‘తెలంగాణ రైతులకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి’

నాలుగు విడతల రైతు భరోసా ఎగ్గొట్టినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా?;

Update: 2025-06-24 08:47 GMT

తెలంగాణలో రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేసింది. తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ధ్యేయంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇది విజయవంతంగా ముందుకు సాగుతున్న క్రమంలో రాష్ట్రంలో రైతు విజయోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాగా దీనిని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నాలుగు విడతల రైతు భరోసా ఎగ్గొట్టినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. విజయోత్సవాలు చేయడం కాదు.. రైతులకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి, 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పి 12,000కి పరిమితం చేయడం మోసం చేయడమే అని ధ్వ‌జ‌మెత్తారు.

‘‘గత వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టి, యాసంగిలో ఎగ్గొట్టి, ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపడం రైతులను మోసం చేయడమే అని మండిప‌డ్డారు. చెప్పింది కొండంత, చేసింది గోరంత. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టావు. అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు. రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నావ్ రేవంత్ రెడ్డి..? రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా? కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకా? రైతు కూలీలందరికి ఆత్మీయ భరోసా అని ఇవ్వకుండా మోసం చేసినందుకా? రుణమాఫీ చారణ చేసి బారాణ మందిని మోసం చేసినందుకా? అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేసినందుకా? 1200 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించినందుకా? ప్రీమియం చెల్లించక రైతు బీమా అమలు ప్రశ్నార్థకం చేస్తున్నందుకా? పంట బీమా అని చెప్పి ఉసురుమనిపించినందుకా? దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందుకా?’’ అంటూ ప్రశ్నలు కురిపించారు.

‘‘లగచర్ల, రాజోలి రైతుల చేతులకు బీడీలు వేసినందుకా? ఏడాదిన్నర పాలనలో ఒక్క చెరువు నింపకుండా, ఒక్క చెక్ డ్యాం కట్టకుండా, కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వనందుకా? ధాన్యం కొనుగోళ్ళు సక్రమంగా జరపనందుకా? జనుము, జీలుగు విత్తనాల ధరలు పెంచి, రైతులకు సకాలంలో అందించినందుకా? వరంగల్ రైతు డిక్లరేషన్ ను అటకెక్కించినందుకా? మీ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా? ఎందుకు సంబురాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రైతుల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయి. బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్న రైతన్న నేడు ప్రభుత్వ పథకాలు అందక పంట పొలాల్లోనే కుప్ప కూలుతున్నడు. బీఆర్ఎస్ పార్టీది రైతు సంక్షేమ ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ పార్టీది రైతు సంక్షోభ ప్రభుత్వం. కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే, మీరు ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న నీ జిమ్మిక్కులను రైతులు నమ్మరు. రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు క్షమాపణలు చెప్పండి. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయండి’’ అని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News