కళా ‘నిధి’ పై దయా మారన్ దండయాత్ర
సన్ టీవీ నెట్వర్క్ లో తనకు అన్యాయం జరిగిందని నోటీస్ పంపిన ఎంపీ దయానిధి మారన్;
By : The Federal
Update: 2025-06-21 06:48 GMT
మహాలింగం పొన్నుస్వామి
తమిళనాడులో కరుణానిధి మనవళ్ల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభం అయింది. మారన్ కుటుంబ సభ్యులు సొంత అన్నాదమ్ములైన దయానిధి మారన్- కళానిధి మారన్ మధ్య ప్రముఖ టీవీ ఛానెల్ అయిన ‘‘సన్ టీవీ నెట్వర్క్’’ సొంతం చేసుకునే విషయంలో లీగల్ బాటిల్ ప్రారంభించారు.
కరుణానిధి జీవించి ఉంటే ఆయన ఈ వివాదంలో కచ్చితంగా జోక్యం చేసుకునే వారు. కానీ ప్రస్తుత కుటుంబ పెద్ద, డీఎంకే అధిపతి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన సోదరి సెల్వి లేదా ఉదయనిధి స్టాలిన్ ఈ వివాదంలో జోక్యం చేసుకునే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు.
డీఎంకే ఎంపీ దయానిధి మారన్, తన సోదరుడు, సన్ టీవీ నెట్వర్క్ చైర్మన్ కళానిధి మారన్ కు లీగల్ నోటీస్ పంపించారు. 2003 లో మీడియా సంస్థపై నియంత్రణ సాధించడానికి మోసపూరిత విధానాలు అనుసరించారని ఆయన ఆరోపణ.
ఈ వివాదం బయటకు రావడంతో డీఎంకే పార్టీలో ప్రముఖంగా వ్యవహరిస్తున్న కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వైరుధ్యాలు, రాజకీయ ఉద్దేశ్యాలు, డీఎంకే వారసత్వం గురించి చర్చలను మళ్లీ రేకెత్తించింది.
ద్రోహం చేశారా?
సీనియర్ జర్నలిస్ట్ సావిత్రి కన్నన్ ప్రకారం.. సన్ టీవీ నెట్వర్క్ ను నిర్మించడంలో కళానిధి మారన్ ది కీలకపాత్ర. సన్ టీవీలో ‘‘వన్ మ్యాన్ ఆర్మీలా సామ్రాజ్యం’’ నిర్మించారని అన్నారు.
దయానిధిని పక్కన పెట్టారు. అయితే ఎప్పుడూ మద్దతుదారు, భాగస్వామి కాదు. ప్రత్యర్థి అని పేర్కొన్నారు. దయానిధికి రాజకీయాల్లోకి ముందుకు వచ్చి తనకు భవిష్యత్ ఉందని నమ్మాడు. కానీ తనకు దయానిధి కుటుంబంలో తనకు ప్రాముఖ్యత క్రమంగా తగ్గుతూ వస్తోందని ఆయన భావిస్తున్నారు.
గత రెండు దశాబ్ధాలుగా కళానిధి మారన్ తనను తక్కువ చేసి మాట్లాడుతున్నాడని, తాను మోసగించబడ్డాడని దయానిధి నమ్ముతున్నాడు. ద్రోహం, ఆర్థిక అవసరాలు, కుటుంబంలో ప్రాముఖ్యం లేకపోవడంతో ఇప్పుడు ఈ లీగల్ నోటీస్ వచ్చింది.
కరుణానిధి జీవించి ఉంటే కచ్చితంగా మధ్యవర్తిత్వం వహించేవాడని కన్నన్ అన్నారు. కానీ స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఎంతవరకూ జోక్యం చేసుకుంటారో ఎవరు చెప్పలేకపోతున్నారు.
గతంలో డీఎంకే కుటుంబంలో లేదా కరుణానిధి అతని కుమారుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడల్లా ఆయన కుమార్తె సెల్వి మధ్యవర్తిగా కీలకపాత్ర పోషించి పరిష్కారాలు సులభతరం చేసింది.
అయితే మారన్ సోదురుల మధ్య ప్రస్తుత కార్పొరేట్ యుద్ధంలో సెల్వి జోక్యం చేసుకునే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
స్టాలిన్ కు దగ్గరగా లేడు..
