‘మంత్రి వాకౌట్ చేయడం గవర్నర్ను అవమానించడమే’
భరతమాత చిత్రాన్ని గుర్తించలేదని పేర్కొన్న కేరళ విద్యాశాఖ మంత్రి శివన్కుట్టి..;
కేరళ(Kerala) విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి(Sivankutty) గురువారం రాజ్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమం నుంచి అకస్మాత్తుగా వాకౌట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాజ్యపురస్కార్’ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి తీరును గవర్నర్ కార్యాలయం తప్పుబట్టింది. ఆ తర్వాత ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ‘‘మంత్రి వేదిక నుంచి వాకౌట్ చేయడం గవర్నర్ కార్యాలయానికి తీవ్ర అవమానం. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ వెళ్లిపోయే వరకు ప్రేక్షకులు కూడా కూర్చుని ఉండాలి. విద్యాశాఖ మంత్రే భరతమాత చిత్రాన్ని గుర్తించలేదని చెప్పడం దురదృష్టకరం’’ అని పేర్కొంది.
అయితే అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ, మతపర చిహ్నాలను ప్రదర్శించడాన్ని శివన్కుట్టి తప్పుబడుతున్నారు. అలా చేయడం ప్రభుత్వ కార్యక్రమాల లౌకిక స్వభావాన్ని ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు.
గతంలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా..
ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల (జూన్ 5న) సందర్భంగా వ్యవసాయ మంత్రి పి. ప్రసాద్ కూడా భరతమాత చిత్రపటాన్ని ప్రదర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చిత్రపటాన్ని ప్రదర్శించడాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఐకానోగ్రఫీలో భాగమని విమర్శించారు.
పరిస్థితిని బట్టి చూస్తే.. సీపీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి, బీజేపీ నియమిత ఆర్ఎస్ఎస్ సంబంధాలున్న గవర్నర్ అర్లేకర్(Rajendra Vishwanath Arlekar)కు మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.