సంఘాల నాయకులు స్వయంప్రకాశకులేనా ?

ఒక గీత గీసుకొని విషయాన్ని విశ్లేషిస్తే వీరి యొక్క ముసుగు తొలిగి,నిజ స్వరూపం బట్టబయలు అవుతుంది.;

Update: 2025-06-19 08:58 GMT

వివిధ ప్రజా సంఘాలతో పనిచేస్తున్న నాయకులు స్వయం ప్రకాశకులా కాదా వీరి వెనక మాటుగా నిలిచిన మార్తాండులు ఉన్నారా ఉంటారా లేక మీరు ఎవరి ప్రేరణ లేకుండా స్వంత నిర్ణయాలు తీసుకోగలరా లేక వీరిని ఏవో శక్తులు కీ ఇస్తే బొమ్మల్లా మాట్లాడిస్తున్నారా .అనే ఇలాంటి ఆయా సంఘాలలోని సాధారణ సభ్యులకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బోలెడు అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.

ఇలా అనుమానపడడానికి అనేక కారణాలు గతంలో జరిగిన సంఘటనలు సోదాహరణంగా కండ్ల ముందు కదలాడుతున్నాయి. వీరు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయా సంఘాలలో బాధ్యులుగా పాత్రను నిర్వహించారు. రాష్ట్ర అవతరణ ముందు, ఏర్పడిన పిదప ఒక గీత గీసుకొని విషయాన్ని విశ్లేషిస్తే వీరి యొక్క ముసుగు తొలిగి,నిజస్వరూపం బట్టబయలు అవుతుంది. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.

టీఎన్జీవో అధ్యక్షుడు తెలంగాణ వచ్చిన తర్వాత శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై శాసనమండలి సభాపతి గా వ్యవహరించారు. ఒక సబ్ స్టాప్ గా ఉద్యోగం ప్రారంభించి టీఎన్జీవో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించే వరకు ఎన్నో పాములను తప్పించుకొని, ఆయన ఎక్కి వచ్చిన నిచ్చెనలు అనేకం ఉన్నాయి. సామాజిక తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్ పార్టీలోకి పోయి తిరిగి బిఆర్ఎస్ స్వగృహం లోకి ప్రవేశం చేశారు. టిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వక అనేక విధాలుగా భంగపడ్డారు . ఆ పార్టీలో ఇమడలేక భాజాపాలోచేరాడు. అనంతరం జరిగిన బై ఎలక్షన్ లో ఏమి జరిగిందో, కోల్పోయిన ఎలాంటి గౌరవం లభించిందో, ఏమి పొందాడో కానీ తిరిగి బి.ఆర్.ఎస్. పార్టీ తీర్థం పుచ్చుకున్నారు . ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు.

ఇక టీఎన్జీవోస్ కార్యదర్శిగా ఉద్యమ కాలంలో పనిచేసి అటెనుక ఆ సంఘం అధ్యక్షుడుగా జి.దేవీ ప్రసాద్ ఎన్నికయ్యారు. టిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ అనంతరం 2017 లో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవి నిర్వహించాడు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా వివిధ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు నిర్వహించే చర్చలలో పాల్గొంటున్నాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామం ఈయన జన్మస్థలం. అప్పటి మెదక్ జిల్లా ఇప్పటి సిద్దిపేట జిల్లాకు చెందిన కెసిఆర్ తో సహా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మేము లేకుంటే ఉద్యమమే లేదన్నట్టు, తెలంగాణ వచ్చేది కాదన్నంత స్థాయిలో వీళ్ళకు వీళ్ళే భావిస్తుంటారు. అలా పదవులు అంది పుచ్చుకున్న వారిలో వీరు ఒకరు .

మరో గెజిటెడ్ ఆఫీసర్ నాయకుడు పురపాలక శాఖలో ఇన్స్పెక్టర్ గా చేరి కమిషనర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఈయన 2006లో గెజిటెడ్ ఉద్యోగ సంఘాన్ని ప్రారంభించి దానికి అధ్యక్షుడయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మహబూబ్నగర్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. 2023 శాసనసభ ఎన్నికల్లో అదే మహబూబ్నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

తెలంగాణ రాష్ట్రంలో 20 23 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సహచరుడిగా కొనసాగుతున్నాడు.

ఇలా తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని పైన వివరించిన ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు వివిధ స్థాయిలలో రాజకీయ అవతారాలు ఎత్తి పదవులు పొందారు. మీరు పైకి ప్రజాస్వామ్యవాదులు గా కనపడే బిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు వేరొకరికి కనబడకుండా గీసిన లక్ష్మణ రేఖను దాటని వారు. అడపా దడపా ఒకరు దాటిన చెంపలు వేసుకుని తిరిగి పార్టీ కౌగిలిలో ఒదిగిపోయారు .

