రాజకీయ పెద్దలంతా దూరి మేడిగడ్డను ముంచేశారు
ఇపుడు విషయం ఏమిటంటే మేడిగడ్డ ప్రాజెక్టులోని ఏడో బ్లాకులో మూడుపిల్లర్లు కుంగిపోయిన కారణంగా నీటి నిల్వకు ప్రాజెక్టు ఎందుకు పనికిరాదని తేలిపోయింది;
అతి ఎప్పుడూ అనర్ధదాయకమే అని పెద్దలు చెబుతారు. దీనికి తాజా ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన(Medigadda Project) మేడిగడ్డ ప్రాజెక్టే. రాజకీయ బాసుల అతిజోక్యం వల్లే సుమారు లక్ష కోట్లరూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్ళు కూడా నిండకుండానే ఎందుకూ పనికిరాకుండా పోయింది. బీఆర్ఎస్ హయాంలో ఎంతోగొప్పగా చెప్పుకుని ప్రచారంచేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) ఇపుడు నీటివినియోగానికి పనికిరాకుండాపోయింది. దీనికి ప్రధాన కారకులు ఎవరు ? ప్రాజెక్టు నిర్మాణ సంస్ధ ఎల్ అండ్ టీ(L and T)నా ? దగ్గరుండి ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ ఉన్నతాధికారులా ? లేకపోతే ప్రాజెక్టు స్ధలం ఎంపిక దగ్గర నుండి డిజైనింగ్, రీ డిజైనింగ్, నిధుల విడుదల, నిర్మాణసంస్ధకే సర్వాధికారాలు కట్టబెట్టి ప్రభుత్వ ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల నోళ్ళు మూయించేసిన రాజకీయపెద్దలు కారణమా ?
ఇపుడు విషయం ఏమిటంటే మేడిగడ్డ ప్రాజెక్టులోని ఏడో బ్లాకులో మూడుపిల్లర్లు కుంగిపోయిన కారణంగా నీటి నిల్వకు ప్రాజెక్టు ఎందుకు పనికిరాదని తేలిపోయింది. దీనిపై నేషనల్ డ్యాంసేఫ్టి అథారిటి(NDSA) అందించిన రిపోర్టులో కూడా పిల్లర్లను కూలగొట్టి తిరిగి నిర్మించటమో లేకపోతే మొత్తం ప్రాజెక్టును పక్కనపెట్టడమో చేయాలని చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అవకతవకలపై దర్యాప్తుచేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్(Vigilance and Enformcement) ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వానికి రిపోర్టు అందించారు. ఆ రిపోర్టులో పాలకుల తప్పని డైరెక్టుగా చెప్పలేదుకాని ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు, నిధులు విడుదలచేసిన ఆర్ధికశాఖ ఉన్నతాధికారు, పర్యవేక్షణలో ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల ఫెయిల్యూర్లు, క్షేత్రస్ధాయిలో పర్యవేక్షణ చేయని అధికారులు, నిర్మాణసంస్ధ ప్రతినిధులు, క్వాలిటి చెక్ చేయని ఉన్నతాధికారులు అందరిదీ తప్పే అని స్పష్టంగా చెప్పింది.
ఉన్నతాధికారులను తప్పుపట్టిన రిపోర్టు
విధినిర్వహణలో విఫలమైన ఉన్నతాధికారుల పేర్లు, వాళ్ళ హోదాతో పాటు విజిలెన్స్ రిపోర్టులో ఉంది. ఉన్నతాధికారులు ఏ విధంగా ఫెయిలయ్యారనే విషయాలను కూడా రిపోర్టు ప్రస్తావించింది. ఇంజనీర్ ఇన్ చీఫ్ లు, చీఫ్ ఇంజనీర్లు, సూపరెండెంట్ ఇంజనీర్ల నుండి కిందస్ధాయి ఇంజనీర్ల వరకు ఎవరి ఫెయిల్యూర్ ఎంతన్న విషయాన్ని రిపోర్టు బయటపెట్టింది. అలాగే బిల్లులు మంజూరుచేసిన ఆర్ధికశాఖ ఉన్నతాధికారుల ప్రస్తావన కూడా ఉంది. నిర్మాణసంస్ధ తరపున జరిగిన తప్పులను కూడా రిపోర్టు ఎత్తిచూపింది. పనులు పూర్తిగా చేయకుండానే, పిల్లర్ల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే మూడు పిల్లర్లు కుంగిపోయినట్లు రిపోర్టులో ఉంది. పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసి కూడా ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని, క్షేత్రస్ధాయిలో తనిఖీలు చేయాల్సిన ఇంజనీరింగ్ సిబ్బంది కూడా వాస్తవాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకునిపోలేదని చెప్పింది.
