‘బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ విజయమే’
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాగితం పెట్టిన వాళ్ళని, కాగితం పెట్టించిన వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించండి.;
తమ ప్రభుత్వం కల్పించనున్న రిజర్వేషన్ ఫలాలను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ సాధించిన విజయమేనని, బీసీల అభివృద్ధికి తమ పార్టీ, ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపన అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ బీసీ నేతలు శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగానే 100 సంవత్సరాల బీసీల కలను రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందన్నారు.
‘‘బీసీ రిజర్వేషన్లు గొప్ప కార్యక్రమం. ఆనాడు దళితులు,వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చింది. కులగణన చేస్తామని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాట మాకు శిలాశాసనం. నాయకుడు మాట ఇస్తే దాన్ని నేరవేర్చాల్సిన బాధ్యత నాది, మా పీసీసీ అధ్యక్షుడిది. కులగణన పైన ఎన్నో అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమించాం. ఏడాదిలో పూర్తి పారదర్శకంగా ,పక్కా గా కులగణన పూర్తి చేశాం. ఫిబ్రవరి 4 ని సామాజిక న్యాయ దినోత్సవం గా ప్రకటించుకున్నాం’’ అని తెలిపారు.
‘‘అసెంబ్లీ తో పాటు అన్ని వర్గాలతో కులగణన పైన చర్చించాం.. అందరి అభిప్రాయాలను తీసుకున్నాం. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ మోడల్ లో కులగణన చేయాలని దేశమంతా చెబుతున్నారు. కులగణన కు మేం వ్యతిరేకమని బీజేపీ గతంలో సుప్రీంకోర్టు లో అఫిడవిట్ దాఖలు చేసింది. బీసీ రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్ లో చేర్చాలని జంతర్ మంతర్ లో నిర్వహించిన ధర్నాకు 16 పార్టీలు మద్దతు ఇచ్చాయి. మనం తీసుకువచ్చిన ఒత్తిడికి లొంగే కేంద్రం 2026 లో జరిగే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించింది. తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసింది. బీసీ రిజర్వేషన్లపై మాకు చిత్తశుద్ధి లేదని కొందరు విమర్శిస్తున్నారు’’ అని అన్నారు.
‘‘చిత్తశుద్ది లేనిది బీజేపీకి.. బీసీ రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్ చేరి చట్టబద్దత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లు లక్ష్మణ్, ఆర్ క్రిష్ణయ్య దిన్నీ సాధించాలి. మోదీ స్థానంలో రాహుల్ గాంధీ ఉంటే 48 గంటల్లో నేను రిజర్వేషన్లను సాధించుకు వచ్చేవాడిని. ప్రధాని మోదీని తెలంగాణకు చెందిన బీజేపీ మంత్రులు ప్రశ్నించాలి. బీజేపీ నాయకులు వాళ్ల నిబద్ధతను చూపించాలి. రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా నేను సిద్ధం.. ఏం చేయాలో చెప్పండి.. అర్ధరాత్రి కూడా నా మంత్రి వర్గం సమావేశం ఏర్పాటు చేస్తా. రిజర్వేషన్ల విషయంలో నన్ను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు’’ అని విమర్శించారు.
‘నా నిబద్దతను ప్రశ్నించలేరు..’
‘‘నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే ఇంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశాం. యాభై శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దని గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసింది. ఈ చట్టం చేసినప్పుడు మంత్రులు గా గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు వాళ్లను మా పైకి ఉసిగొల్పుతున్నాడు. ఆ చట్టంలో పేర్కొన్న యాభై శాతం నిబంధనను సవరిస్తూ మేం ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది నేను’’ అని అన్నారు.
‘‘నాకు తోడుగా ఉండండి.. రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోవాలి. రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే వాదించడానికి ఢిల్లీ నుంచి ఉద్దండులైన న్యాయవాదులను వాదనల కోసం నియమిస్తా. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాగితం పెట్టిన వాళ్ళని, కాగితం పెట్టించిన వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించండి. 42 శాతం బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు అయితేనే నిజమైన విజయం. 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన జెండా కావాలి’’ అని పిలుపునిచ్చారు.