మావోయిస్టులకు ‘మార్చి’ డెడ్ లైనా ?
గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఇపుడు మావోయిస్టులు(Maoists) నిర్బంధాన్ని ఎదుర్కుంటున్నది వాస్తవం;
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తాజా వ్యాఖ్యలు చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. హర్యానాలోని మానేసర్ లో నేషనల్ సెక్యూరిటి గార్డ్స్ (ఎన్ఎస్జీ) క్యాంపస్ ను సందర్శించిన సందర్భంగా బండి(Bandi Sanjay) మాట్లాడుతు 2026, మార్చి తర్వాత దేశంలో మావోయిస్టులు అన్నవాళ్ళే కనబడరని చెప్పారు. నక్సల్ రహిత దేశంగా మార్చటమే కేంద్రప్రభుత్వ కృతనిశ్చయంగా పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నక్సల్ ముక్త్ భారత్ నినాదాన్ని వాస్తవంచేయటం కోసమే కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాల సమన్వయంతో ఆపరేషన్ కగార్ మొదలుపెట్టినట్లు గుర్తుచేశారు. తాజాగా బండి చెప్పారని కాదుకాని గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఇపుడు మావోయిస్టులు(Maoists) నిర్బంధాన్ని ఎదుర్కుంటున్నది వాస్తవం.
ఎలాగైనాసరే మావోయిస్టులను ఏరేయాలన్న గట్టి నిర్ణయంతోనే ఆపరేషన్ కగార్ రూపంలో భద్రతాదళాలు ముందుకు దూసుకుపోతున్నాయి. మావోయిస్టుల టార్గెట్ గా భద్రతాదళాలు దశాబ్దాలుగా షెల్టర్ జోన్లుగా ఉన్న అడవులను కొద్దిరోజులుగా జల్లెడపడుతున్నాయి. దండకారణ్యంలోని చాలాప్రాంతాలు సంవత్సరాలుగా మావోయిస్టులకు పెట్టని కోటలుగా ఉన్నాయి. కర్రెగుట్టలు, దుర్గంగుట్టలు, అబూజ్ మడ్ అడవులు, ఇంద్రావతి నదీ పరివాహక ప్రాంతంలోని నేషనల్ ఫారెస్టు అడవుల్లోకి ఒకపుడు పోలీసులు అడుగుకూడా పెట్టలేకపోయేవారు. అలాగే ఆంధ్రా ఒడిస్సా బార్డర్ (ఏఓబీ)లోని వేలాదిఎకరాల్లో విస్తరించిన అడవుల్లోకి పోలీసులు వెళ్ళేవారు కాదు. అలాంటిది ఆపరేషన్ కగార్ ఏర్పాటైన తర్వాత మావోయిస్టులపై భద్రతాదళాలు స్పష్టమైన పైచేయి సాధించాయి.
సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, బస్తర్ ఫైటర్స్, రెగ్యులర్ పోలీసులతో సుమారు లక్షమందితో కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను ఏర్పాటుచేసింది. కేంద్రానికి మద్దతుగా తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని మెరికల్లాంటి పోలీసులు ఆపరేషన్ కగార్(Operation kagar) లో భాగస్వాములుగా ఉన్నారు. వీళ్ళకి అత్యంత అధునాతన ఆయుధాలు, ద్రోన్లవంటి సాంకేతికతను సమకూర్చటమే ఆపరేషన్ కగార్ సక్సెస్ కు కారణమైంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మద్దతుతో భద్రతాదళాలు అడవుల్లో మావోయిస్టులను అన్నీవైపుల నుండి కమ్ముకుని అష్టదిగ్బంధనం చేయగలుగుతున్నారు. ఇదేసమయంలో ఇన్ఫార్మర్ల వ్యవస్ధను కూడా భద్రతాదళాలు చాలా పటిష్టంగా తయారుచేసుకున్నాయి. దీనికారణంగానే మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, అందేలు భాస్కర్, గాజర్ల రవి లాంటి చాలామంది కీలక నేతలను మావోయిస్టులు కోల్పోయారు.
మావోయిస్టుల అసలు సమస్య ఏమిటి ?
మావోయిస్టుల్లోని చాలామంది అసలు సమస్య అనారోగ్యాలు, వృద్ధాప్యాలే అని సమాచారం. నాలుగువైపుల నుండి భద్రతాదళాలు కమ్ముకొస్తున్న కారణంగా జరిగిన ఎన్ కౌంటర్లలో వందలసంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. అలాగే వందలాది మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. గురువారం నాడు భద్రాచలం పోలీసుల ముందు 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గడచిన ఆరుమాసాల్లో సుమారు 300 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అలాగే వివిధ ఎన్ కౌంటర్లలో సుమారు 200 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇదేసమయంలో ఇఫుడున్న నాయకుల్లో కూడా చాలామంది వృద్ధాప్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ నుండి తమను తాము కాపాడుకోలేమని అనుకున్న మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టుల ముందు రెండే ఆప్షన్లున్నాయి. మొదటిది పోలీసుల ముందు లొంగిపోయి ప్రాణాలతో ఉండటం. రెండో ఆప్షన్ ఎన్ కౌంటర్లలో చనిపోవటం.
లొంగిపోయిన వారే ఆచూకీ పట్టిస్తున్నారా ?
లొంగిపోతున్న మావోయిస్టులే కీలక నేతల ఆచూకీని చెప్పి పట్టిస్తున్నట్లు మావోయిస్టు నేతలు మండిపోతున్నారు. బీజపూర్ జిల్లాలో ఒకే కుటుంబంలోని ముగ్గురిని ఇదేఅనుమానంతో మావోయిస్టులు మూడురోజుల క్రితం ప్రజాకోర్టు పెట్టి నరికి చంపేసి మరో పదిమందిని కిడ్నాప్ చేశారు. ఎన్ కౌంటర్లో నంబాల చనిపోవటానికి కూడా లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారమే కారణమని అనుమానిస్తున్నారు. నంబాలకు భద్రతగా ఉన్న వారిలో కొందరు లొంగిపోయారు. అలా లొంగిపోయిన వారే నంబాల ఆచూకీని భద్రతాదళాలు చెప్పి ఎన్ కౌంటర్ కు కారణమయ్యారని మావోయిస్టులు అనుమానిస్తున్నారు. చాలామంది అగ్రనేతల ఎన్ కౌంటర్ల వెనుక లొంగిపోయిన మావోయిస్టులే ఉన్నారన్న టాక్ బాగా నడుస్తోంది.
విషయం ఏదైనా భద్రతాదళాల దూకుడుకు మావోయిస్టులు తట్టుకోలేకపోతున్నది వాస్తవం. అందుకనే ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపేయాలని మావోయిస్టు కమిటి అధికార ప్రతినిధి అభయ్ పదేపదే బతిమలాడుకుంటున్నారు. కొద్దిమంది అగ్రనేతలు మాత్రమే ఉన్న మావోయిస్టులు ఆపరేషన్ కగార్ ను ఎంతకాలం తట్టుకుంటారో చూడాల్సిందే. బహుశా ఈవిషయంలో క్లారిటి ఉన్న కారణంగానే మార్చి తర్వాత దేశంలో మావోయిస్టులుండరని బండి సంజయ్ అంతగట్టిగా చెప్పింది. మార్చినాటికి ఏమవుతుందో చూడాల్సిందే.