రాజీవ్ యువ వికాసం లబ్దిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

పథకం ద్వారా ఎంపికైన లబ్దిదారులకు జూన్ 2-9 తేదీల మధ్య దశలవారీగా యూనిట్ల అలాట్మెంట్ లెటర్లు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది;

Update: 2025-05-28 07:47 GMT
Rajiv Yuva Vikasam Scheme

రాజీవ్ యువ వికాస పథకంలో లబ్దిదారులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పథకం ద్వారా ఎంపికైన లబ్దిదారులకు జూన్ 2-9 తేదీల మధ్య దశలవారీగా యూనిట్ల అలాట్మెంట్ లెటర్లు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా 5 లక్షలమంది యువతకు రు. 8 వేల కోట్ల మేర ప్రయోజనాలు చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. టార్గెట్ ఫిక్సయిన తర్వాత ప్రభుత్వం యువతనుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అందులో యువత తాము ఏర్పాటుచేయాలని అనుకుంటున్న యూనిట్ల(వ్యాపారం) వివరాలను దరఖాస్తుల్లో స్పష్టంచేశారు. దరఖాస్తులను పరిశీలించిన స్క్రీనింగ్ కమిటి అందులో నుండి ఆచరణసాధ్యమైన వ్యాపార దరఖాస్తులు 5 లక్షలను ఎంపికచేసింది.

ఎంపికచేసిన దరఖాస్తుల్లో లబ్దిదారులు కూరగాయల కొట్లు, కిరాణాకొట్లు, చిన్న బేకరీలు, గిగ్ వర్కర్లుగా చేరాలని అనుకుంటున్న వారికి మోటారుసైకిళ్ళు కొనుగోలుకు రుణాలు, చిన్నసైజు డిపార్టుమెంట్ స్టోర్లు, ఐస్ క్రీమ పేర్లర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లాంటి ఏర్పాటుపై మెజారిటి యువత మొగ్గుచూపుతున్నట్లు దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి అర్ధమైంది. యువతకు 50 వేలరూపాయల నుండి రు. 4 లక్షల వరకు ప్రభుత్వం రుణాలు మంజూరుచేయలని డిసైడ్ చేసింది. ఎంపికైన 5 లక్షల మంది యువతకు అలాట్మెంట్ లెటర్లు ఇచ్చి యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన అప్పును బ్యాంకుల ద్వారా యువతకు అందించబోతోంది ప్రభుత్వం.

యువత దరఖాస్తుల్లో చెప్పినట్లుగా వారి ఆసక్తులను బట్టి జూన్ 10 నుండి 15వ తేదీవరకు అంటే ఐదురోజులు నిపుణుల ద్వారా సంబంధిత యూనిట్ల ఏర్పాటు, నిర్వహణలో దరఖాస్తుదారులకు అవసరమైన శిక్షణ ఇప్పించబోతోంది. 15 తర్వాత మంచిరోజు చూసుకుని యువత ఎవరి ఆసక్తికి తగ్గట్లు, రుణాలు మంజూరు ప్రకారం యూనిట్లను గ్రౌండ్ చేసుకుంటారు. తెలంగాణ(Telangana) ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన మొదలవ్వబోయే ఈ ప్రక్రియ గాంధీజయంతి అక్టోబర్ 2వ తేదీ నాటికి ఎంపికచేసిన 5 లక్షల యువత యూనిట్లను గ్రౌండింగ్ చేయించి స్వయం ఉపాధికి తోడ్పడాలని రేవంత్(Revanth) ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. యూనిట్లకు సంబంధించి యువతకు నిపుణులతో శిక్షణ, యూనిట్ల గ్రౌండింగ్ తదితరాలను జిల్లాల ఇన్చార్జిమంత్రులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షించబోతున్నారు.

ఇదేవిషయమై డిప్యుటి సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మాట్లాడుతు రాజీవ్ యువవికాస(Rajiv Yuva Vikasam Scheme) పథకంలో తొలిదశలో లక్షరూపాయల విలువైన యూనిట్లను గ్రౌండింగ్ చేయిస్తున్నట్లు చెప్పారు. దశలవారీగా చివరకు రు. 4 లక్షల విలువైన యూనిట్లను గ్రౌండింగ్ చేయించబోతున్నట్లు చెప్పారు. ఈ పథకంలో ఎక్కువమంది యువత రు. 4 లక్షల యూనిట్ల ఏర్పాటుపైనే ఎక్కువ ఆసక్తి చూపినట్లు భట్టి తెలిపారు. రు. 4 లక్షల విలువైన యూనిట్లకు ప్రభుత్వం గరిష్టంగా రు. 2.80 లక్షల వరకు సబ్సిడి ఇస్తుందన్నారు. మిగిలింది బ్యాంకులు అప్పుగా ఇస్తుందని వెల్లడించారు. 100 శాతం సబ్సిడి ఉన్న రు. 5 వేల రుణాలకు కేవలం 39 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని డిప్యుటి సీఎం తెలిపారు. రు. 50 వేల నుండి లక్షరూపాయల రుణాల్లో ప్రభుత్వం 90 శాతం సబ్సిడి ఇస్తోందన్నారు. ఈ రుణాలకు 93 వేలమంది దరఖాస్తు చేసుకున్నట్లు భట్టి చెప్పారు. ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని యువత అర్ధంచేసుకుని సక్రమంగా ఉపయోగించుకుంటే కొంతమందైనా ఆర్ధికంగా నిలదొక్కుకునే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News