అంబానీల ఇంట నేడే పెళ్ళి: రు.5 వేల కోట్లు ఖర్చు అంతర్జాతీయ గుర్తింపుకోసమేనా!

కోట్లమంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉండే ఈ దేశంలో ఇంత భారీవ్యయంతో పెళ్ళి నిర్వహించటం పేదరికాన్ని అపహాస్యం చేయటమేననే విమర్శ వినబడుతోంది.

Update: 2024-07-12 14:25 GMT

దాదాపు సంవత్సరమున్నర నుంచి సాగుతున్న అనంత్ అంబానీ పెళ్ళి వేడుకులు తుది దశకు చేరుకున్నాయి. ఈరోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు శుభముహూర్తంలో వధూవరులు ఒక్కటవబోతున్నారు. రేపు ఆశీర్వాద కార్యక్రమం, ఎల్లుండి రిసెప్షన్‌తో వేడుకలు ముగుస్తాయి. అయితే పెళ్ళి ఇంత మెగాస్థాయిలో జరపటంపై పలు విమర్శలు కూడా వినబడుతున్నాయి. కోట్లమంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉండే ఈ దేశంలో ఇంత భారీవ్యయంతో పెళ్ళి నిర్వహించటం పేదరికాన్ని అపహాస్యం చేయటమేనని విమర్శిస్తున్నారు. మరోవైపు ఇంతస్థాయిలో భారీఖర్చుతో పెళ్ళి చేయటానికి కారణం అంతర్జాతీయ వ్యాపార ప్రయోజనాలనే వాదన వినిపిస్తోంది.

“ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలు వేసి…” అంటూ కవులు, రచయితలు తమ రచనలలో చేసే వర్ణనలకు సరిపోయేటంత మహావైభవంగా అంబానీవారి ఇంట పెళ్ళి వేడుకలు జరుగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి తేడా రాకుండా సాఫీగా సాగిపోయేలా, అతిథులకు ఇది మరిచిపోలేని తీపి జ్ఞాపకంగా మిగిలేలా ప్రతి చిన్న విషయంపై రిలయెన్స్ సిబ్బంది అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనే అతిథులకు రెండున్నరవేల వంటకాలు వడ్డంచారు కనుక, పెళ్ళిలో ఇంకెన్ని వంటకాలు వడ్డిస్తారో అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు, అతిథులకోసం రిలయెన్స్ కంపెనీ 100 ప్రైవేట్ విమానాలను, మూడు ఫాల్కన్ జెట్ విమానాలను ఉపయోగించబోతోందని తెలిసింది. అంతర్జాతీయ అతిథులను దేశంలోని పర్యాటక కేంద్రాలకు తీసుకెళ్ళటానికి ఈ విమానాలను వాడతారని చెబుతున్నారు. గత మార్చిలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రంకోసం అక్కడి ప్రభుత్వం ఆ విమానాశ్రయానికి పదిరోజులపాటు ఇంటర్నేషనల్ స్టేటస్ ఇచ్చింది. వివాహ వేడుకలు బాంద్రా కర్లా కాంప్లెక్స్ అనే ప్రాంతంలో ఉన్న జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతున్నాయి.

ఇలా పెళ్ళి ఖర్చు ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. పెళ్ళిలో పెడుతున్న భోజనాలు, వాడుతున్న దుస్తులు, ఆభరణాలు మొదలైనవి వివాహ వేడుకల పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి. పసుపు వేడుకలో నీతా అంబానీ పెట్టుకున్న పచ్చల హారం ఒక్కదాని ఖరీదే 60 మిలియన్ డాలర్లు(రు.480 కోట్లు) అంటున్నారు. సంగీత్‌లో పాల్గొన్నందుకు ఇంటర్నేషనల్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు రు.80 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. గత సంవత్సరమున్నరగా ఈ వేడుకలలో బీబర్ కాకుండా రిహానా, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్, కేటీ పెర్రీ, ఆండ్రియా బొసెల్లీ, దిల్జిత్ దొసాన్జ్ వంటి అంతర్జాతీయ సింగర్‌లు ప్రదర్శనలు ఇచ్చారు. ఇవాళ - రేపు జరిగే వేడుకలలో నైజీరియన్ ర్యాపర్, కామ్ డౌన్ ఫేమ్ సింగర్ రేమా, మరో పాప్ సింగర్ అడెల్ ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. వివాహ వేడుకలకు అమెరికానుంచి కిమ్ కర్దషియాన్, ఖోల్ కర్దషియాన్, ప్రియాంకచోప్రా, నిక్ జొనాస్, డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్ జాన్ సేనా, బాలీవుడ్ నుంచి షారుక్, సల్మాన్, అమితాబ్, దీపిక తదితర స్టార్స్ హాజరవుతున్నారు. ఈ పెళ్ళి వెడ్డింగ్ ఇండస్ట్రీకి ఒక బైబిల్ లాగా మారుతుందని ఆ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

