గద్దర్ ఫౌండేషన్కు నిధుల మంజూరు..
గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలో కూడా ఈ ఫౌండేషన్ను భాగస్వామిగా చేయనున్నట్లు వెల్లడించారు.;
ప్రజా యుద్ధనౌక గద్దర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో తన పాటలతో ప్రతి యువకుడిలో ఉద్యమ జ్వాలలు రగిల్చిన ఉద్యమ గాయకుడు ఆయన. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఉద్యమ గాయకుడిగా, ప్రజా యుద్ధనౌక విశేష కీర్తి అందుకున్నారు. ఆయన పేరుపై ఏర్పాటు చేసిన ఫౌండేషన్కు తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తింపు ఇచ్చింది. తాజాగా ఈ ఫౌండేషన్కు రూ.3కోట్ల నిధులను మంజూరు చేసింది. గద్దర్ జయంతి ఉత్సవాల సందర్భంగా గద్ధర్ ఫౌండేషన్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. చెప్పినదాని ప్రకారమే శనివారం దీనికి రూ.3 కోట్లు అందించారు. ఈ విషయాన్ని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఇకపై గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలో కూడా ఈ ఫౌండేషన్ను భాగస్వామిగా చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఉద్యమ గాయకుడు గద్ధర్ పేరిట ఒక ఫౌండేషన్ ఉందని చాలా మందికి తెలియదు. అసలు ఈ ఫౌండేషన్ ఏంటి? ఇది ఏం చేస్తుంది? అన్న అనుమానాలు కూడా చాలా మందికి కలుగుతాయి.
అసలేంటీ గద్దర్ ఫౌండేష్
6 ఆగస్టు 2023 ఉద్యమ సూర్యుడు గద్దర్ అస్తమించిన రోజు. తీవ్ర అనారోగ్యానికి చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, ఆశయాలను నెరవేర్చడానికి ఏర్పాటు చేసిందే ‘గద్దర్ ఫౌండేషన్’. సామాజిక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, గద్దర్ సిద్దాంతాలను, విలువలను ముందుకు తీసుకెళ్లడం ఈ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. ఈ ఫౌండేషన్ కింద అవసరంలో ఉన్న వారికి సహాయం అందించడం, విద్యను ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేయడం, సమాజ అభ్యున్నతికి పాటుపడే ఉద్యమాలలో పాల్గొనడం చేస్తుంటారు.