ప్రాజెక్టు నిర్మాణంలోని ప్రతిదశలోను నాసిరకం నిర్మాణం, పర్యవేక్షణ లోపించటం వల్లే ప్రాజెక్టు వినియోగానికి పనికిరాకుండాపోయిందని రిపోర్టు స్పష్టంగా చెప్పింది. ఇంతవరకు బాగానే ఉందికాని ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు వాళ్ళు బాధ్యతలను ఎందుకు సరిగా నిర్వర్తించలేదు ? నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును తరచూ తనిఖీలు చేయాల్సిన ఇంజనీర్లు ఎందుకు చేయలేదు ? క్షేత్రస్ధాయి ఇంజనీర్లు తమ బాధ్యతలను ఎందుకు వదిలిపెట్టారు ? పనులు నాసిరకంగా జరిగినా ? పనులు అసంపూర్తిగానే ఉన్నా, కాంట్రాక్టు గడువు పూర్తికాకపోయినా నిర్మాణసంస్ధకు ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు పూర్తి బిల్లులు ఎందుకు చెల్లించేశారు ? పిల్లర్లు కుంగిపోవటంలో తమ తప్పేమీలేదని నిర్మాణసంస్ధ అంత ధైర్యంగా ఎలా అడ్డంతిరిగింది ?
రాజకీయ పెద్దలదే అసలు తప్పు
ఈ ప్రశ్నలకు విజిలెన్స్ రిపోర్టులో సరైన సమాధానం లేదుకాని రిపోర్టు మొత్తం చదివిన తర్వాత రాజకీయపెద్దల అతిజోక్యమే కారణమని అర్ధమైపోతుంది. ప్రాజెక్టు నిర్మించాల్సిన స్ధలం మార్పు దగ్గర నుండి ప్రతిదశలోను తాను కుర్చీవేసుకుని కూర్చుని దగ్గరుండి కట్టించానని అప్పట్లే కేసీఆర్(KCR) చాలా గొప్పగా చెప్పుకున్నారు. ప్రాజెక్టు డిజైన్ తానే తయారుచేయించానన్నట్లుగా కేసీఆర్ చెప్పుకున్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటని పదేపదే డబ్బా కొట్టుకున్నారు. ఇక కేటీఆర్(KTR) అయితే చైనాలో త్రీగోర్జెస్ డ్యామ్(Three Gorges Project) అంత గొప్పది కాళేశ్వరం ప్రాజెక్టని కొన్ని వందలసార్లు చెప్పుంటారు. చివరకు ఏమైందంటే ‘పేరుగొప్ప ఊరుదిబ్బ’ అన్న సామెతలాగే నిర్మించిన మూడేళ్ళకే ప్రాజెక్టు మూలపడింది.
బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణం పూర్తిచేసుకుని, ప్రాజెక్టులోని పిల్లర్లు దెబ్బతిని వాడకానికి పనికిరాకుండా పోయినా తమకు ఎలాంటి సంబంధంలేదని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు ప్రభుత్వంపై ఎదురుదాడులు చేస్తుండటమే విచిత్రం. పైగా పిల్లర్లకు చిన్నపాటి సమస్యలు వస్తే రిపేర్లు చేయించరా ? అని హరీష్, కేటీఆర్, కవిలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. కేటీఆర్ మరీ విచిత్రమైన ఆరోపణచేశారు. అదేమిటంటే కాంగ్రెస్ నేతలు బాంబులు పెట్టి ప్రాజెక్టును పనికిరాకుండా చేశారేమో అనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. నిర్మాణసంస్ధ తరపున అప్పటి పాలకులు వత్తాసు తీసుకుని ప్రాజెక్టు నిర్మాణం మొత్తం బాధ్యతను ప్రైవేటుసంస్ధకే వదిలిపెట్టారు. దాంతో ఇరిగేషన్ శాఖలోని ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు చోద్యం చూస్తు కోర్చోవాల్సొచ్చింది. కేసీఆర్ దన్ను కారణంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ తో పాటు ఏ స్ధాయిలోని అధికారులను కూడా నిర్మాణసంస్ధ లెక్కచేయలేదు.
