తెలంగాణలో 10 శాతం అధికంగా వర్షాలు, పెరగనున్న సాగు విస్తీర్ణం

తెలంగాణ రాష్టంలో నైరుతి రుతుపవనాల్లో సాధారణం కంటే 10 శాతం అధికంగా వర్షపాతం నమోదు కానుంది.దీంతో మరో 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం కూడా పెరగనుంది.;

Update: 2025-05-29 10:21 GMT
నైరుతి రుతువనాల ఆగమనంతో దుక్కి దున్నుతున్న రైతు

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కురిసే వర్షాలపై ఆధారపడి రైతులు ఖరీఫ్ పంటలను సాగు చేయనున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల వర్షాకాలం నాలుగు నెలల్లో 75 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవుతుంది. కాగా ఈ ఏడాది తెలంగాణలో సాధారణం కంటే 10 శాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ శాస్త్రవేత్త ఏ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ముందస్తుగా రావడం వల్ల నైరుతి రుతుపవనాల ప్రభావ సమయం కూడా పెరుగుతుందని, దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని ధర్మరాజు వివరించారు.ముందుగా వచ్చినా, చురుకుగా సాగుతున్న నైరుతి గాలుల ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు తక్కువని ఆయన తెలిపారు.


పొడి వాతావరణం నాలుగైదు రోజులే...
తెలంగాణలో మే 21 తేదీ నుంచి ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.ముందస్తుగా వచ్చిన రుతుపవనాల ప్రభావం వల్ల కూడా మే 26వతేదీన తొలకరి వర్షాలు తెలంగాణను తాకాయి.కానీ ఈ వర్షాలు రాబోయే మే 31 -జూన్ 7వతేదీ వరకు రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని దీనివల్ల వర్షాలు చాలా తక్కువగా ఉంటాయని, చాలా ప్రాంతాలలో పొడి వాతావరణం ఉంటుందని, రాబోయే రోజుల్లో వేడి కూడా కొంచెం పెరుగుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ అనధికారికంగా చెప్పారు. రైతులు వ్యవసాయ పనులను జూన్ 10 వతేదీ తర్వాత తదుపరి దఫా రుతుపవన వర్షాలు కురుస్తాయని అప్పుడే పంటలు వేసుకోవాలని సూచించారు. కాగా ఒక వారం పాటు, మంచి వర్షం కురిసిన తర్వాత తేమ ఉత్తర ప్రాంతాలకు కదులుతుందని దీని వల్ల కేవలం నాలుగైదు రోజులే పొడి వాతావరణం ఉంటుందని, దీన్ని డ్రై స్పెల్ అనలేమని ఐఎండీ శాస్త్రవేత్త ఆకాశపు ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. ఉత్తరాది నుంచి వీస్తున్న తేమ గాలుల ప్రభావం వల్ల గాలి రీచార్జ్ అయ్యేందుకు మూడు నాలుగు రోజుల సమయం పడుతుందని, దీనివల్ల వర్షాలకు నాలుగైదు రోజులపాటు విరామం ఉండవచ్చని ఆయన వివరించారు.రైతులు పంటలు వేసేందుకు భూమిని దున్ని సిద్ధం చేసుకోవాలని ధర్మరాజు సూచించారు.

పెరగనున్న సాగు విస్తీర్ణం
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరగనుంది. గత ఏడాది ఖరీఫ్ సీజనులో 1.29 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాలకు పెరిగే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్డీఆర్‌కే శర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణలో సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తున్నందున ఈ ఖరీఫ్ సీజనులో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యే అవకాశముందని ఆయన తెలిపారు.

50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
వరి తర్వాత అత్యధికంగా పత్తి 50 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్న 6 లక్షల ఎకరాలు, కందులు 5.50 లక్షల ఎకరాలు, సోయాబీన్ నాలుగున్నర లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా. 70వేల ఎకరాల్లో పెసరపంట, 50వేల ఎకరాల్లో జొన్న, 30వేల ఎకరాల్లో మినుములు, 30వేల ఎకరాల్లో వేరుసెనగ పంటల సాగుకు ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఈ పంటల సాగుకు అనువుగా 9.80 లక్షల టన్నుల యూరియాను సరఫరా చేయాలని నిర్ణయించారు.



వర్షాధార పంటలు విత్తుకోవచ్చు...

నేల తడిచిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, మొక్క జొన్న , జొన్న , కంది, పెసర మొదలగు పంటలను విత్తు కోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. దీనికోసం రైతులు విత్తనాలు, ఎరువులు సేకరిం చుకోవాలని కోరారు.

చెట్ల కింద నిలబడరాదు...
అక్కడక్క డ ఉరుములు, మెరుపులతో కూడినవర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదని, పశువులు,గొర్రె లు, మేకలను చెట్ల కింద ఉంచరాదని ఐఎండీ అధికారులు సూచించారు.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షసూచనలున్నందున రైతులు విద్యు త్ స్తంభాలు, విద్యు త్ తీగలు, చెరువులు, నీటికుంటలకు దూరంగా ఉండాలని కోరారు.

ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నందున కోసిన పం టలను (వరి, మొక్క జొన్న , పెసర, మినుము, జొన్న ,పొద్దు ద్దుతిరుగుడు, నువ్వు లు మొదలగు పంటలు) ముం దు జాగ్రత్త సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఐఎండీ అధికారులు సూచించారు. మార్కె ట్ కు తరలించిన దాన్యం తడవకుండా టార్పాలిన్ తో కప్పి ఉంచాలని కోరారు.వర్షాలు కురుస్తున్నందున మామిడి, కూరగాయ పంటలనుకోసుకొని మార్కె ట్ కు తరలించాలని సలహా ఇచ్చారు.



 తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. నైరుతి రుతుపవనాలు గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా వ్యాపించాయి. ఈ రుతుపవనాలు తెలంగాణ నుంచి చత్తీస్ ఘడ్, ఒడిస్సాల లోని కొన్ని ప్రాంతాల్లోకి వ్యాపించాయని అధికారులు చెప్పారు.గురువారం , రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

పలు జిల్లాల్లో భారీవర్షాలు
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని చోట్ల గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొన్ని చోట్ల,ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.తెలంగాణ వ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని ఐఎండీ తెలిపింది.జూన్ 3వతేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వివరించారు.

ముందస్తు వర్షాలతో మురిసిన రైతులు
గతంలో కంటే ఈ ఏడాది ముందస్తుగా నైరుతి రుతుపవనాలు రావడంతో రైతులు మురిసిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రైతులు దుక్కులు దున్ని సాగుకు సమాయత్తం అవుతున్నారు. వరి సాగు చేసే రైతులు వరి నారు పోశారు.తెలంగాణకు ముందస్తుగా నైరుతి రుతుపవనాలు రావడమే కాకుండా చురుకుగా కదులుతూ భారీవర్షాలు కురుస్తున్నాయి. వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట, మహబూబ్ నగర్ జిల్లాల్లోకి ప్రవేశించిన రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దక్షిణ జిల్లాలకు నైరుతి గాలులతో వర్షాలు కురుస్తున్నాయి.

తొలకరి వర్షాలకు భూమిలో మార్పులు
తెలంగాణలో ముందస్తుగా తొలకరి వర్షాలు కురుస్తుండటంతో ప్రకృతి పరవశించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో కోయిలలు కూశాయి. భూమిలో నుంచి ఆరుద్ర ఎర్ర పురుగులు భూమిలో నుంచి బయటకు వచ్చాయి.వర్షాలతో చల్లదనం వల్ల ఎగిరే పురుగుల జోరు పెరిగింది. వర్షాల రాకతో పక్షులు గుడ్లు పెట్టేందుకు చెట్లపై గూళ్లను సిద్ధం చేసుకోవడం కనిపించింది. సరస్సుల్లో కొంగల సంచారం పెరిగింది.నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడటంతో అడవులు, పార్కుల్లోని నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి.అడవుల్లో కురుస్తున్న వర్షాలకు ఏనుగులు కూడా ఘీంకరిస్తూ వరుణదేవుడికి స్వాగతం పలికాయి. అడవుల్లో ఎక్కడా చూసినా మొక్కలతో పచ్చదనం పరుచుకోవడంతో గొర్రెలు మేత కోసం తిరుగుతున్నాయి. మట్టిలోపల ఉన్న వానపాములు కూడా వర్షాలతో బయటకు వస్తున్నాయి. ఇవన్నీ నైరుతి రుతుపవనాల రాకతో భూమి పరవశించడంతో వాతావరణంలో మార్పులు సంభవించాయి.

ప్రాజెక్టు జలాశయాల్లోకి వరదనీరు
కృష్ణానదీ ఎగువ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం, జూరాల జలాశయాల్లోకి వరదనీరు చేరింది. ఎగువ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో గతేడాది కంటే ముందు గానే శ్రీవైలం ప్రాజెక్టుల్లోకి వరదనీరు చేరే అవకాశం ఉన్న ట్లు శ్రీశైలం డ్యాం అధికారులు చెప్పారు.నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరదనీరు చేరుతుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంంతో కురుస్తున్న వర్షాలతో తెలంగాణ నయాగరా జలపాతంగా పేరొందిన బొగత జలపాతం నుంచి వరదనీరు జాలువారుతుంది. దీంతో పర్యాటకులు జలపాతం అందాలను తిలకించేందుకు తరలివస్తున్నారు.

అత్యల్ప ఉష్ణోగ్రతలు...
తెలంగాణలో గురువారం ఉదయం అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత మెదక్ జిల్లాలో 22.0 డిగ్రీల సెల్షియస్ నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యల్పంగా రాజేంద్రనగర్ లో 22.5 డిగ్రీలు నమోదైందని ఐఎండీ అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36.3 డిగ్రీల సెల్షియస్ నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక గరిష్ఠ ఉష్షోగ్రత హయత్ నగర్ లో 30.6 డిగ్రీల సెల్షియస్ నమోదైందని అధికారులు వివరించారు.



Tags:    

Similar News