రెండు కోర్టుల మధ్య రేవంత్ ప్రభుత్వం ఇరుక్కుపోయిందా ?

రిజర్వేషన్లు ఖరారుచేసి సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పుతో రేవంత్ ప్రభుత్వం ఇరుకునపడిపోయింది;

Update: 2025-06-26 12:53 GMT
Revanth

ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచిత్రమైన పరిస్ధితులో ఇరుక్కుపోయింది. విచిత్రమైన పరిస్ధితి కూడా కోర్టుల మధ్య కావటంతో ఏమిచేయాలో దిక్కుతోచని స్ధితిలో పడిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే పంచాయితీ ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు 90 రోజులు గడువు విధించిన హైకోర్టు రిజర్వేషన్ ప్రక్రియను ముగించేందుకు మాత్రం జూలై 24వ తేదీని డెడ్ లైన్ గా విధించింది. దాంతో ఏమిచేయాలో ప్రభుత్వానికి దిక్కుతోచటంలేదు.

ఇపుడు విషయం ఏమిటంటే మొత్తం రిజర్వేషన్ క్యాటగిరీలు 50 శాతానికి మించకూడదని సుప్రింకోర్టు ఆదేశాలుంది. ఇప్పటికే ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ రాజ్యాంగపరంగా అమలవుతోంది. బీసీలకు ఇపుడు అమల్లో ఉన్న రిజర్వేషన్లు 23 శాతం. దీంతో మొత్తం రిజర్వేషన్లు 48 శాతం అమలవుతున్నట్లు లెక్క. అయితే 2023 ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి(Revanth) కామారెడ్డిలో మాట్లాడుతు స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) అమలుచేస్తామని హామీ ఇచ్చారు. నిజానికి ఇది ఏమాత్రం ఆచరణసాధ్యంకాని హామీ అన్న విషయం అందరికీ తెలుసు. అప్పటి హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుకుంటాయి. 67 శాతం రిజర్వేషన్లు సుప్రింకోర్టు తీర్పుకు వ్యతిరేకం. కాబట్టి కోర్టు చూస్తూ ఊరుకోదు.

అందుకని తనిష్టప్రకారం బీసీలకు రేవంత్ 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయలేరు. అందుకనే పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, ఓటింగ్ చేయించుకుని గెలిచి, రాజ్యాంగంలో సవరణలు తీసుకొచ్చి మొత్తం రిజర్వేషన్లను 67 శాతంకు తీసుకోపోవచ్చు. అయితే అందుకు కేంద్రప్రభుత్వం ఎందుకు సహకరిస్తుంది ? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుండి మొదలవుతున్నాయి. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన గడువు జూలై 24తో అయిపోతుంది. అంటే మూడురోజుల్లోనే బిసీల బిల్లు పార్లమెంటులో పెట్టించటం, చర్చలు జరిపించటం, ఓటింగు పెట్టించి బిల్లును నెగ్గించుకోవటం జరిగేపనికాదు. అంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇపుడు అమలవుతున్న 23 శాతానికి మించి పెంచుకునే అవకాశంలేదు.

ఇపుడు రేవంత్ ప్రభుత్వం సుప్రింకోర్టు-హైకోర్టు ఆదేశాలు, తీర్పుల మధ్య ఇరుక్కుపోయింది. సుప్రింకోర్టు తీర్పువల్ల రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచుకోలేకపోతోంది. అలాగే కేంద్రప్రభుత్వం మీద ఒత్తిడిపెట్టి బీసీల బిల్లును పార్లమెంటులో పెట్టించేంత గడువూ హైకోర్టు తీర్పువల్ల దొరకలేదు. రిజర్వేషన్లు ఖరారుచేసి సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పుతో రేవంత్ ప్రభుత్వం ఇరుకునపడిపోయింది. మరీ సమస్యలో నుండి రేవంత్ ప్రభుత్వం ఎలాగ బయటపడుతుందో చూడాలి.

Tags:    

Similar News