వివాహ ఖర్చుపై రెండు పరస్పర భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ధనిక-పేద వ్యత్యాసం ఉన్న ఇండియా వంటి దేశంలో ఈ స్థాయిలో ఖర్చుపెట్టి పెళ్ళి చేయటం నేరంతో సమానం అని పలువురు విమర్శిస్తున్నారు. దేశంలో అత్యధిక శాతం ప్రజలకు ఆహార భద్రత లేదని, నీటి కొరతతో కష్టాలు పడుతున్నారని గుర్తు చేస్తున్నారు. అసలు ముంబైలో వారి ఇల్లే ధనిక-పేద వ్యత్యాసానికి నిదర్శనం అని కొందరు అంటున్నారు(అంబానీల 27 అంతస్తుల ఇంటిలో మూడు హెలిపాడ్‌లు, 160 కార్లు పట్టే గరాజ్ ఉన్నాయి. ఈ ఇంటిని వంద బిలియన్ డాలర్లతో నిర్మించారని అంటారు). డబ్బు ఇలా విరజిమ్మి జరిపే వేడుకలు పేదలలో కోపాన్ని, ఆక్రోశాన్ని రెచ్చగొడతాయని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దానికితోడు, పుండుపై కారంలాగా జియో కంపెనీ ఇటీవల ఛార్జీలు పెంపటంతో జనంలో ఆగ్రహావేశాలు తీవ్రంగా పెరిగిపోయాయని అంటున్నారు.

మరోవైపు, ఈ వేడుకలతో అంబానీలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అందరికీ తెలిసేలా చేస్తున్నారంటూ కొందరు వారిని సమర్థిస్తున్నారు. ఈ వేడుకల వలన వేలమందికి ఉపాధి దొరుకుతుందని అంటున్నారు. రిలయెన్స్ ప్రతినిధులు మరో వాదన వినిపిస్తున్నారు. ముకేష్ అంబానీ ఆస్తి సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయన ర్యాంక్ పది కాగా, ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. ఈ మొత్తం వేడుకలకు అంబానీ కుటుంబం సుమారు ఐదువేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఒక అంచనా. సాధారణంగా భారతదేశంలో సగటు కుటుంబం తమ ఆస్తిలో పదో వంతును పెళ్ళిళ్ళకు ఖర్చు పెడతారని, ఆ లెక్కన చూస్తే అంబానీలు తమ ఆస్తిలో 0.6 శాతం మాత్రమే ఖర్చుపెడుతున్నారని, ఇది సగటు భారతీయ కుటుంబం పెట్టే ఖర్చుకంటే చాలా తక్కువని చెప్పుకొచ్చారు.

ఇవన్నీ ఇలా ఉంటే, అసలు ఈ పెళ్ళి ఇంత ఘనంగా జరపటం వెనక ఒక వ్యాపారకోణం ఉందంటూ మరో వాదన వినబడుతోంది. అంతర్జాతీయంగా రిలయెన్స్ బ్రాండ్‌కు, అంబానీ బ్రాండ్‌కు గుర్తింపుకోసమే ఇంత మెగా స్థాయిలో వేడుకలు జరుపుతున్నారని, ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించటమే వారి లక్ష్యమని అంటున్నారు. జస్టిన్ బీబర్, రిహానా, బెయాన్స్, కేటీ పెర్రీ, పిట్ బుల్ వంటి ఇంటర్నేషనల్ పాప్ సింగర్‌లు, మార్క్ జూకర్ బర్గ్, బిల్ గేట్స్ వంటి వ్యాపారవేత్తలు, ఇవాంకా ట్రంప్, కిమ్ కర్దషియాన్ వంటి సెలబ్రిటీలు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ రాజకీయ ప్రముఖులను వేడుకలకు ఆహ్వానించటం దానిలో భాగమేనని చెబుతున్నారు.

Tags:    

Similar News