మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్కు అమెజాన్తో ఒప్పందం !
మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నామని, ప్రతి పథకంలో మహిళలను భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పిత్తి చేస్తున్న వివిధ వస్తువులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే వారు తయారు చేసిన వస్తువులను విక్రయించేలా అమెజాన్తో ఒప్పందాలకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్సీ) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు.
తెలంగాణలోని ఆడ బిడ్డలకు పుట్టింటి వాళ్లు.. అన్నదమ్ములు సారె చీరె పెట్టడం సాంప్రదాయమని... అలాగే రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి తమ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు చీర అందిస్తుందని సీఎం అన్నారు. తెలంగాణలోని అర్హులైన కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని... ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సీఎం సూచించారు.
నవంబరు 19 నుంచి డిసెంబరు 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు చీరల పంపిణీ పూర్తి చేయాలని.. ఇందుకు 65 లక్షలు అందుబాటులో ఉంచామని సీఎం తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు 35 లక్షలు చీరలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. అర్హులైన ప్రతి మహిళకు చీర అందుతుందని... ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన సామాజక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సీపెక్) డాటాను దగ్గర పెట్టుకొని ప్రతి మహిళకు చీర అందెలా చూడాలని.. చీర అందించే సమయంలో ఆధార్ను తీసుకోవాలని.. ముఖ గుర్తింపు చేపట్టాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.
అవకాశం ఉన్నచోటల్లా మహిళలకు ప్రోత్సాహం..
మహిళల ఉన్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాల విషయంలో నిర్లక్ష్యం వహించిందని... తాము వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన నిధులు విడుదల చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామని సీఎం తెలిపారు. యూనిఫాంలు కుట్టే బాధ్యతను అప్పజెప్పడంతో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం సమకూరిందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో రూ.534 కోట్ల పనులు చేపట్టామని, ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలకే అప్పజెప్పామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
శిల్పారామం పక్కన రూ.వందల కోట్ల విలువైన 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని సీఎం అన్నారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలనే లక్ష్యంతో అమెజాన్తో సంప్రదింపులు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళల గౌరవం పెంచాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతోందన్నారు. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందిస్తున్నామని ఆయన తెలిపారు.