శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ ఈ సినిమాకు ప్రేరణ. పాల కొరత ఉన్న భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చిన అసాధారణమైన యాత్ర ఆ సినిమా. పాడి రైతుల సహకార ఉద్యమానికి నాందీ పలికిన అపురూప కథా రూపం మంథన్. కష్టకాలంలో రైతులు తమ ఇంటి అవసరాలు కూడా తీర్చుకోలేని దుర్భర స్థితిలో ఉన్నప్పుడు నలుగురు పాడి రైతుల్ని ఒక చోట గుమికట్టి పాడిని నమ్ముకుంటే బతుకు బండి లాగ వచ్చునని రుజువు చేసిన సినిమా ఇది. సంఘమంటే ఏమిటో తెలియని పాడి రైతులతో సంఘాన్ని పెట్టించి అమూల్ సంస్థకు బాటలు వేసిన సినిమా అది. పాడి సంఘం ఏర్పాటుకు చిన్న, మధ్యతరహా రైతులు చేసిన పోరాటం, చిన్న చిన్న విజయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రాన్ని ఐదు లక్షల మంది పాడి రైతులు తలా రెండు రూపాయలు వేసుకుని తీసిన సినిమా.
ప్రముఖ భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు శ్యామ్ బెనగల్ 1976లో తీసిన మంథన్ సినిమాకు అనేక జాతీయ అవార్డులు వచ్చాయి. సినీ నిర్మాత, ఆర్కియాలజిస్ట్ శివేంద్ర సింగ్ దుంగార్ పూర్ ఏర్పాటు చేసిన ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్, గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్తో కలిసి ఊరూరా తిరిగి శ్యామ్ బెనగల్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమా ఉద్దేశమేమిటంటే...
అటువంటి ఈ సినిమా కేన్స్ కి ఎంపిక కావడం పట్ల అనేకమంది చిత్రరంగ ప్రముఖులు, పాడిపరిశ్రమతో సంబంధం ఉన్న వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జి.సి.ఎం.ఎఫ్.) మాజీ ఎండీ ఆర్.ఎస్. సోధి మాటల్లో చెప్పాలంటే.. అమూల్ కోపరేటివ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సహకార సంస్థను రూపొందించడానికి సహకార పాడి రైతులు ఏకతాటిపై నిలిచి చేసిన ప్రయాణమే ఈ సినిమా అన్నారు. డెయిరీ సహకార ఉద్యమంపై మంథన్ చెప్పలేనంత ప్రభావాన్ని చూపింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎక్కడికక్కడ సంఘాలు పెట్టుకోవడానికి స్ఫూర్తిని ఇచ్చింది.
కేన్స్ ఫెస్టివల్ కోసం ఈ సినిమాకి మళ్లీ ప్రాణం పోయాల్సివచ్చింది. దాదాపు అర్ధ శతాబ్దం తరువాత కూడా నేటికీ కథనంలో వన్నే తగ్గలేదు. మంథన్ పాడి రైతుల హృదయాన్ని కొల్లగొట్టిందంటే అతిశయోక్తి కాదు. ఆర్థిక అసమానత, కుల వివక్ష సంకెళ్లను బద్దలు కొట్టే లక్ష్యం ఉన్న చిత్రమిది. మార్పుకు శ్రీకారం చుట్టిన ఈ సినిమాను గోవింద్ నిహలానీ పునరుద్ధరించారు.
సహజనటనకు మారుపేరైన స్మితా పాటిల్, నసీరుద్దీన్ షా పోటీపడి నటించారు. నసీరుద్దీన్ షాకి అది రెండో సినిమా. పల్లెటూళ్లో ఓ గుడిసెలో ఉంటూ గేదె పాలు తీయడం నేర్చుకుని ఈ సినిమాలో నటించారు. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ గోవింద్ నిహలానీ యాభై ఏళ్ల నాటి ‘మంథన్’ సినిమా పునరుద్ధరణలో పాల్గొని ఓ భావోద్వేగ అనుభవం పొందానంటారు.
గుజరాత్లోని సంగన్వా గ్రామంలో ఈ సినిమాను తీశారు. 45 రోజులు పట్టింది. చిత్ర యూనిట్ మొత్తం అక్కడే మకాం వేసి ఓ కుటుంబంలా ఉంటూ సినిమాలో లీనమయ్యారు. సినిమాటోగ్రాఫర్గా శ్యామ్ బెనెగల్ కు అదే తొలి సినిమా. అమూల్ స్వర్ణోత్సవం జరుపుకుంటున్న వేళ మంథన్ సినిమా కేన్స్ ఫెస్టివల్ కి ఎంపికైంది.
1976లో శ్యామ్ బెనెగల్ ఈ సినిమాకి దర్శకుడు. రెండు గంటల 15 నిమిషాల పాటు సాగే ఈ సినిమాలో పాడి రైతుల్ని కూడగట్టడానికి హీరో పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. శ్వేత విప్లవ పితామహుడు వి. కురియన్, దర్శకుడు శ్యామ్ బెనెగల్, ప్రముఖ రచయిత విజయ్ టెండూల్కర్ స్క్రీన్ ప్లై రాశారు. వనరాజ్ భాటియా సంగీత దర్శకుడు. హీరోయిన్ స్మితా పాటిల్. నసీరుద్దీన్ షా, గిరీష్ కర్నాడ్, అమ్రిష్ పురి పోటీపడి నటించారు.