ఇంకుడు గుంతల నిర్మాణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫస్ట్

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరు మరోసారి వార్తల్లో నిలిచారు.ఇంకుడుగుంతల నిర్మాణంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసలు అందుకున్నారు.;

Update: 2025-06-05 11:17 GMT
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తవ్వుతున్న ఇంకుడు గుంత

దేశంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంకుడు గుంతల నిర్మాణంలో అగ్రస్థానంలో నిలిచింది. భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ చొరవ తీసుకొని అత్యధికంగా ఇంకుడు గుంతలు తవ్వించారని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.

జల్ సంచాయ్ - జన్ బాగీదారి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇలా ఒకటేమిటి జిల్లా వ్యాప్తంగా 29,103 ఇంకుడు గుంతలను నిర్మించినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటితోపాటు జాతీయ ఉపాధి హామి పథకం కింబద మరో 2,581 సోక్ పిట్స్, 1100 నీటి గుంటల నిర్మాణం చేపట్టామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ చెప్పారు.




 భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరుకు కేంద్రం ప్రశంస

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీటి సంరక్షణ ప్రయత్నాల్లో ఆదర్శంగా పనిచేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.జల్ సంచయ్–జన్ భగీదారి కార్యక్రమంలో పాటిల్ అత్యుత్తమ పాత్రను గుర్తిస్తూ, ఆయనను ఉక్కు మనిషిగా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాల నిర్మాణం ద్వారా భూగర్భ జల స్థాయిని కలెక్టరు పెంచారని జలశక్తి మంత్రిత్వశాఖ పేర్కొంది. పాటిల్ చేసిన చొరవను అభినందిస్తూ మంత్రిత్వ శాఖ ప్రశంసా పత్రం ఇచ్చింది. జిల్లాలో ఇంకుడు గుంతల నిర్మాణాలు, బోర్‌వెల్ రీఛార్జ్ షాఫ్ట్‌ల నిర్మాణంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనివల్ల జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగింది.



 కూలీలతో కలిసి కలెక్టర్ ఉపాధి పనులు

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఇటీవల కూలీలతో కలిసి పలుగు చేత బట్టి ఉపాధి హామి పనులు చేశారు. టేకులపల్లి మండలం సులానగర్, చింతలంక, కోయగూడెం, చంద్రుతండా, కొత్త తండా ప్రాంతాల్లో ఉపాధి హామి పనులను కలెక్టర్ పరిశీలించారు.కలెక్టర్ కూలీలతో కలిసి గడ్డపార చేత బట్టి మట్టిని తవ్వారు.



 ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తన భార్య ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకొని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో పాటు పలువురి ప్రశంసలు పొందారు. జితేష్ వి పాటిల్ భార్యను ప్రసవం కోసం పాల్వంచలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ మంచి ఆరోగ్యంతో ఉన్నారు.తాను స్థానికంగా ఉన్న ప్రజారోగ్య ఆసుపత్రిని విశ్వసించి, తన భార్యకు ప్రసవం చేయించానని కలెక్టర్ చెప్పారు. చాలా మంది ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణను కోరుకునే యుగంలో, ఈ నిర్ణయం ప్రభుత్వ సేవలపై లోతైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని కలెక్టర్ తెలిపారు.కలెక్టరు చర్యతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం ఏర్పడింది.


Tags:    

Similar News