కరుణానిధికి, మురసోలీ మారన్ ‘‘కళ్లు, చెవులు’’గా పనిచేశారు. కానీ ఆయన కుమారులు మాత్రం ఎల్లప్పుడూ రాజకీయంగా స్టాలిన్ కు దగ్గరగా లేరని సీనియర్ జర్నలిస్ట్ ప్రియన్ అభిప్రాయపడ్డారు. కరుణానిధి వంశంలో కుటుంబం వివాదాలు సర్వసాధారణమని కూడా ఆయన చెప్పారు.
2001 లో మురసోలి మారన్.. కుల ఆధారిత పార్టీలు డీఎంకే కూటమిలో చేర్చడాన్ని వ్యతిరేకించారు. ఆయన ముందుగానే ఓటమిని గ్రహించారు. కొంతకాలం కరుణానిధితోమాట్లాడటం కూడా మానేశారు.
ఇతర సందర్భాల్లో కూడా డీఎంకే కుటుంబం వ్యక్తిగత శత్రుత్వాలు, రాజకీయా ఆశయాలు, మీడియా సామ్రాజ్యాలను మిళితం చేసే అంతర్గత కుటుంబ వివాదాలతో సతమతం అవుతోంది. ఇందుకు కొన్ని ఉదాహారణలు ఉన్నాయి.
దినకరన్ సంస్థపై దాడి..
కరుణానిధి వారసుడిగా ప్రజలు స్టాలిన్ ను చూస్తున్నారని, ఆయనకే ఎక్కువగా మద్ధతు ఉందని 2007, మే 9 న ‘దినకరన్’ నిర్వహించిన సర్వేలో తేలిందని కథనం ప్రసారం చేశారు.
దీనితో ఆగ్రహించిన ఎంకే అళగిరి మద్దతుదారులు కళానిధి యాజమాన్యంలోని మధురై వార్తాపత్రిక కార్యాలయంపై దాడి చేశారని అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి. మారన్ నియంత్రణలో ఉన్న ఈ సంస్థ ప్రచురించిన సర్వేలో డీఎంకే దక్షిణాదిన బలంగా ఉందని వివరించింది. ఇది అళగిరిని ఉద్ధేశపూర్వంగా అవమానించారని అప్పట్లో ఆయన వర్గం భావించింది.
పెట్రోల్ బాంబులతో దాడి చేసిన ఈ హింసాత్మక ఘటనలో ముగ్గురు ఉద్యోగులు వీపీ గణేషన్, జీ వినోద్ అనే ఇంజనీర్లు, ఎస్ కార్తీ అనే సెక్యూరిటీ గార్డ్ మరణించారు. ఇది విస్తృత ప్రజాగ్రహాన్ని రేకేత్తించింది.
ఆ దాడిని అళగిరి, మారన్ పై తన ఆధిపత్యాన్ని చూపించడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నంగా భావించారు. ఎందుకంటే వారిని స్టాలిన్ తో అప్పటికే సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అళగిరి భావించారు.
1993 నుంచి అన్నా అరివాలయంలో పనిచేస్తున్న సన్ టీవీని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయమని ఆదేశించడంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామాల మధ్య అప్పటి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి దయానిధి రాజీనామా చేశారు.
మారన్ల పతనం.. కళైంజర్ టీవీ రాక
మారన్ల ఆధిపత్యానికి సవాల్ విసరడానికి కరుణానిధి కుటుంబం సెప్టెంబర్ 27, 2007 న కలైంగర్ టీవీని ప్రారంభించింది. దీనిని దయాళు అమ్మాల్(60 శాతం వాటాలు) కరుణానిధి కుమార్తె కనిమొళి నిర్వహించారు.
కరుణానిధి కలం పేరు మీదుగా పెట్టిన ఈ ఛానెల్ సన్ టీవీ ఆధిపత్యాన్ని సవాల్ చేయడం, డీఎంకే ప్రచార విభాగంగా పనిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రారంభం మీడియాలో పోటీని పెంచింది. కలైంగర్ టీవీని మారన్ల సామ్రాజ్యానికి ప్రత్యక్ష పోటీదారిగా ఎదురు నిలబడింది.
కుదిరిన సయోధ్య..
డిసెంబర్ 2008, 2జీ స్పెక్ట్రమ్ వివాదం తలెత్తినప్పుడూ తమిళనాడు ఊహించని డీఎంకే కుటుంబ సయోధ్యను చూసింది. రాష్ట్ర రాజకీయ పరిశీలకులు దీనిని మరిచిపోయే అవకాశం లేదు.
