కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్షే
తీవ్రంగా ఖండించిన హరీష్ రావు, కవిత;
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో జూన్ 16న విచారణకు రావాలంటూ ఏసీబీ అధికారులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. కాగా కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని హరీష్ రావు, కవిత తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్చేనన్నారు. పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, అందులో భాగంగా నిలదీస్తున్న కారణంగానే నోటీసుల డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చసినా ప్రజల తరుపున తమ పార్టీ చేస్తున్న పోరాటాన్ని ఆపలేరని అన్నారు.
‘‘ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధించే తప్ప మరొకటి కాదు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి కేటీఆర్ కు ఇచ్చిన తాజా నోటీసులే నిదర్శనం. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తున్న కేటీఆర్ నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ఈ నోటీసులు పంపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 నెలల పాలన లో డైవర్షన్ పాలిటిక్స్ ను అమలు చేస్తూ బీ ఆర్ ఎస్ ను బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం గెలిచే ప్రసక్తే లేదు రేవంత్ రెడ్డి డ్రామా, డైవెర్షన్ రాజకీయాలు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయి. ఫార్ములా ఈ రేసింగ్ తో తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. పెట్టుబడులు కూడా వచ్చాయి.తెలంగాణ ప్రతిష్ట పెంచినందుకా కేటీఆర్ పై మీ నోటిసుల ప్రతాపం ? 2000లో చంద్రబాబు ఫార్ములా వన్ కోసం కృషిచేసి నిర్వహించలేకపోయాడు. అలాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ గారి కృషి వల్ల ఫార్ములా వన్ వంటి ప్రతిష్టాత్మక రేస్ ను భారతదేశానికి అందులోనూ హైదరాబాద్ కి తీసుకొని వచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తెలంగాణను మార్చేందుకు ఫార్ములా ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించారు. అమర్ రాజా వంటి కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువును, దేశ పరువును మంటకలిపింది. అందాల పోటీతో లాభం లేదు కానీ రాష్ట్ర పరువు మాత్రం తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నందుకు కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇచ్చిందని స్పష్టమైతున్నది. రేవంత్ రెడ్డి.. నువ్వు ఎన్ని రకాలుగా వేధించినా నీ వైఫల్యాలను ఎండగట్టడం మాత్రం బీఆర్ఎస్ ఆపదు’’ అని తేల్చి చెప్పారు.
మీ కుట్రలు పారవు రేవంత్: కవిత
కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని కవిత పేర్కొన్నారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా మీ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం అని కవిత స్పష్టం చేశారు. చివరగా జై తెలంగాణ జై కేసీఆర్ అని నినదించారు.