ఎస్ఎల్బీసీ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.. హరీష్ రావు
కూలీ కోసం తెలంగాణకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు హరీష్.;
ఎస్ఎల్బీసీ సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రమాదం జరిగి 50రోజులు దాటినా ఇప్పటికీ బాధితుల మృతదేహాలకు సంబంధించి ఎటువంటి సమాచారం అందకపోవడం ఇందుకు నిదర్శమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్లే ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ పురోగతి ఏమాత్రం లేదని, ఒకరి మృతదేహం తప్ప మరే సమాచారం అందలేదని ఆయన అన్నారు. ప్రమాదం జరిగి 50 రోజులైనా ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం కనబరచడం బాధాకరమన్నారు. బాధితులను కాపాడటంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు.
‘‘రేవంతు ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన SLBC టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తి. అయినా ప్రభుత్వ సహాయక చర్యల్లో పురోగతి లేదు. ఇది అత్యంత బాధాకరమైన సందర్భం. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు పెట్టుకొని టన్నెల్ వద్దనే ఉండి రోధిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య వేదన అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలను ప్రశ్నార్థకం చేసింది. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. టన్నెల్ లో చిక్కుకున్న వారిని కాపాడడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి చేతులు దులుపుకుంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగి, యావత్ దేశం వారిని క్షేమంగా బయటికి తీసుకొస్తారని ఆశగా ఎదురు చూస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. టన్నెల్లో పనులు నిర్వహించే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం, ప్రమాదం జరిగిన వెంటనే తగిన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం. పబ్లిసిటీ కోసం టన్నెల్ వద్దకు వెళ్ళి రావడం తప్ప ఇప్పటి వరకు చేసిందేం లేదు. ఒకసారి సమీక్ష చేయడం తప్ప చిత్తశుద్ధితో పరిష్కార మార్గం కోసం ప్రయత్నించింది లేదు. హెలికాప్టర్ లో వెళ్ళి మంత్రులు పెట్టిన డేట్లు మారాయి తప్ప, ఇప్పటి వరకు ఒక్కరిని ప్రాణాలతో బయటకు తెచ్చింది లేదు. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పి ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారు? లోపల చిక్కుకున్న ఆరుగురి పరిస్థితి ఏమిటి? కూటి కోసం, కూలీ కోసం తెలంగాణకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు అండగా నిలవాలి. ఎస్ ఎల్ బి సి ప్రమాద ఘటన పట్ల పూర్తి స్థాయి విచారణ జరపాలని, వాస్తవాలను బయటపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.