కలిసి తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టుల గురించి పలు వినతిపత్రాలు సమర్పించినా కేంద్రం నుంచి స్పందన లేదు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఆ తర్వాత కలిసి అభివృద్ధి చేస్తామని, ప్రధాని తన బడే భయ్యా అని రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. అయినా తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించలేదు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులున్నా తెలంగాణకు పెండింగ్ ప్రాజెక్టులు మంజూరు చేయించడంలో విఫలమయ్యారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 57 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్నాయి.
కేంద్రం వద్ద పెండింగ్ ప్రాజెక్టులెన్నో...
తెలంగాణ 57 పెండింగ్ ప్రాజెక్టులు కేంద్రప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్నాయి.హైదరాబాద్ లో నేషనల్ డిజైన్ సెంటరు ను ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించినా కేంద్రం ఈ ప్రతిపాదనలకు ఆమోదం ఇవ్వలేదు. తెలంగాణ టీఎస్ఎల్ఐపీసీ ఆధ్వర్యంలో రెండు మెగా లెదర్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ వద్ద పెండింగులోనే ఉంది. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సర్కారు కేంద్రానికి, ప్రధానమంత్రికి 2023 డిసెంబరు 26వతేదీన, 2024 జనవరి 4వతేదీన రెండు లేఖలు రాసినా స్పందన లేదు. షెడ్యూల్ 9 కింద ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల ఆస్తుల పంపకాలు ఇంకా చేయలేదు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్ పెండేచర్ నిధులను కేంద్రం విదల్చలేదు. టీఎస్ న్యాబ్. టీఎస్ సీఎస్ బీ సంస్థల ఆధునికీకరణ కోసం నిధులు రాలేదు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదననలు కేంద్రం వద్ద పెండింగులోనే ఉన్నాయి.
కేంద్రం స్పందన ఏది ?
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికిి నిధులు ఇవ్వాలని కోరినా కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేదు. ఖమ్మం జిల్లాలో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు కేంద్రం బుట్టదాఖలా చేసింది. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు 15 రోడ్లు నిర్మించాలని సీఎం ప్రధానికి, కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రికి లేఖలు రాసినా ప్రయోజనం లేదు. తెలంగాణకు గతంలో కేంద్రం మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టు అతీ గతీ లేకుండా పోయింది. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని ప్రతిపాదిస్తే అది కాకుండా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు నిధులేవి?
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులివ్వాలని కోరినా కేంద్రం కనికరించలేదు. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు బుట్టదాఖలా అయ్యాయి. కల్వకుర్తి- మాచర్ల కొత్త రైల్వే లైను నిర్మాణం పట్టాలెక్కలేదు. హైదరాబాద్- కల్వకుర్తి హైవే అప్ గ్రేడ్ కాగితాల్లోనే ఉంది. ఇంటింటికి నల్లా పథకం కింద మంచినీరు అందించే ప్రాజెక్టుకు జలశక్తి మిషన్ నుంచి నిధులు కేటాయించాలని కోరినా రాలేదు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం కింద తెలంగాణ కు రావాల్సిన నిధులు రాలేదు. సేతు బంధన్ స్కీం కింద రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరినా రాలేదు. సింగరేణి కాలరీస్ కు బొగ్గు గనుల కేటాయింపు కాగితాల్లోనే ఉంది.
పెండింగులోనే సైనిక్ స్కూలు
ఎల్కతుర్తిలో సైనిక్ స్కూలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా కేంద్ర రక్షణ శాఖ పద్ద పెండింగులోనే ఉంది. హైదరాబాద్- నాగపూర్ హైవేను ఎలివేటర్ కారిడార్ కింద రాజీవ్ రహదారిని అభివృద్ధి చేయాలని కోరినా నిధుల జాడ లేదు. హైదరాబాద్ లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు కూడా పెండింగులోనే ఉంది. తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ క్రీడల పోటీల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, ఖేలో ఇండియా గేమ్స్, స్పోర్ట్సు యూనివర్శిటీ, స్పోర్ట్సు హబ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం నిధులు ఇవ్వాలని కోరినా కేంద్రం నుంచి స్పందన లేదు. భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, పెద్దపల్లి, అంతర్గాంలలో విమానాశ్రయాల నిర్మాణం ప్రతిపాదనలకు కేంద్ర పౌరవిమాన యాన శాఖ టేకాఫ్ చెప్పలేదు. వికారాబాద్ -కృష్ణా రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పచ్చజెండా ఊపలేదు. తెలంగాణలోని 16 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కేంద్ర విద్యాశాఖ వద్ద పెండింగులోనే ఉన్నాయి.