నిర్మాణ సంస్ధది ఏకపక్షమేనా ?
ఉన్నతస్ధాయిలోని అధికారులనే నిర్మాణసంస్ధ లెక్కచేయకపోతే ఇక క్షేత్రస్ధాయిలోని అధికారులకు దిక్కేముంది. అందుకనే ప్రాజెక్టు నిర్మాణ స్ధలం మారినా, డిజైన్లు మార్చి రీ డిజైన్లు చేసినా, నిర్మాణంలో లోపాలన్నా ప్రైవేటుసంస్ధను అడిగే ధైర్యం ఎవరు చేయలేదు. ఈ దన్నుతోనే ఆర్ధికశాఖ ఉన్నతాధికారుల నెత్తిన కూర్చుని తమకు రావాల్సిన బిల్లులను కాంట్రాక్టు గడువుకాలంతో సంబంధంలేకుండా ఎల్ అండ్ టీ యాజమాన్యం మొత్తం రాబట్టేసుకుంది. తీసేసుకున్న బిల్లులతో పోల్చుకుంటే ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్లులు బఠాణీలంత. అందుకనే ప్రాజెక్టు లోపాలతో తమకు ఎలాంటి సంబంధంలేదని నిర్మాణసంస్ధ అంత ధైర్యంగా అడ్డంతిరగ్గలిగింది. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత నిర్మాణసంస్ధలే అయినా ఏకపక్షంగా పక్కకు తప్పుకున్నది. అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్మాణసంస్ధ మెడలువంచి దారికి తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. విజిలెన్స్ రిపోర్టులో ఎవరెవరిపైన చర్యలు తీసుకోవాలి, ఎవరి తప్పిదాలకు ఎలాంటి శిక్షలుంటాయో కూడా ప్రభుత్వానికి నివేదించింది.
ఎవరెవరిపై చర్యలు ?
మాజీ ఈఎన్సీ బీ నగేంద్రరావు, ప్రస్తుత ఈఎన్సీ టీ శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ వి. ఫణిభూషణ్ శర్మ, రిటైర్ అయిన మాజీ ఈఎన్సీ సీ మురళీధర్, ఎన్ వెంకటేశ్వర్లు, మాజీ డిప్యుటి చీఫ్ ఇంజనీర్ గజ్జెల హరిహరచారి, మాజీ చీఫ్ ఇంజనీర్ బీ వెంకటేశ్వర్లు, మాజీ ఎస్ఈ గంగాధర్, మాజీ సీఈ అజయ్ కుమార్, మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తో పాటు 33 మంది వివిధ స్ధాయిల్లోని అధికారులపౌన కఠినచర్యలు తీసుకోవాలని చెప్పింది.
ఏ సెక్షన్లు వర్తిస్తాయి ?
ఐపీసీ-120(బి) ప్రకారం నేరపూరిత కుట్ర, 6 నెలలు జైలు, ఐపీసీ-336 ప్రకారం మానవతప్పిదం, మూడునెలలు జైలుశిక్ష లేదా జరిమాన. విధించాలి. ఐపీసీ-409 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి నమ్మకద్రోహానికి పాల్పడినట్లు తేలితే యవజ్జీవ శిక్ష విధిస్తారు. ఐపీసీ-418 ప్రకారం మోసపూరితంగా ఇతరుల అభిప్రాయాలను ప్రభావితంచేసినందుకు మూడేళ్ళు జైలుశిక్ష. ఐపీసీ 423 ప్రకారం చీకటిఒప్పందంతో హక్కులు ఇస్తే రెండేళ్ళు శిక్ష. అవినీతి నిరోధక చట్టం ప్రకారం మూడునుండి ఏడేళ్ళు జైలు. ఆనకట్టల భద్రతా చట్టం-2021 ప్రకారం జవాబుదారీతనం లేకపోతే రెండేళ్ళు శిక్ష పడాలి. ప్రభుత్వ ఆస్తులకు నష్టం నివారించే చట్టం1984 ప్రకారం ఐదేళ్ళు జైలుశిక్ష తప్పదని రిపోర్టు స్పష్టంగా చెప్పింది.