కొండపాకలో వెలుగుచూసిన కొత్త పురావస్తుసంపద
కొండపాకలో కొత్త తెలంగాణచరిత్రబృందం అన్వేషణలు;
సిద్ధిపేట జిల్లా కొండపాక.. చరిత్రపూర్వయుగ పురావస్తువులకు, రాష్ట్రకూట శిల్పాలకు, కాకతీయ శాసనాలకు, దేవాలయాలకు పెట్టిందిపేరు. వెతుకుతున్న కొద్దీ ఊటనీరు మాదిరి ఎన్నో చారిత్రక వస్తువులు వెలుగుచూస్తున్నాయి. కొత్త తెలంగాణచరిత్రబృందం పురావస్తుపరిశోధకుడు అహోబిలం కరుణాకర్ బృందం కొండపాక పాటిగడ్డ మీద అన్వేషణ చేస్తున్నది. వారికి గతంలో దొరికినవే కాక కొత్తగా మూడు కొత్తరాతియుగం గొడ్డళ్లు, సాతవాహనకాలంనాటి టెర్రకోటబొమ్మ వక్షబంధంతో రాచపురుషుని టార్సో(దేహభాగం) ఒకటి లభించాయి.
గుప్పిళ్ళకొద్ది రంగురంగుల గాజుపూసలు, దంతపు పాచిక, కొత్తరాతియుగం గొడ్డళ్లు, రెండంచుల రాతిగొడ్డలి, టెర్రకోట బొమ్మల శకలాలు, ఇనుం చిట్టాలు ఎన్నో దొరికిన ప్రాంతంలోనే మళ్ళీ కొత్త పురావస్తువులు దొరికాయి. తెలంగాణ వారసత్వశాఖ స్పందించి ఇక్కడ సైంటిఫిక్ ఎక్స్ప్లొరేషన్ చేయాలని కొత్త తెలంగాణచరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ కోరుతున్నారు. విలువైన పురావస్తుసంపద చెల్లాచెదరైపోకముందే ప్రభుత్వం ఈ గ్రామం మీద శ్రద్ధ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.