బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ..;

Update: 2025-06-05 08:00 GMT
Click the Play button to listen to article

బెంగళూరు(Bangalore)లో తొక్కిసలాట(Stampede) ఘటనను కర్ణాటక(Karnataka) హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఘటనపై విచారణ చేపట్టనుంచి. మరోవైపు ఈ దుర్ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించడంతో పాటు మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

తొక్కిసలాటలో 11 మంది మృతి..

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలకు ప్లాన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న క్రికెట్ అభిమానులు, ప్రజలు చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తారు. స్టేడియానికి వెళ్లే దార్లన్ని కిక్కిరిసి పోయాయి. స్టేడియం గేట్లు తెరవకముందే ఒక గేటు వద్ద జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక 11 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని వైదేహి ఆసుపత్రి, బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు.

సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన జట్టు సభ్యులు..

విజయోత్సవ ఆనందాన్ని పంచుకునేందుకు జట్టు సభ్యులంతా బుధవారం మధ్యా్హ్నం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసేందుకు విధాన సౌదా చేరుకున్నారు. అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియానికి బయలుదేరారు.

విషాదంలోనూ కొనసాగిన వేడుకలు..

స్టేడియం బయట విషాదకర ఘటన చోటుచేసుకున్న స్టేడియం లోపల ఆటగాళ్ల సత్కార కార్యక్రమం కొనసాగింది. వాస్తవానికి స్టేడియం కెపాసిటీ 40వేలు. కానీ విక్టరీ పెరేడ్‌కు తరలివచ్చిన అభిమానులు, ప్రజలు సుమారు 3 లక్షల మంది. భద్రతగా కేవలం 5వేల మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో జనాన్ని అదుపు చేయడంలో వారు విఫలమయ్యారు.

‘ఊహించని జనసమూహం’

ఘటనపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

"చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారని మరో 33 మంది గాయపడ్డారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. చిన్నస్వామి స్టేడియం దగ్గరకు 2లక్షల నుంచి 3 లక్షలకు పైగా జనం వచ్చారు. ఇంత జనసమూహం వస్తుందని ఎవరూ ఊహించలేదు" అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

‘విక్టరీ పరేడ్‌ ఆపేశాం..’

‘‘అదుపుచేయలేనంత జనం వచ్చేశారు. దాంతో పోలీసులు ఇబ్బంది పడ్డారు. అందుకే ఓపెన్ టాప్‌పై విక్టరీ పరేడ్‌కు నో చెప్పాల్సి వచ్చింది," అని చెప్పారు.

బీసీసీఐ(BCCI) కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

"ఇది చాలా దురదృష్టకరం. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ వేడుకలకు నిర్వహించాల్సింది " అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పీటీఐకి తెలిపారు. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా ఇదే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. విక్టరీ పరేడ్‌తో బీసీసీఐకి సంబంధం లేదన్నారు. ఘటన దురదృష్టకరమన్నారు.

జట్టు సభ్యులకు డీకే ఘన స్వాగతం..

రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు బుధవారం మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రయంలో దిగిన తర్వాత వారికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వాగతం పలికారు. మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్‌సీబీ పంజాబ్ కింగ్స్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించి 18 సంవత్సరాల తర్వాత తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

పోలీసుల సూచనతో..

జట్టు సభ్యుల కోరిక మేరకు విధానసౌధ నుంచి స్టేడియం వరకు ఓపెన్ టాప్ బస్‌లో వెళ్లేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తొలుత అనుమతించారు. అయితే జనం విపరీతంగా రోడ్ల మీదకు వచ్చేస్తారని, ఫలితంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం సాధ్యం కాదన్న పోలీసుల సూచనతో ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. 

Tags:    

Similar News