కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగిందా..!
జూన్ 21న రాష్ట్రంలో ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్ల దగ్గర నిరసన చేయనున్నారు. ఈ నిరసనలు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జరగనున్నాయి.;
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాకరేపుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర విమర్శలుప్రతివిమర్శలు జరుగుతున్నాయి. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్, కేసీఆర్ అంతా కూడా ప్రజా ధనాన్ని దోచుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ పేరును బద్నాం చేయాలనే కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని, కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీకి అయిన డ్యామేజీని కాంగ్రెస్ రిపేయిర్ చేసుండొచ్చని కూడా బీఆర్ఎస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ఇన్నాళ్లూ మాటలతోనే సమాధానాలు చెప్తూ వచ్చిన బీఆర్ఎస్.. తాజాగా పోరుబాట పట్టాలని ఫిక్స్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయాలని నిర్ణయించుకుంది. జూన్ 21న రాష్ట్రంలో ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్ల దగ్గర నిరసన చేయనున్నారు. ఈ నిరసనలు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జరగనున్నాయి. రిపేర్లు చేయిస్తే సరిపోయేదానికి కావాలనే కాంగ్రెస్ రాద్దాంతం చేస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, బీఆర్ఎస్ను బద్నాం చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారాలు జరుగుతన్నాయని మండిపడుతున్నారు.
రెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్ పనికిరాదా..?: బీఆర్ఎస్
మేడిగడ్డ ప్రాజెక్ట్లో రెండు పిల్లర్లకు జరిగిన కుంగుబాటును చూపుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా నిరుపయోగం అయిందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వీటికి వ్యతిరేకంగానే బీఆర్ఎస్ నేతలు, స్థానిక రైతులు, ప్రజలతో కలిసి ప్రాజెక్ట్ల దగ్గర నిరసన చేయాలని పార్టీ నిర్ణయించింది. అదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. లండన్ పర్యటనలో ఉండనున్నారు. దీంతో ఈ నిరసనలను హరీష్ రావు నేతృత్వం వహిస్తారు. కాంగ్రెస్, బీజేపీల వైఖరిని ఎండగట్టడం కోసం మరో నిరసన కూడా చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
వినిపిస్తున్న కేసీఆర్ పేరు..!
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రస్తుత నీటిపారుదల శాఖ కీలక విషయాలు వెల్లడించింది. పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈటల, హరీష్ రావు, కేసీఆర్ చెప్పినట్లు బ్యారేజీల నిర్మాణంపై అధికారులదే తుది నిర్ణయం కాదని తేల్చింది. అదే విధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్న వారి వాంగ్మూలం కూడా తప్పేనని ప్రభుత్వం పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏ కేబినెట్ సమావేశంలో కూడా ఇటువంటి ఏ నిర్ణయం తీసుకోలేదని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. కేసీఆర్ స్వయంగా తీసుకున్న నిర్ణయాల మేరకే బ్యారేజీల నిర్మాణం జరిగిందని తేల్చి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో కేసీఆర్ పేరు గట్టిగా వినిపిస్తుండటంతో బీఆర్ఎస్ డిఫెన్స్లో పడింది.
దారిలేకే ఎదురుదాడా..?
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఆరోపణలు రావడం కానీ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ స్టార్ట్ చేయడం కానీ ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. ఏడాదికి ముందునుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇన్నాళ్లూ లేనిది బీఆర్ఎస్.. ఇప్పుడు నిరసనలకు పిలుపివ్వడం కాస్తంత విచిత్రంగానే ఉంది. కాళేశ్వరంలో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ పూర్తయి.. మరికొన్ని రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ఈ సమయంలో నిరసనలు చేయడం ద్వారా బీఆర్ఎస్ ఏం సాధించాలనుకుంటుందో? ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ విషయంలో బీఆర్ఎస్ నిజంగానే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు కూడా అంటున్నారు. అంతేకాకుండా ఏం చేయాలో అర్థం కాక? ఏ దారి లేకే బీఆర్ఎస్ మళ్ళీ నిరసన బాట పడుతుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయింది. మరో వారంలోనో.. జులై నెల మొదటి వారంలోనో కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది. ఇది బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే ఉంటుందని ప్రజలు, విశ్లేషకులతో పాటు బీఆర్ఎస్ కూడా భావిస్తోంది. దానికి తోడు మరోవైపు ఇదే అంశంలో ప్రతి అధికారిపై చర్యలు తీసుకోవాలని, అందరికీ శిక్షలు వేయాలంటూ విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. దానిపై కూడా ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సదరు అధికారులపై అసలు ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని వ్యాఖ్యానిస్తోంది. విధుల పట్ల వారు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే భారీగా ప్రజాధనం నష్టం జరిగిందని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దీంతో తమకు ఇంకో దారిలేదని బీఆర్ఎస్కు అర్థమైపోయింది. అందుకే నిరసన బాట పట్టిందని విశ్లేషకులు అంటున్నారు.