పోలీసులపై తిరగబడ్డ కార్మికులు
సూర్యాపేట సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద బీహార్ కార్మికుడు చనిపోవడంతో తోటి కార్మికుల ఆందోళన
సూర్యాపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
పాలకవీడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న బీహార్ కు చెందిన వినోద్ (45) అనే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని సెమెంట్ పరిశ్రమలోని ఆస్పత్రికి తోటి కార్మికులు తరలించారు.ఆదివారం వారంత సెలవు ఉన్నప్పటికీ వినోద్ ను యాజమాన్యం పిలిపించుకుని పని చేయించుకుందని, తోటి కార్మికులు ఆరోపించారు. వంట్లో బాగా లేదని వినోద్ చెప్పినప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. అస్వస్థతకు గురైన వినోద్ కు మెరుగైన వైద్యం కోసం ఫ్యాక్టరీ ఆస్పత్రి నుంచి మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. వినోద్ చనిపోయిన వార్త తెలుసుకున్న కార్మికులు సోమవారం కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు.మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బిహార్ కార్మికులు డిమాండ్ చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆందోళనా కారులు పోలీసులపైనా రాళ్లు విసిరారు. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ళ పై దాడికి దిగారు. వారిపై విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేశారు.
బిహార్ కార్మికుల దాడిలో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వాహనంపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. పరిశ్రమ కార్యాలయం ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. 250 మందికి పైగా బిహార్ కార్మికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని ఆందోళనా కారులు హెచ్చరించారు. స్పష్టమైన హామి ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని కార్మికులు భీష్మించుకుని కూర్చున్నారు.