హిడ్మా అరెస్టుతో మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోయినట్లేనా ?

సమాచారం ఆధారంగా బృందాలుగా విడిపోయి పేలుడుపదార్ధాలు వచ్చే రూట్లలో నిఘాపెట్టారు.;

Update: 2025-05-29 12:33 GMT
Madvi Hidma

మావోయిస్టులకు గుండెకాయలాంటి ప్రాంతం దండకారణ్యం. మావోయిస్టులకు దండకారణ్యం ఎంత పెద్ద షెల్టర్ జోనుగా ఉండేదో నంబాల కేశవరరావు, హిడ్మా అదేస్ధాయిలో ముందుండి మావోయిస్టులను నడిపించేవారు. అలాంటిది ఒక్కసారిగా మావోయిస్టులకు ఇపుడు వెన్ను విరిగిపోయినట్లయ్యింది. కారణం ఏమిటంటే ఆపరేషన్ కగార్ లో భాగంగా భద్రతాదళాల ఎన్ కౌంటర్లో ఐదురోజుల క్రితం మావోయిస్టు కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు(Nambala Kesava Rao) మరణించగా గురువారం ఉదయం పీపుల్స్ గెరిల్లా ఆర్మీ అగ్రనేత కుంజం హిడ్మా అరెస్టయ్యాడు. నంబాల ఎన్ కౌంటర్ మావోయిస్టు(Maoists)లకు అతిపెద్ద దెబ్బంటే ఇపుడు హిడ్మా(Hidma) అరెస్టుతో మవోయిస్టులు కోలుకోవటం కష్టమనే చెప్పాలి. ఛత్తీస్ ఘడ్ లోని కోరాపుట్ అడవుల్లోకి(Kora put forest) ఒడిస్సా నుండి పెద్దఎత్తున పేలుడుపదార్ధాలు వస్తున్నాయని భద్రతాదళాలకు పక్కా సమాచారం అందింది.

వచ్చిన సమాచారాన్ని భద్రతాదళాలు అనేక రూపాల్లో విశ్లేషించుకుని క్రాస్ చెక్ చేసుకున్నారు. తమకు అందిన సమాచారం నూరుశాతం కరెక్టే అని నిర్ధారించుకున్నారు. వచ్చిన సమాచారం ఆధారంగా బృందాలుగా విడిపోయి పేలుడుపదార్ధాలు వచ్చే రూట్లలో నిఘాపెట్టారు. అనుకున్నట్లుగానే ఒడిస్సాలో నుండి దండకారణ్యంలోకి పేలుడుపదార్ధాలను తీసుకుని వస్తున్న వాహనాలు, మనుషులపైన భద్రతాదళాలు ఒక్కసారిగా దాడిచేసి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ పోలీసులు ఊహించనిరీతిలో పెద్ద లాటరీ తగిలిందనే చెప్పాలి. ఎలాగంటే అరెస్టయిన వారిలో భద్రతాదళాలు ఊహించనిరీతిలో హిడ్మా కూడా ఉన్నాడు. పేలుడుపదార్ధాల తీసుకొస్తున్న వాళ్ళల్లో హిడ్మా ఉంటాడని భద్రతాదళాలు ఏమాత్రం ఊహించలేదు. ఎందుకంటే హిడ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతల జాబితాలో కీలకమైన నేత. అంతటి టాప్ ర్యాకింగ్ మావోయిస్టు నేత ఇంత ఈజీగా తమకు దొరుకుతాడని భద్రతాదళాలు ఎప్పుడు ఊహించుండరు.

