‘రేవంత్‌కు ప్రజల ఆరోగ్యం కన్నా మద్యం ఆదాయాలే ముఖ్యం’

బస్తీ దవాఖానా వైద్య సిబ్బంది నాలుగు నెలల నుంచి అందని జీతాలపై హరీష్ రావు ఆగ్రహం.

Update: 2025-10-21 09:06 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై కనీస శ్రద్ధ చూపడం లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల లైసెన్స్‌లపై తీసుకున్న శ్రద్ధలో ఒక్కశాతమయినా ప్రజల ఆరోగ్యం పెట్టాలని కోరారు. మద్యం దుకాణాలకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోతే గడువు పెంచిన ప్రభుత్వం.. బస్తీ దవాఖానాల్లో వైద్య సిబ్బంది జీతాలు, ఔషధాల నిల్వలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మంగళవారం శేరిలింగపల్లి ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానాన్ని హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగానే పేషెంట్ల సమస్యలను, వైద్య సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఔషధాల నిల్వలపైనా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే తమకు నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఘాటు విమర్శలు చేశారు.

‘‘బస్తీలో ఉండే ప్రజలను సుస్తీ (అనారోగ్యం) నుంచి నయం చేసే విధంగా కేసీఆర్ పనిచేయించిన బస్తీ దవాఖానలు. బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగవద్దు, తమ గడప దగ్గరనే, తమ వాకిట్లోనే వైద్యం అందించాలని ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానలను కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే, హైదరాబాదులో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ హయాంలో 110 రకాల మందులు ఉచితంగా అందించే వాళ్ళం. 134 రకాల పరీక్షలను ఉచితంగా చేసి పేషెంట్ల ఫోన్లకే రిపోర్టులు పంపించే వాళ్ళం. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టింది’’ అని అన్నారు.

‘‘ఆరు నెలల నుండి జీతం రావడం లేదు. స్టాఫ్ నర్స్ దేవమ్మకు ఐదు నెలల నుండి జీతం రాలేదు అని అన్నది. సపోర్టింగ్ స్టాఫ్ ని అడుగుతే ఆరు నెలల నుంచి జీతం రాలేదు అని అన్నది. బస్తీ దవాఖానలో పనిచేసే సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వారు పని ఎలా చేస్తారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి. చెప్పడమేమో ఒకటో తారీకు అందరికీ జీతాలు ఇస్తామని చెప్తున్నా... కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతం లేదు. కేవలం 60, 70 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, 40 రకాల మందులు సప్లై లేదు అని చెప్పారు. పేషెంట్లను మాట్లాడితే కొన్ని మందులు ఇస్తున్నారు, కొన్ని మందులు బయట కొనుక్కోవాలని చెప్తున్నారు అని అంటున్నారు’’ అని తెలిపారు.

‘‘టెస్టులలో బి12 (B12), డి3 (D3) టెస్టులకు రీ ఏజెంట్లు సప్లై లేకపోవడం వల్ల అన్ని రకాల టెస్టులు జరగడం లేదు. బస్తీ దవాఖానలో మందులు సరఫరా చేసే తెలివి (సమర్థత) ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ సిబ్బందికి జీతాలు వస్తున్నాయా లేదా అనే రివ్యూ చేసే తెలివి రేవంత్ రెడ్డి కి లేదా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 108 సర్వీస్ సకాలంలో రాకపోవడం వల్ల, వైద్యం అందకపోవడం వల్ల మనిషి ప్రాణం పోయింది. ముఖ్యమంత్రి తన గురించి ఆలోచించుకుంటాడు తప్ప ప్రజల గురించి ఆలోచించడు. హాస్పిటల్లో కేసీఆర్ కిట్టు ఇవ్వకపోవడం వల్ల 20% డెలివరీలు ప్రైవేటు ఆసుపత్రికి బదిలీ అయ్యాయి’’ అని ఆరోపించారు.

‘‘కేసీఆర్ మీద కోపంతో పథకాలను బంద్ చేస్తే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంతసేపు మద్యం దుకాణాలు పెంచుదామా, సారా ఎట్లా అమ్ముదామా, పైసలు ఎట్లా సంపాదిద్దామా అని తప్ప వేరే ఆలోచన లేదు రేవంత్ రెడ్డికి. వైన్ షాపుల టెండర్లకు రెండు లక్షల నుండి మూడు లక్షలకు పెంచి అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. జనం తాగాలే, ఊగాలే, రేవంత్ రెడ్డి కిట్టి (సొమ్ము) నిండాలి. ఒక్కనాడు అయినా ప్రజా ఆరోగ్య వ్యవస్థ పై రివ్యూ చేసావా రేవంత్ రెడ్డి? కేసీఆర్ పాలనలో 15వ ఆర్థిక సంఘం బస్తీ దవాఖానలను ప్రశంసించింది. కాంగ్రెస్ పాలనలో బస్తీ ప్రజలు కూడా ప్రశంసించడం లేదు. ఈ బస్తీ దవాఖానకు కరెంటు సరఫరా లేదు, దొంగ కరెంటు వేసుకున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘కనీసం బస్తీ దావాఖానాలలో బీపీ మీటర్లు పనిచేయడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయి. కేసీఆర్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద ₹7,000 కోట్లు చెల్లింపులు చేసింది. 3,000 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద అందించింది కేసీఆర్ ప్రభుత్వం. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS), జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ (JHS) పనిచేయడం లేదు. ఉద్యోగులకు, వారి కుటుంబాలకు, జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు ఆరోగ్య సేవలు ఈ ప్రభుత్వం అందించడం లేదు. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయి కూడా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కు విడుదల చేయలేదు’’ అని విమర్శించారు.

‘‘జూబ్లీహిల్స్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్కు ఓటేస్తే, బస్తీ దవాఖానలలో మందులు లేకున్నా, డాక్టర్లు లేకున్నా, వైద్య పరీక్షలు లేకున్నా నాకే ఓటేశారు అనుకుంటాడు. ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలి. జూబ్లీహిల్స్ లో ఉండే మీ బంధుమిత్రులకు కాంగ్రెస్ నిర్లక్ష్యం గురించి చెప్పండి. సీఎం తన కిట్టీ నిండుతోందా లేదా అని ఆలోచిస్తున్నారు తప్ప పేదల కుపయోగపడే కేసీఆర్ కిట్ల గురించి ఆయనకు ఎందుకు? రేవంత్ రెడ్డి సర్కార్ కు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలి’’ అని ప్రజలను కోరారు.

Tags:    

Similar News