తెలంగాణ జర్నలిస్ట్ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈమధ్య తెలంగాణ జర్నలిస్టుల సంఘం 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రజితోత్సవాలు హైదరాబాద్ కేంద్రంగా జరుపుకుంది. తెలంగాణ జర్నలిస్టుల పాత్రను తెలంగాణ ఉద్యమ కాలం నాటి చేదు, తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 2014 నుండి తెలంగాణ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు 2023 వరకు నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ నామినేట్ చేయగా తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పరివర్తన చెందాడు. పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటిదాకా బాగానే ఉంది.కానీ తెలంగాణ జర్నలిస్టు సంఘం ఉత్సవాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని ఎప్పుడూ ఎవరికీ చెప్పరు. అదొక బ్రహ్మ రహస్యం. చూపుడు వేలు బొటన వేలు చూపుడు వేలు మధ్య కలం ఉంచి రాసే బొటన వేలును గురుదక్షిణగా ఏ రాజకీయ పార్టీ నాయకుడికి సమర్పించారో మీరు చెప్పకపోయినా తెలంగాణ ప్రజలకు, జర్నలిస్టులకు అందరికీ తెలిసిన విషయమే.

మరి కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అప్పుడు కలం కండ్లు మూసుకొని ,ఇప్పుడు విద్య మీద పుంఖాను పుంఖాలుగా రాస్తున్నారు.బాగానే ఉంది కానీ నాడు ఒకటో తారీకున జీతాలు ఎందుకివ్వడం లేదని ఉద్యోగుల ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు ,ఉద్యోగులకు సకాలంలో బకాయిలు ఎందుకు చెల్లించలేదని నిరసన తెలుపలేక పోయారు . ఎందుకో ఏమో ఒక్క అక్షరం ముక్క రాయలేకపోయారు. అయినప్పటికీ ఇప్పుడు అడగడంలో ప్రశ్నించడంలో రాయడంలో తప్పులేదు కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిశ్శబ్దంగా ఒక ప్రభుత్వం పల్లకి మోసిన ఈ నాయకులకందరికీ ఇప్పుడు మాట్లాడడంలో ఏ మంత్రం దాగిందో ఏమి అంత సూత్రం ఇమిడి ఉన్నదో మిగతా తెలంగాణ ఉద్యోగ ,ఉపాధ్యాయులు పైకి బాహాటంగా మాట్లాడలేకపోవచ్చు కానీ అందరూ లోపల్లోపల గుసగుసలు పోతూనే ఉన్నారు .

ఈ నాయకులతో పాటు మరికొందరు టిఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో పదవుల కోసం పెదవులు మూసుకున్న వీరు, గత 10 ఏళ్ల బంగారు తెలంగాణలో ఉద్యోగుల ,జర్నలిస్టుల పక్షం వహించి ప్రశ్నిస్తే వీరికి ప్రస్తుత ప్రభుత్వానికి అడిగే అర్హత, నైతికత కలిగి ఉండేవారు. తత్ కారణంగా వీళ్లు ఈనాటి ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘం బాధ్యులమనుకొని అనేక డిమాండ్లు చేస్తున్నారు. అర్హత ,నైతికతను వీళ్ళు ఎప్పుడు కోల్పోయారు. వీరి గురించి ప్రజలకు తెలియనట్లు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్వయం ప్రకాశం లేని వివిధ సంఘాల బాధ్యులు సమ్మెకు దిగుతామని ఉడుత ఊపులతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు .

ఇక ఇప్పుడు కొందరు ప్లేటు ఫిరాయించి ఈ ప్రభుత్వంలోని ఏదో ఒక నాయకుడి వేళ్లు కాళ్లు పట్టుకొని ఎట్లైనా ప్రాపకం కొండకచో కొందరు పొందాలని చూస్తున్నారు. మరి కొందరు పొందుతున్నారు. మీరు ప్రస్తుత ప్రభుత్వంలో మారువేషంలో మానవ బాంబుల్లా ప్రవేశిస్తున్నారు. ఇన్నినాళ్లు సూడో వ్యాసకర్తలుగా వారు ఇప్పుడు ఎవరో ప్రేరేపించగా అలా వాచాలత్వముతో మాట్లాడి తమ స్వంత పనులను చక్కబెట్టుక చక్కబెట్టుకోవాలని నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు. వీళ్లంతా మొఖాలు చూసి పెద్ద మొత్తంలో విస్ఫోటన బీభత్సం సృష్టించడానికి హిడిన్ ఎజెండా మరియు ప్రణాళిక కలిగి ఉన్నారు . వీరిని చేరదీసే నాయకులు గతంలో వీరి వ్యక్తిత్వంను ,ప్రవర్తనను సరి అయిన అంచనా వేసి దూరం పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది. లేకుంటే వీరి వలన జరగబోయే నష్టానికి ఆయా నాయకులు బాధ్యులు అవుతారు. తస్మాత్ జాగ్రత్త!

సారాంశంలో ఇక వీరి ప్రవర్తన తీరు గమనిస్తే వీరి పదవీ కాలమంతా స్వయం ప్రకాశకులుగా వెలిగింది పెద్దగా లేదని చెప్పవలసి రావడం బాధాకరమైన ప్పటికీ చెప్పకుండా ఉండలేని ఒక అనివార్య పరిస్థితి ప్రస్తుతం ఏర్పడినది.

Tags:    

Similar News