అరెస్టయిన హిడ్మా దగ్గర నుండి పోలీసులు ఏకే 47 తుపాకితో పాటు పేలుడుపదార్ధాలకు సంబంధించిన సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిజానికి భద్రతాదళాల ఆపరేషన్ కగార్లో(Opertion Kagar) హిడ్మాను పట్టుకోవటం లేదా ఎన్ కౌంటర్ చేయటం అనే టార్గెట్ ఉంది. గడచిన కొద్దినెలలుగా ఆపరేషన్ కగార్లో భద్రతాదళాలకు హిడ్మా దొరికినట్లే దొరికి చాలాసార్లు తప్పించుకున్నాడు. ఈమధ్యనే జరిగిన కర్రెగుట్టల(Karreguttala Forest) అడవుల్లో హిడ్మా ఉన్నాడనే ప్రచారం జరిగింది. అందుకనే ఛత్తీస్ ఘడ్-మహారాష్ట్ర-తెలంగాణ మధ్యలో సుమారు 250 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన కర్రెగుట్టల ఫారెస్టును సుమారు 24 వేలమంది భద్రతాదళాలు జల్లెడపట్టాయి. దాదాపు మూడువారాలు ఎంత గాలించినా హిడ్మా దొరకలేదు. భద్రతాదళాలు గాలింపు మొదలుపెట్టాయని తెలియగానే హిడ్మాతో పాటు మరికొందరు కీలకనేతలు తప్పించుకుని పారిపోయారు. ఇంతలో ఆపరేషన్ సిందూర్ మొదలవ్వగానే కర్రెగుట్టల గాలింపు ఆగిపోయింది. ఎందుకంటే కేంద్రబలగాల్లోని చాలామందిని ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులకు పంపాల్సొచ్చింది. అందుకనే ఆపరేషన్ కగార్ తాత్కాలికింగా నిలిచిపోయింది.

కర్రెగుట్టల గాలింపులోనే మావోయిస్టుల అగ్రనేతలు ఎన్ కౌంటర్ అవటం ఖాయమన్న పరిస్ధితి కనబడింది. అయితే ఆపరేషన్ కగార్ తాత్కాలికంగా ఆగిపోవటంతో మావోయిస్టులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఎవరూ ఊహించనిరీతిలో ఛత్తీస్ ఘడ్, నారాయణపూర్లోని అబూజ్ మడ్ అడవుల్లో(Abujhmad Forest) జరిగిన ఎన్ కౌంటర్లో 28 మంది మావోయిస్టులు చనిపోయారు. అందులో కేంద్రకమిటి ప్రధన కార్యదర్శి నంబాల కూడా చనిపోవటం మావోయిస్టులకు పెద్దదెబ్బనే చెప్పాలి. అలాంటిది తాజాగా హిడ్మా పోలీసులకు దొరకటం అన్నది అంతే పెద్ద దెబ్బనే చెప్పాలి. వారంరోజుల వ్యవధిలో జరిగిన రెండుఘటనలతో దండకారణ్యంలో మావోయిస్టుల బలమంతా తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పాలి.

హిడ్మా నేపధ్యం ఏమిటి ? ఎవరీ హిడ్మా ?

ఛత్తీస్ ఘడ్, దక్షిణ సుక్మా(Sukma District) జిల్లాలోని పూవర్తి (Puvarti village) గ్రామంలో 1981లో మాడ్వి హిడ్మా పుట్టాడు. 10వ తరగతి వరకు చదివిని ఈ మావోయిస్టు హిడ్మా అలియాస్ హిడ్మాలు అలియాస్ సంతోష్ వెంటనే మావోయిస్టు పార్టీలో చేరాడు. అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా దండకారణ్యంలోని బస్తర్ అడవుల్లో మావోయిస్టు పార్టీలో కీలకనేతగా ఎదిగాడు. ఆ తర్వాత మావోయిస్టుల్లో గెరిల్లా యుద్ధరీతులను ప్రవేశపెట్టి అనేక దాడులకు కారణమయ్యాడు. అందుకనే మావోయిస్టు అగ్రనేతలు హిడ్మాను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ)కి ఇన్చార్జిగా నియమించారు. 2016లో మరికొందరు మావోయిస్టులతో కలిసి హిడ్మా అరెస్టయినప్పటికీ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో తొందరలోనే విడుదలైన హిడ్మా దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటికి కమాండర్ గా అపాయింట్ అయ్యాడు.

