ఏపీ, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడొచ్చు!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో శుక్రవారం (మార్చి 21) నుంచి మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.;
By : The Federal
Update: 2025-03-21 07:40 GMT
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో శుక్రవారం (మార్చి 21) నుంచి మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులపాటు వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అక్కడక్కడా వడగళ్ల వానలు పడొచ్చునని వాతావరణ శాఖ పేర్కొంది.
వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే ఎండలు మండుతున్న సమయంలో వానలు పడితే ఆ తర్వాత మరింత వేడి పెరిగే ప్రమాదం ఉంది. మార్చి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో ఇవాళ, రేపు వర్షాలు పడొచ్చు. వీటివల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మామిడి వంటి ఉద్యాన పంటలు బాగా దెబ్బతింటాయి.
ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా ఒకటి రెండు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
వైఎస్సార్, నంద్యాల , ప్రకాశం , పల్నాడు జిల్లాల్లో ఆదివారం చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.
మార్చి 22న, మార్చి 23న తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల్ లలో ఈదురు గాలులతో కూడిన తుఫానుకు అవకాశం ఉందని వెల్లడించారు. ఇక హైదరాబాద్ నగరం తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ జిల్లాలలో వడగండ్ల వాన
నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, హనుమకొండ, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, జనగామ, యాదాద్రి, సూర్యపేట, రంగారెడ్డి, మేడ్చల్, నల్గండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో వడగండ్ల వానలు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.