కేసీఆర్ పైన గ్రహాలు పగపట్టాయా ?

ఎప్పుడైతే కేసీఆర్ కు గ్రహస్ధితి రివర్సయ్యిందో అప్పటినుండే బీఆర్ఎస్ పరిస్ధితి కూడా దెబ్బతినేసింది.;

Update: 2025-05-30 09:29 GMT
KCR

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. అందుకనే కేసీఆర్ అర్జంటుగా గ్రహశాంతి కోసం ప్రత్యేక పూజలు లేకపోతే ఆయుత చండీయాగం చేయాలేమో. ఎందుకంటే కేసీఆర్ పార్టీ నేతలు, జనాలకన్నా గ్రహగతులనే ఎక్కువగా నమ్ముకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే కాదు ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ళల్లో కూడా ఎన్నిసార్లు ఆయుతచండీయాగాలు, ఎన్నిసార్లు ప్రత్యేకహోమాలు, పూజలు చేయించుకున్నారో లేక్కేలేదు. వాస్తుప్రకారం సచివాయం భవనాలను కూడా కట్టించుకున్నారు. ఎన్ని యాగాలు, హోమాలు, పూజలు చేయించినా చివరకు 2023 ఎన్నికల్లో ఓటమైతే తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత కేసీఆర్ పరిస్ధితి మరింత దిగజారిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్(KCR) వేరు, బీఆర్ఎస్ వేరుకాదు. కేసీఆరే బీఆర్ఎస్, బీఆర్ఎస్సే కేసీఆర్.

కేసీఆర్ గ్రహస్ధితి బాగున్నంతవరకు బీఆర్ఎస్(BRS) బ్రహ్మండంగా ఉంది. ఎప్పుడైతే కేసీఆర్ కు గ్రహస్ధితి రివర్సయ్యిందో అప్పటినుండే బీఆర్ఎస్ పరిస్ధితి కూడా దెబ్బతినేసింది. పార్టీపరిస్ధితి ఏస్ధాయిలో దెబ్బతినేసిందంటే 2024 పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసిన 17 నియోజకవర్గాల్లో ఒక్కదానిలో కూడా గెలవలేదు. ఎనిమిది నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో మూడోస్ధానానికి మాత్రమే అభ్యర్ధులు పరిమితమయ్యారంటేనే పార్టీ పరిస్ధితి ఎంతగా దిగజారిపోయిందో అర్ధమైపోతోంది. రెండు వరుస దెబ్బలతో కేసీఆర్ పూర్తిగా ఫామ్ హైస్ కే పరిమితమైపోవాల్సొచ్చింది. దాంతోనే పార్టీపైన అదుపు కూడా పోయింది. కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకం కోల్పోవటంతోనే పదిమంది ఎంఎల్ఏలు, ఆరుమంది ఎంఎల్సీలు బీఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయారు.

ఈవిషయాలన్నింటినీ పక్కనపెట్టేస్తే గడచిన పదిరోజులుగా కొడుకు కేటీఆర్(KTR), కూతురు కవిత మధ్య మొదలైన వివాదం పార్టీ పరువును మరింతగా దిగజార్చేసింది. వారసుల మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతున్నదే కాని తగ్గటంలేదు. ఒకవైపు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను అని ప్రకటిస్తునే మరోవైపు కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రశక్తేలేదని తెగేసి చెబుతున్నారు. కేటీఆర్ తో కూతురుకు సమస్య ఎక్కడ మొదలైంది, దాని పరిష్కారం ఏమిటన్న విషయం కేసీఆర్ కు తెలీకుండానే ఉంటుందా ? కేటీఆర్ పైన బిడ్డ చేస్తున్న ఆరోపణలు, విమర్శలపైన కేసీఆర్ నోరెత్తటంలేదంటే అర్ధమేంటి ? కూతురును పిలిపించుకుని కేసీఆర్ ఎందుకు మాట్లాడటంలేదన్న విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు.

పార్టీ పరిస్ధితి, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరవ్వటం, వారసుల మధ్య వివాదం లాంటి అనేక సమస్యలు కాలమే పరిష్కరించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లున్నారు. అందుకనే అర్జంటుగా గ్రహశాంతికి ప్రత్యేక పూజలు చేయిస్తే బాగుంటుందేమో. యాగాలు, హోమలు, పూజలపైన కేసీఆర్ కు అపారమైన నమ్మకం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. వాస్తవం మాట్లాడుకోవాలంటే కేసీఆర్ సమస్యలతో సతమతమవుతున్నారు. అన్నీవైపుల నుండి బీఆర్ఎస్ అధినేతను సమస్యలు కమ్ముకుంటున్నాయి. పీసీ ఘోష్ కమిష్ విచారణకు కేసీఆర్ హాజరైతే ఏమవుతుందో తెలీదు.

ఇదేసమయంలో ఫార్ములా కార్ రేసు అవినీతిలో కేటీఆర్ పైన ఇఫ్పటికే ఈడీ, ఏసీబీలు కేసులు నమోదుచేసి రెండేసి సార్లు విచారణలు కూడా జరిపాయి. మూడోసారి విచారణకు రమ్మని ఏసీబీ(Telangana ACB) నోటీసులు జారీచేస్తే అమెరికా పర్యటన తర్వాత హాజరవుతానని సమాధానమిచ్చారు. ఈసారి విచారణకు హాజరైతే ఏసీబీ ఏమిచేస్తుందో అనే టెన్షన్ పార్టీలో పెరిగిపోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో బిడ్డ కవిత(Kavitha) బెయిల్ పైన బయట తిరుగుతున్నారు. బెయిల్ ఎప్పుడు రద్దయి మళ్ళీ జైలుకు ఎప్పుడు వెళ్ళాల్సొస్తుందో తెలీని పరిస్ధితిలో కవితున్నారు. గ్రహాలు అనుకూలంగా ఉన్నపుడు కేసీఆర్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన విషయం అందరు చూసిందే. ప్రతిపక్షాలను చీల్చి చెండాడారు. దర్యాప్తుసంస్ధలను పట్టించుకోలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, జాతీయపార్టీలను కూడా లెక్కచేయలేదు. చివరకు నరేంద్రమోడీని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇప్పటి కేసీఆర్ పరిస్ధితి చూస్తుంటే గ్రహాలన్నీ కేసీఆర్ పై పగపట్టాయా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే గ్రహానుగ్రహం కోసం కేసీఆర్ అర్జంటుగా మళ్ళీ యాగాలు, హోమాలు, పూజలు చేయించుకోవాలేమో అనిపిస్తోంది, మీరేమంటారు ?

Tags:    

Similar News