హైడ్రాకి హైకోర్టు చీవాట్లు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాకు హైకోర్టు మొట్టికాయలు వేసింది.

Update: 2024-08-28 10:34 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌లో కావూరి హిల్స్ పరిధిలో ఉన్న కొన్ని నిర్మాణాలకు హైడ్రా ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విజయసేన్ రెడ్డి.. కేవలం కొన్ని నిర్మాణాలకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

అదే ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్, రహేజా టవర్స్‌కి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 10-20 ఏళ్ల క్రితం నిర్మాణాలను ఇప్పుడు ఎందుకు ముట్టుకుంటున్నారని హైడ్రా తరుపున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్‌ను కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు అడిగింది. ముందుగా.. తప్పుచేసిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌ మహా నగరంలో లక్ష అనధికార నిర్మాణాలు ఉన్నాయి. వారందరికి నోటీసులు ఎందుకు జారీ చేయలేదు.. అసలు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇచ్చారని హైకోర్టు అడిగింది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మాణాలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు అని న్యాయమూర్తి ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ, హుడా నుండి అనుమతులు పొంది గత 30-40 ఏళ్లగా నివాసం ఉంటున్న స్థలాలకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని పిటిషనర్లు మండిపడ్డారు.

కేవలం తమకు గిట్టని వాళ్ళు, ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి మాత్రమే హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసుకుంటున్నదని వస్తున్న విమర్శలకు హైకోర్టు తాజా వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి. ఈ నేపథ్యంలో.. హైడ్రా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన నిర్మాణాలకు కూడా నోటీసులు ఇస్తుందా అని పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Tags:    

Similar News