మొదలైన బీసీ బంద్.. కేంద్రానికి సెగ తగలాలి..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంస్థలు బంద్. బంద్కు పోలీసుల కీలక సూచనలు.
బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ తెల్లవారుజాము 4 గంటలకే మొదలైంది. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి. స్కూల్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీఓపై హైకోర్టు విధించిన స్టేకు వ్యతిరేకంగా బీసీ సంఘాలన్నీ కలిసి శనివారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు అఖిలపక్షం తమ సంపూర్ణ మద్దతు తెలిపింది. బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది. ఈ బంద్కు పోలీసులు పలు సూచనలతో కూడిన అనుమతులు ఇచ్చారు.
అయితే బీసీ సంఘాల నిరసన సెగ కేంద్రానికి తగలాలని, బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకునేలా బంద్ నిర్వహించాలని బీసీ సంఘాలు పేర్కొన్నాయి. బంద్లొ భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని షాపులు, ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించారు. పెట్రోల్ బంకులు కూడా బంద్ పాటించాలని బీసీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ప్రతి ఒక్కరూ బంద్కు సహకరించాలని, బంద్ను పాటించి విజయవంతం చేయాలని బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
బంద్లో వాటికి మినహాయింపు..
రాష్ట్ర బంద్లో భాగంగా చాలా సంస్థలు మూతపడ్డాయి. అన్ని సేవలను నిలిచిపోయాయి. కాగా అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తూ పోలీసులు అనుమతి ఇచ్చారు. అంబులెన్సులు, ఆసుపత్రులు సహా ఇతర అత్యవసర సేవలను ఎవరూ అడ్డుకోవద్దని కూడా బీసీ సంఘాలకు సూచించారు. బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎక్కడా కూడా అల్లర్లు, గొడవలు సృష్టించ వద్దని కూడా పోలీసులు తెలిపారు. అందుకు బీసీ సంఘాలు అంగీకారం తెలిపాయి. తెల్లవారుజాము నుంచే బంద్ను ప్రారంభించాయి.
ఇదే తొలి బంద్..
తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని పార్టీలు, సంస్థలు ఏకతాటిపైకి వచ్చి సంపూర్ణ మద్దతు తెలిపిన అంశం ఇదొక్కటే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అన్ని పార్టీలు, సంఘాలు, యూనియన్లు పూర్తి మద్దతు తెలిపాయి. బంద్లో పాల్గొనాలని తమ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. బంద్ను విజయవంతం చేయాలని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లతో పాటు టీఆర్పీ లాంటి చిన్న పార్టీ, తెలంగాణ జాగృతి, ఇతరత్రా వర్గాలు, పార్టీలు, స్టూడెంట్ యూనియన్లు కూడా ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. బంద్ను విజయవంతం చేయడానికి కృషి చేస్తామని చెప్పాయి.
డిపోలకే పరిమితమైన బస్సులు
బీసీ బంద్లో భాగంగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్లోని అన్ని సేవలు నిలిచిపోయాయి. అర్థరాత్రి నుంచి ఒక్క బస్సు కూడా కదలలేదు. ఎంజీబీఎస్ ముందు బీసీ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. జూబ్లీ బస్ స్టేషన్లో బీసీ సంఘాల బైఠాయించాయి. జేబీఎస్ దగ్గర బంద్లో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాజేంద్రనగర్, దిల్సుఖ్నగర్, బండ్లగూడ, హయత్నగర్, బర్కత్పురా, ఇబ్రహీంపట్నం సహా ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఒక్క డిపోలో కూడా బస్సు సేవలను కొనసాగడం లేదు. బస్సులన్నీ డిపోలే పరిమితమయ్యాయి. బైక్, ట్యాక్సీ సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అర్థరాత్రి నుంచి ఒక్క బస్సు సేవలు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రయాణాలు చేసేవాళ్లు ప్రత్యామ్నాయం దొరక్క ఇక్కట్లు పడుతున్నారు. పండగ సందర్భంగా సొంతూరికి వెళ్దామనుకున్న వారికి చేదు అనుభవంలా మారింది. దీంతో చాలా మంది రైల్వే ప్రయాణం వైపు మొగ్గు చూపుతున్నారు.
కేంద్రానికి సెగ తగలాలి: కృష్ణయ్య
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బీసీ బంద్ సెగ కేంద్రానికి తగలాలని బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్ కృష్ణయ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ బంద్కు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఆసుపత్రులు, మెడికల్ షాపులకు ఈ బంద్ నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన చెప్పారు. బంద్ సందర్భంగా ముందస్తు అరెస్ట్లు ఉండని, పోలీసులు కూడా పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేష్లపై హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనమా? సుప్రీంకోర్టు దేశాన్ని పాలిస్తుందా? అని శుక్రవారం పాల్గొన్న ఓ కార్యక్రమంలో కృష్ణయ్య వ్యాఖ్యానించారు. ‘జనాభా ప్రాతిపదిత రిజర్వేషన్లు మా హక్కు’’ అని ఆయన అన్నారు.
బంద్లో పాల్గొనే నేతలు వీరే..
బీసీ బంద్లో అఖిలపక్ష నాయకులు పాల్గొననున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడానికి రెడీ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావులతో పాటు మరికొందరు నేతలు ఈ బంద్లో భాగం కానున్నట్లు సమాచారం. అంబర్పేటలోని ప్రధాన రహదారిలో జరిగే బంద్లో మహేష్ కుమార్ గౌడ్, దానం నాగేందర్, సీనియర్ నేత వీ హనుమంతరావు పాల్గొంటారు. అదే విధంగా సికింద్రాబాద్లోని రేతిబౌలి బస్టాండ్ దగ్గర జరిగే బంద్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొంటారు. ఇమ్లీబస్ స్టేషన్ దగ్గర బంద్లో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాలుపంచుకోనున్నారు. జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ దగ్గర నిర్వహించిన బంద్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
అన్ని పార్టీల నాయకులు వస్తారా..!
ఈ క్రమంలోనే మద్దతు ప్రకటించిన అఖిలపక్షాల నాయకులు ఈ బంద్లో పాల్గొంటారా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే విశ్లేషకులు.. కచ్చితంగా అన్ని పార్టీల నాయకులు పాల్గొంటారని అంటున్నారు. అంతా ఒకేచోట పాల్గొనకపోయినా.. ప్రతిపార్టీ నాయకులు బంద్లో, ర్యాలీలో పాలుపంచుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ అవసరం అన్ని పార్టీలకు కూడా చాలా ఉందని అంటున్నారు. తమ పొలిటికల్ మైలేజీ కోసమైనా వారు భాగం కావాల్సిందేనని అంటున్నారు. ఒకవేళ ఎవరైనా గైర్హాజరు అయితే రాజకీయ ప్రత్యర్థులకు విమర్శలు గుప్పించడానికి మంచి అవకాశం ఇచ్చినవారే అవుతారని, అందుకని అయినా ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట బంద్లో భాగమై తమ మద్దతు తెలుపుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.