సుక్మా, దంతెవాడ, బస్తర్ అటవీప్రాంతాలు కేంద్రంగా హిడ్మా నిర్వహించిన అనేక దాడుల కారణంగా మావోయిస్టు కేంద్రకమిటికి సభ్యుడిగా ప్రమోషన్ అందుకున్నాడు. చిన్నవయసులోనే మావోయిస్టు కేంద్రకమిటిలో సభ్యుడైన హిడ్మా అందరి దృష్టిని ఆకర్షించాడు. కొన్ని వందలమంది యువకులను దళంలోకి ఆకర్షించటమే కాకుండా మావోయిస్టులతో ప్రత్యేకంగా గొరిల్లా దళాన్ని తయారుచేయటంలో హిడ్మా కీలకవ్యక్తి. దంతెవాడ(Dantewada)లో 2010, సుక్మా జిల్లాలో 2017లో పోలీసులపైన దాడులు చేయటంలో హిడ్మా వ్యూహాలే కీలకం. ఇప్పటివరకు హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు 27 గెరిల్లా తరహ దాడులకు పాల్పడి సుమారు వందమందికి పైగా పోలీసుల మరణానికి కారణమయ్యాడు.


హిడ్మాకు పోలీసులు దగ్గరవడం 2024లో మొదలయింది

పోలీసుల కన్నుగప్పి హిడ్మా తప్పించుకుంటున్నా, ఒక విధంగా ఆయనకు పోలీసులకు మధ్య దూరం తగ్గిపోవడం 2024లోనే మొదలయింది. అది హిడ్మా సొంతవూరు పూవర్తి (Puvarti) లో మొదలయింది. ఇది సుక్మా జిల్లాలో ఉంటుంది. 2024లో ఫిబ్రవరిలో ఆ ఊరిలో పెను మార్పు వచ్చింది. దశాబ్దాలుగా పోలీసులు ప్రవేశించేందుకు వీలులేని గ్రామం పూర్వాతి. చుట్టూర దట్టమయిన అడవులు, కొండలు ఉండటంతో ఇది పోలీసు దుర్బేధ్యమయిన గ్రామంగా ఉండింది. పోలీసులే కాదు, ఈవూర్లోకి అభివృద్ధి కూడా రాలేకపోయింది. 2024లో జిల్లాపోలీలు, కోబ్రా పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు, బస్తర్ ఫైటర్స్, సిఆర్ పిఎఫ్ సంయుక్తంగా వూర్లో క్యాంపు ఏర్పాటు చేశారు. అంతేకాదు, అక్కడ త్రివర్ణ పతాకం కూడా ఎగరేసి గ్రామాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల మధ్య హిడ్మా తల్లి గ్రామం విడిచివెళ్లిపోయింది. కొన్ని రిపోర్టుల ప్రకారం, తాను పోలీసులకు అన్ని రకాల సహాకరం అందిస్తానని ఆమె చెప్పారు. ఈ గ్రామం సుక్మ జిలా, బీజాపూర్ జిల్లా సరిహద్దు సుక్మా పట్టణానికి 156 కిమీదూరాన ఉంటుంది. ఈ గ్రామం నుంచి హిడ్మాతోపాటు బర్సే దేవ అనే మరొక కమాండర్ కూడా వచ్చారు. బస్తర్ అడవుల్లోని జరిగిన మావోయిస్టు దాడుల వెనక ప్లాన్లన్నీ వీళ్లిద్దరివేనని పోలీసుల అనుమానం.

దూరదర్శన్ ప్రవేశం

2024 డిసెంబర్ నాటికి పూవర్తి గ్రామ స్వరూపం మారిపోయింది.స్వాతంత్ర్యం వచ్చాక మొదటి సారి ఈ గ్రామంలోకి దూరదర్శన్ ప్రసారాలు మొదలైంది. ప్రజలు న్యూస్, సినిమా, పాటలు వీక్షించడం మొదలయింది. అదే సమయంలో గ్రామంలోని ప్రజలకు సంక్షేమపథకాలు (Niyad Nellanar Yojana) అమలుచేయడం కూడా మొదలయింది. గ్రామస్థులకు సోలార్ పంపుసెట్లు, లైట్లు, ఫ్యాన్లు అందించారు. గ్రామంలో టివీసెట్లు పంపిణీ చేశారు. దీనితో గ్రామం జనాలు మానసికంగా కూడా పోలీసులచేతిలోకి వచ్చేశారు. అంతే కాదు, ఈ గ్రామం కేంద్రం నుంచి సెక్యూరిటీ దళాలు మావోయిస్టుల ఏరివేత ప్రారంభించారు. ఇదే నేడు హిడ్మాను చేరుకునేందుకు బాట వేసింది.

