ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక ప్రయత్నాలు: సీఎం

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన రుణం మంజూరు చేయాలని సీఎం కోరారు.

Update: 2025-12-01 08:35 GMT

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పెర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని రేవంత్ అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో హడ్కో సంస్థ ఛైర్మన్‌ సంజయ్ కులశ్రేష్ఠతో సీఎం భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చించారు. మెట్రో ,రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన రుణం మంజూరు చేయాలని సీఎం కోరారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నె మీదుగా నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే,నాలుగు సౌత్ స్టేట్స్ ను కలుపుతు తీసుకు రాబోయే బుల్లెట్ ట్రైన్ కోసం రుణం మంజూరు అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ, హైద‌రాబాద్‌ మెట్రో విస్త‌ర‌ణ‌, ఆర్ఆర్ఆర్‌, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాల‌కు త‌క్కువ వ‌డ్డీ రేటుతో రుణాలు ఇవ్వాల‌ని సీఎం హ‌డ్కో ఛైర్మ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి బెంగ‌ళూర్‌, అమ‌రావ‌తి మీదుగా చెన్నై వ‌ర‌కు గ్రీన్ ఫీల్డ్ ర‌హ‌దారులు, బంద‌రు పోర్ట్ వ‌ర‌కు నిర్మించ‌నున్న గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి, బుల్లెట్ ట్రైన్‌ నిర్మాణాల‌పై ముఖ్య‌మంత్రి... హ‌డ్కో ఛైర్మ‌న్‌ల మ‌ధ్య చ‌ర్చ సాగింది. గ‌తంలో అత్య‌ధిక వ‌డ్డీ రేటుతో ఇచ్చిన రుణాల‌కు సంబంధించి రుణ పున‌ర్వ్య‌వ్య‌స్థీక‌ర‌ణ (లోన్ రీక‌న్‌స్ట్ర‌క్చ‌న్‌) అంశాన్ని సీఎం హ‌డ్కో ఛైర్మ‌న్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై హ‌డ్కో ఛైర్మ‌న్ సానుకూలంగా స్పందించారు. సానుకూల వృద్ది రేటుతో ఉన్న తెలంగాణలో ప్రాజెక్టుల‌కు త‌క్కువ వ‌డ్డీరేటుతో దీర్ఘ కాల రుణాలు ఇవ్వాల‌ని సీఎం కోరారు. ఇందిర‌మ్మ ఇళ్ల‌కు సంబంధించి ఇప్ప‌టికే రుణాలు మంజూరు చేశామ‌ని హ‌డ్కో ఛైర్మ‌న్ సీఎం రేవంత్ రెడ్డికి తెలియ‌జేశారు.

మ‌రో 10 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణాల‌కు సంబంధించి రుణాలు వేగంగా మంజూరు చేయాల‌ని సీఎం కోర‌గా ఛైర్మ‌న్ కుల‌శ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 8, 9వ తేదీల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో నిర్వ‌హించ‌నున్న భార‌త్ గ్లోబ‌ల్ సమ్మిట్‌కు హాజ‌రుకావాల‌ని హ‌డ్కో ఛైర్మ‌న్‌ను సీఎం ఆహ్వానించారు. స‌మావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణారావు, సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి కే.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, హ‌డ్కో రీజిన‌ల్ చీఫ్ పి.సుభాష్ రెడ్డి, హ‌డ్కో జాయింట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్లు ఆశీష్ గుండాల‌, స‌య్య‌ద్ ర‌హీముద్దీన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News