వృద్ధ మహిళకు జిల్లా కలెక్టర్ ఆసరా
కన్న కొడుకు, కోడలు తనకు పట్టెడన్నం పెట్టడం లేదని కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధ మహిళకు కలెక్టర్ ఆసరా అందించారు.;
By : Saleem Shaik
Update: 2025-08-11 23:36 GMT
కొడుకు కోడలు ఉన్నా నిరాదరణకు గురై నడవలేని స్థితిలో ఓ వృద్ధురాలు తనకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరడానికి కలెక్టరేట్ కు వచ్చి పడుతున్న ఇబ్బందిని కళ్లారా చూసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ తక్షణం స్పందించారు. వృద్ధురాలి దీనస్థితిని విని పాలనాధికారి చలించారు.
పట్టెడన్నం పెట్టక పోవడంతో...
కొడుకు, కోడలున్నా పట్టెడన్నం పెట్టక పోవడంతో తల్లడిల్లిన వృద్ధురాలైన ఆ తల్లి రుక్మిణి నడవలేని పరిస్థితిలో సహాయం కోసం నారాయణ పేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చింది. కలెక్టరు కార్యాలయం మెట్టు ఎక్కలేక అపసోపాలు పడుతూ తన ఇద్దరు కూతుళ్ల సహాయంతో వస్తున్న రుక్మిణీ అనే వృద్ధురాలిని బయట నుంచి కలెక్టరేటుకు వస్తున్న నారాయణపేట జిల్లా కలెక్టరు సిక్తా పట్నాయక్ చూశారు. అక్కడే తన వాహనం ఆపిన కలెక్టరు వృద్ధురాలి వద్దకు వచ్చి రుక్మిణీ సమస్యను అడిగి తెలుసుకొని, ఆమెకు వీల్ ఛైర్ అందించి పట్టణంలోని సఖీ కేంద్రానికి తరలించారు.
రుక్మిణీ కథ విని చలించిన కలెక్టరు
తన భర్త ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ మరణించడంతో కారుణ్య నియామకం కింద తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని రుక్మిణీ చెప్పింది.తనకు మధుమేహ వ్యాధితోపాటు వెన్నునొప్పి సమస్యతో బాధపడుతుంటే తన కొడుకు, కోడలు తనకు పట్టెడన్నం పెట్టడం లేదని, తనను ఇంటి బయటకు పంపించారని రుక్మిణీ కన్నీళ్లతో కలెక్టరు సిక్తా పట్నాయక్ కు చెప్పారు. తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టరును వేడుకున్నారు.
సఖీ కేంద్రానికి వృద్ధురాలి తరలింపు
రుక్మిణీ కుమారుడి పై దర్యాప్తు చేసి అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆర్డీఓ రామచందర్ ను ఆదేశించారు. దర్యాప్తు చేసే వరకూ రుక్మిణీని నారాయణ పేట సఖి కేంద్రానికి తరలించి కలెక్టరు ఆశ్రయం కల్పించారు. వృద్ధురాలికి వీల్ ఛైర్ ను అందజేశారు.