స్పెక్ట్రమ్ సమస్య బయటపడిన కొన్ని రోజుల తరువాత దయానిధి డిసెంబర్ 1న గోపాలపురంలోని తన నివాసంలో కరుణానిధిని కలిశారు. 2007 దినకరన్ పై దాడి తరువాత చెలరేగిన 18 నెలల విభేదాలకు ముగింపు పలికారు. 2009 లోక్ సభ ఎన్నికలకు ముందు ఐక్యత అవసరం అనే ఉద్దేశ్యంతో స్టాలిన్, కనిమొళి సంధిని సులభతరం చేశారు.
మారన్ సోదరులతో తిరిగి కలవడంపై ‘‘ నా హృదయం ఉప్పొంగిపోయింది. నా కళ్లు చెమ్మగిల్లాయి’’ అని కరుణానిధి స్పష్టంగా భావోద్వేగానికి గురయ్యారు. దయానిధిని డీఎంకే చెన్నై సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఆయనకు, అళగిరితో ఉద్రిక్తతలు కొనసాగాయి.
2జీ స్కామ్.. అళగిరి అణచివేత..
2011-12 సంవత్సరంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో కనిమొళి నెలల తరబడి జైలు శిక్ష అనుభవించారు. దయానిధి సన్ టీవీకి ప్రయోజనం చేకూర్చడానికి ఐఎస్డీఎన్ లైన్లను దుర్వినియోగం చేశారని, దీనివలన ప్రభుత్వ ఖజానాకు రూ. 440 కోట్ల నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.
ఈ వివాదం మారన్లకు డీఎంకే నాయకత్వంతో ఉన్న సంబంధాలను మరోసారి దెబ్బతీసింది. ఇదే సమయంలో అళగిరికి- స్టాలిన్ మధ్య ఉన్న వైరం తీవ్రమైంది.
2013 లో స్టాలిన్ పై, అళగిరి ఉపయోగించిన భాషను చూసి కరుణానిధి.. ఎంకే స్టాలిన్ తన వారసుడని ప్రకటించాడు. 2014 లో అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తరవాత సన్ గ్రూప్ కు చెందిన సన్ పిక్చర్స్ కూడా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంది. దానిపై సీఓఓ మోసం కేసు పెట్టారు.
కార్పొరేట్ ఘర్షణ
2003 లో జరిగిన సన్ వాటాల కేటాయింపులో మోసం జరిగిందని ఆరోపిస్తూ దయానిధి, కళానిధికి లీగల్ నోటీస్ జారీ చేశారు. కళానిధి తనకు 1.2 మిలియన్ సన్ టీవీ షేర్లను ఒక్కొక్కటి రూ. 10 చొప్పున కేటాయించారని వాటి మార్కెట్ విలువ రూ. 2500- 3000 కాగా వాటాదారుల అనుమతి లేకుండా, కుటుంబ వాటాలు తగ్గించారని తన నోటీస్ లో ఆరోపించారు.
కళానిధి మారన్ కంపెనీ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఫోరెన్సిక్ ఆడిట్, సెబీ దర్యాప్తును కోరుతూ నోటీస్ జారీ చేయబడింది. ఈ వివాదం సన్ టీవీ స్టాక్ ధరలో 4 శాతం తగ్గుదలకు దారితీసింది.
వ్యాపారం.. రక్తసంబంధం
రక్తం నీటి కంటే చిక్కగా ఉంటుందని ప్రియన్ నమ్ముతున్నాడు. మారన్ సోదరుల త్వరలోనే రాజీపడతారని అంచనా వేస్తున్నాడు. ప్రస్తుత వైరాన్ని కుటుంబ వాటాదారుల వివాదంగా ఆయన భావిస్తున్నారు.
ఇది డీఎంకే కి రాజకీయపతనానికి దారితీయకపోవచ్చు. ‘‘దయానిధి రాజకీయ ప్రయోజనాలను స్టాలిన్ చూసుకుంటాడు’’ అని ఆయన అన్నారు. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ సహ డీఎంకే నాయకులు తటస్థంగా ఉండే అవకాశం ఉందని, కీలకమైన ఎన్నికలకు ముందు అంతర్గత విభేదాలను నివారించడానికి ఈ వైరాన్ని వ్యక్తిగత కుటుంబ విషయంగా పరిగణించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక, వ్యక్తిగత మనోవేదనలతో కూడిన ఈ వివాదం వారి ఎంట్రీని పరిమితం చేస్తుంది. తరువాత ఏం జరుగుతుందో అనిశ్చితంగా ఉంది.