మంత్రులకు తొలగిస్తే ప్రభుత్వం పట్టు ఉన్నట్లా..?: సీఎం రేవంత్
అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపదలచుకోలేదు. అందుకే దుబారా తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామని అన్నారు.;
ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘‘రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నో కీలక పథకాలు ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయని రేవంత్ అన్నారు. మహిళలకు ఉచిత బట్టు, వైఎస్ ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు అసెంబ్లీ ప్రారంగణం నుంచి ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రారంభించిందని చెప్పారు.
‘‘మొదటి ఏడాదిలోనే 57 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది. 50 లక్షల కుటుంబాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వెలుగులు చూస్తున్నాం. 43 లక్షల కుటుంబాలు రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 1 కోటి 30 లక్షల నాణ్యమైన చీరలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలోని 29,500 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డలకు అప్పగించాం ’’ అని తెలిపారు.
‘‘కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ చెప్పారు. కులగణన నిర్వహించి ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకుంటున్నాం. కులగణనలో బీసీల లెక్క 56.36 శాతంగా తేలింది.. వారికి 42 శాతం రిజర్వేషన్లు అందించాలి. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు బిల్లును కూడా సభ ముందుకు తీసుకొచ్చాం. దీనిని ఆమోదించుకుని ఎస్సీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. పరిపాలనను ప్రక్షాళన చేస్తూ…పారదర్శక విధానంతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. అప్పులు పెరిగినా ధైర్యాన్ని కోల్పోలేదు. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపదలచుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘అందుకే దుబారా తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నాం. ఇసుక, ఇతర విధానాలను స్ట్రీమ్ లైన్ చేస్తూ ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఇసుకపై ప్రభుత్వానికి కోటిన్నర ఆదాయం వస్తే… ఇవాళ ఇసుక ఆదాయం మూడున్నర కోట్లకు పెరిగింది. పన్నుల వసూలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగ సమస్యను 8.8 నుంచి 6.6కు తగ్గించాం. నిత్యావసర వస్తువుల ఇన్ఫ్లేషన్ లో 1.3 తో దేశంలోనే తెలంగాణ ముందు ఉంది. ఇది మేం చెప్పేది కాదు.. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన గణాంకాలు’’ అని తెలిపారు.
‘‘రాజీవ్ యువ వికాసం ద్వారా రో. 50వేల నుంచి రూ. 4లక్షల వరకు మంజూరు చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించుకున్నాం. జూన్ 2 న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తాం. రాజీవ్ యువ వికాసం ద్వారా నియోజకవర్గానికి 4 నుంచి 5 వేల మందికి ఉపాధి కలిగించొచ్చు. నిజమైన నిరుద్యోగులకు ఇది అందాలి.. వారికిది ఉపయోగపడాలి. ఉద్యోగాల భర్తీ, టీచర్ల బదిలీలు ఎలాంటి ఆరోపణ లేకుండా పారదర్శకంగా నిర్వహించాం. పథకాల అమలులో పారదర్శకంగా ఉండాలి.. అప్పుడే ప్రజలకు మెరుగైన పాలన అందించగలుగుతాం. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. ఇది పార్టీ పథకం కాదు.. ప్రజల పథకం’’ అని అన్నారు.