దండకారణ్యంలోని దంతెవాడ, బస్తర్(Baster Area) అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు దశాబ్దాలుగా కంచుకోటల్లాగ ఉండేవి. పై ప్రాంతాల్లోని అడవుల్లోకి ఉంటున్న ఆదివాసీలు తప్ప మరెవరు ప్రవేశించేవారు కారు. పొరబాటున కూడా పోలీసులు దంతెవాడ అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించాలని అనుకునే వారు కారు. అందుకనే వేలకిలమీటర్ల పరిధిలోని దట్టమైన అటవీప్రాంతాలు మావోయిస్టులకు కంచుకోటల్లాగ ఉండేవి. అయితే వివిధ సందర్భాల్లో తమకోసం అడవుల్లో గాలింపు చేస్తున్న పోలీసులపైకి ఊహించనిరీతుల్లో దాడులు చేసి హతమార్చి మావోయిస్టులు పైచేయి సాధించారు. ఈ విధంగా అనేకసార్లు మావోయిస్టుల చేతిలో దారుణంగా దెబ్బతిన్న తర్వాత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మేల్కొన్నాయి.

ఎలాగైనా సరే మావోయిస్టులను అణిచివేయాలన్న పట్టుదలతో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావ ప్రాంతాల్లో రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్ధలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సుక్మా, బీజపూర్, జగదల్ పూర్ ప్రాంతాల్లో ముఖ్యమైన 11 రోడ్లను కేంద్రప్రభుత్వం నిర్మించింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమన్వయం చేసుకున్న కేంద్రప్రభుత్వం తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మారుమూల, అటవీ ప్రాంతాల అభివృద్ధిపై బాగా దృష్టిపెట్టి వేల కోట్లరూపాయలు ఖర్చుచేసింది. ఇదేసమయంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని పోలీసులకు సీఆర్పీఎఫ్, కోబ్రా, స్పెష్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటి కేంద్ర బలగాలను కలిపి సుమారు లక్షమందితో ఆపరేషన్ కగార్ ను ఏర్పాటుచేసింది. 2026, మార్చి 30వ తేదీకి మావోయిస్టు రహిత దేశంగా మార్చాలని నరేంద్రమోడి, అమిత్ షా కంకణం కట్టుకున్నారు.

ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్ రూపంలో వేలాది మంది భద్రతాదళాలు పై రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల వేట మొదలుపెట్టారు. ఆపరేషన్ కగార్ లో భద్రతాదళాలు ఇంతకు ముందెన్నడు లేనట్లుగా ద్రోన్లు, హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నది. దండకారణ్యంలోని చాలా అటవీప్రాంతాల్లోకి భద్రతాదళాలు చొచ్చుకునిపోయి పై చేయి సాధిస్తున్నాయి. ప్రతి 5 కిలోమీటర్లకు 500 మంది సబ్బందితో ఒక బేస్ క్యాంపును ఏర్పాటుచేసి మొబైల్ టవర్లను కూడా రెడీ చేస్తున్నాయి. ఈ విధంగా దండకారణ్యం ప్రాంతాన్ని భద్రతాదళాలు అన్నీవైపు నుండి కమ్ముకుని లోపలకు వచ్చేస్తుండటంతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇందులో భాగంగానే నంబాల కేశవరావు ఎన్ కౌంటర్. నంబాల చనిపోయిన ఐదురోజుల్లోనే హిడ్మా కూడా దొరికిపోవటంతో మావోయిస్టులు కోలుకోవటం ఇప్పట్లో సాధ్యంకాదని అర్ధమవుతోంది.

Tags:    

Similar News