లేఖలు రాసినా మంజూరు కాని నిధులు
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు వారి వారి శాఖల తరపున పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విదల్చండి అంటూ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు అధికారిక లేఖలు రాశారు. వ్యక్తిగతంగా కేంద్ర మంత్రులను కలిసి తమ శాఖల తరపున వినతులను సమర్పించారు. సీఎం ప్రధానిని పలుసార్లు కలిసి తెలంగాణకు నిధులివ్వండి అని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదు. సీఎం, మంత్రులు ఇచ్చిన వినతులు బుట్టదాఖలా కాగా , తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించడం లేదు. ప్రాజెక్టుల సంగతి ఇలా ఉంటే కనీసం పుష్కరాలకు నిధులు కూడా ఏపీకి ఇచ్చి తెలంగాణ రిక్తహస్తం చూపించింది కేంద్రం.
ప్రధాని మోదీతో సీఎం మొదటి భేటీ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఎ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.2023 డిసెంబరు 26వతేదీన సీఎం మోదీని కలిశారు. ప్రధానితో జరిగిన మర్యాద పూర్వక భేటీలో తెలంగాణలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులు, వాటి సత్వర పరిష్కారానికి, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని ప్రదానమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
12అంశాలపై ప్రధానికి వినతి పత్రం
తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం వద్ద పెండింగులో ఉన్న కీలకమైన 12 అంశాలపై సీఎం ఎ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వినతి పత్రం సమర్పించారు. 2024వ సంవత్సరం జులై 4 జులై 4వతేదీన భేటీలో పలు తెలంగాణ పెండింగు ప్రాజెక్టుల గురించి వారు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. కేంద్రం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును తొలగించి, సింగరేణికి కేటాయించాలని,కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3 గనులను సింగరేణికి కేటాయించాలి వారు కోరారు.తెలంగాణకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) మంజూరు చేయాలని ప్రధానమంత్రికి విన్నవించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్టు పునరుద్ధరించాలని,కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని కోరారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణను చేర్చాలని, రాబోయే 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
పెండింగులోనే ప్రాజెక్టులు...
పెండింగ్లో ఉన్న బీఆర్ జీఎఫ్ (BRGF)గ్రాంట్ ను తక్షణం విడుదల చేయాలని ,రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని, ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వారు ప్రధానిని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తించి,భారత్ మాల పరియోజనలో దీనిని కలపాలని, 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని సూచించారు.కొత్త జిల్లాల్లో 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని సీఎం ప్రధానికి విన్నవించారు.
తెలంగాణ రైజింగ్ విజన్ కు మద్ధతు ఇవ్వండి : సీఎం
తెలంగాణ రైజింగ్ విజన్ కు మద్ధతు ఇవ్వాలని, తద్వారా 1 ట్రిలియన్ జీడీపీ లక్ష్యాన్ని సాధించ గలమని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ రావులు ప్రధాన మత్రి నరేంద్రమోదీని ఈ ఏడాది ఫిబ్రవరి 26వతేదీన కలిసి విన్నవించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం సహకారం అందించాలని వారు కోరారు. కీలకమైన మౌలిక సదుపాయాలు, పట్టణ పరివర్తన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసి, నిధుల మద్దతు కోసం ప్రధానమంత్రిని వారు అభ్యర్థించారు.
బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించండి
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ -1980 (జీడబ్ల్యూడీటీ), ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం – 2014 లకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎం కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు.బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని చెప్పారు.జాతీయ ప్రాజెక్టు పోలవరం విషయంలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తే.. పోలవరం - బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చి ఇచ్చంపల్లి - నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు.
తెలంగాణకు నిధుల కోసం మోదీని 50 సార్లు అయినా కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొని రావడానికి, పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను పొందడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 50 సార్లు అయినా కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.‘‘ఎన్నికల సమయంలోనే రాజకీయాలు జరుగుతాయి. ఎన్నికల తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్రం మద్దతు తీసుకుంటాం. మేం ప్రధాని నరేంద్ర మోదీని ఒక్కసారి కాదు, 50 సార్లు కూడా కలుస్తాం. మాకు రావాల్సిన నిధులను మేము సేకరిస్తాం. అవసరమైన అనుమతులు మాకు లభిస్తాయి’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి, అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం,ప్రతిపక్షాల సహకారం కావాలని కోరారు.ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని,కీలకమైన ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొనాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కె చంద్రశేఖర్ రావును కూడా సీఎం కోరారు.
తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో మోదీ భేటి
తెలంగాణ రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిదులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి మాట్లాడారు. కాని తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టుల ఊసు ఎత్తకుండా తెలంగాణలో బీజేపీ పటిష్ఠానికి తీసుకోనున్న చర్యలపై మాట్లాడారు.కనీసం తెలంగాణ సమస్యల గురించి ప్రధాని వద్ద బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రస్తావించలేదు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరిలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర సమస్యలపై ఇటీవల వినతిపత్రాన్ని సమర్పించారు.