గోదావరిలో ముణిగి ఐదుగురు మృతి,పొన్నం సంతాపం

ఆదివారం ఉదయం బాసరలోని గోదావరి నదిలో స్నానం చేయటానికి దిగిన కుటుంబం కొట్టుకుపోయింది;

Update: 2025-06-15 07:23 GMT
Five died in Basara

ప్రముఖ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లా బాసర(Basara Temple)లో పెను విషాధం చోటుచేసుకున్నది. ఆదివారం ఉదయం బాసరలోని గోదావరి నదిలో స్నానం చేయటానికి దిగిన కుటుంబం కొట్టుకుపోయింది. అమ్మవారి దర్శనానికి బాసర చేరుకున్న కుటుంబం ముందుగా స్నానం చేయటం కోసం గొదావరి(Godawari river mishap)లోకి దిగింది. అయితే ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక అందరు కొట్టుకుపోయారు. కుటుంబంలోని ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు చెబుతున్నారు. మృతులంతా హైదరాబాద్(Hyderabad) లోని దిల్ సుఖ్ నగర్ కు చెందిన వారుగా గుర్తించారు. నాలుగు మృతదేహాలను ఒడ్డుకు చేర్చిన అధికారులు ఐదో మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతులకు చెందిన వివరాలు పూర్తిగా అందలేదు. 


తాజా సమాచారం ప్రకారం గోదావరిలో స్నానంచేయాలని అనుకున్న కుటుంబసభ్యులను ఒక ప్రైవేటు బోటు నిర్వాహకుడు నదిమధ్యలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ అందరినీ నదిలోకి దిగమన్నాడు. అక్కడ లోతు ఎంతుందో తెలీని ఐదుగురు ఒకేసారి నదిలోకి దిగారు. వీళ్ళయిదుగురికి ఈతరాదు. ఆ విషయం ముందే చెప్పినా బోటు నిర్వాహకుడు లోతులేని ప్రాంతంలోనే బోటును నిలుపుతానని చెప్పినట్లు తెలిసింది. చివరకు నదిలోకి దిగేవాళ్ళకు లైఫ్ జాకెట్ కూడా నిర్వాహకుడు అందించలేదు. పుణ్య స్నానాలు చేయాలని అనుకునే వారిని నదిమధ్యలోకి తీసుకుని వెళ్ళవద్దని గతంలోనే పోలీసు అధికారులు చాలాసార్లు చెప్పినా ప్రైవేటు బోటు నిర్వాహకులు పట్టించుకోవటంలేదు. ఇపుడు కూడా కుటుంబసభ్యులను నిర్వాహకుడు అలాగే నదిమధ్యలోకి తీసుకుని వెళ్ళాడు.  దాంతో నదిలోకి దిగిన వారు దిగినట్లుగానే లోపలకు ముణిగిపోయారు. దానికి తోడు ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటంతో అందరు కొట్టుకుపోయారు. మృతులను గుర్తించారు. గోదావరి ప్రమాదంలో మరణించిన వారు రాజేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్ గా గుర్తించారు.

మంత్రి పొన్నం సంతాపం

నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నదిలో స్నానం చేస్తూ ఐదుగురు యువకుల మృతి చెందడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ కి ఓ చెందిన కుటుంబం బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చి ఈరోజు ఉదయం గోదావరి లో స్నానానికి వెళ్ళి ఐదుగురు యువకులు గల్లంతై మృతి చెందారని సమాచారం తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ల వద్దకు నదుల వద్దకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

ఇటీవల జనవరి లో కొండపోచమ్మ సాగర్ లో ఐదుగురు యువకులు , వారం రోజుల క్రితం మేడిగడ్డ ప్రాజెక్ట్ లో పడి ఆరుగురు యువకులు మృతి చెందరు. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు వారి పిల్లలను నదులు ,కాలువలు ప్రాజెక్ట్ ల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్ట్ ల ,కాలువల వద్ద లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రేపటి మంచి భవిష్యత్ కలిగిన యువకులు ఇలా చనిపోవడం బాధాకరమని వారి కుటుంబానికి దైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని వేడుకున్నారు. బాసర గోదావరి నదిలో మృతి చెందిన ఐదుగురు యువకులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News