రెడ్డి ఎంఎల్ఏలు ఇంత చిన్నలాజిక్ ఎలా మరచిపోయారు ?
తమకు మంత్రిపదవులు రాకపోతే భూకంపాలు సృష్టిస్తామన్నట్లుగా ఇదివరకే వార్నింగుల్లాంటి మాటల తూటాలను పేల్చారు;
రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణ అసంతృప్తిని రాజేసింది. ఉన్న మంత్రిపదవులేమో తక్కువ. కాని మంత్రిపదవులను ఆశించిన వారి సంఖ్య చాంతాడంతుంది. అందులోను రెడ్డి సామాజికవర్గంలోని ఎంఎల్ఏల్లో చాలామంది మంత్రిపదవులపై ఆశలు పెట్టుకున్నారు. విచిత్రం ఏమిటంటే తమకు మంత్రిపదవులు రాకపోతే భూకంపాలు సృష్టిస్తామన్నట్లుగా ఇదివరకే వార్నింగుల్లాంటి మాటల తూటాలను పేల్చారు. ఇలాంటి వారిలో మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఇబ్రహింపట్నం ఎంఎల్ఏ మల్ రెడ్డి రంగారెడ్డి ముఖ్యులు. వీళ్ళతో పాటు పీ. సుదర్శనరెడ్డి తదితరులు కూడా క్యాబినెట్లో చోటు ఆశించారు.
ఇక్కడే వీళ్ళంతా మరచిపోయిన చిన్న లాజిక్కుంది. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన రెడ్డి ఎంఎల్ఏలు 22 మంది ఉన్నారు. వీళ్ళలో చాలామంది మరచిపోయిన లాజిక్కు ఏమిటంటే మంత్రివర్గంలో రెడ్డి ఎంఎల్ఏలకు అవకాశాలు లేవని. ఎందుకంటే మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య 18కి మించకూడదు. శనివారం నాటికి 12 మంది మంత్రులున్నారు. రేవంత్ రెడ్డి(Revanth)తో కలుపుకుని రెడ్లు మంత్రివర్గంలో నలుగురున్నారు. 18 మంది క్యాబినెట్లో ఇప్పటికే నలుగురు రెడ్లుండటం అంటే రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లే అనుకోవాలి.
రేవంత్ కాకుండా మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham kumar Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈకారణంగా రెడ్డి సామాజికవర్గం నుండి మరొకరిని తీసుకునేంత సీన్ లేదు. పోనీ ఇంకొక రెడ్డి ఎంఎల్ఏని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అసాధారణ పరిస్ధితులు ఏవైనా ఉన్నాయా అంటే అదీలేదు. కొత్తగా ఒకరెడ్డి ఎంఎల్ఏని మంత్రిగా తీసుకోవాలంటే ఇపుడున్న ముగ్గురిలో ఒకరిని తప్పించాల్సిందే తప్ప వేరేదారిలేదు. మంత్రులుగా ఉన్న ముగ్గురు రెడ్లలో ఎవరినీ తప్పించే అవకాశంలేదు. అలాంటిది అదనంగా మరో రెడ్డి ఎంఎల్ఏకి మంత్రిగా ఛాన్సేలేదన్నది సింపుల్ లాజిక్. ఈలాజిక్కునే రెడ్డి ఎంఎల్ఏలు మరచిపోయారు. 2023 ఎన్నికల సమయంలో తనకు మంత్రిపదవిని హామీ ఇచ్చారన్నది కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వాదన. అయితే కోమటిరెడ్డి మరచిపోయిన విషయం మరోటుంది.
అదేమిటంటే ఇప్పటికే తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నపుడు మళ్ళీ తనకు కూడా అవకాశం వస్తుందని ఎలాగ అనుకున్నారో అర్ధంకావటంలేదు. అన్నదమ్ములిద్దరికీ మంత్రివర్గంలో చోటు కల్పించేంత పరిస్ధితులు లేవు. ఒకవేళ అన్న వెంకటరెడ్డికి తోడు తమ్ముడు రాజగోపాలరెడ్డిని కూడా తీసుకోవాలని అనుకుంటే అప్పుడు మిగిలిన రెడ్డి ఎంఎల్ఏలు చూస్తూ ఊరుకోరు కదా. రేవంత్ నుండి అధిష్ఠానాన్ని కలిసి నానా రచ్చచేసేస్తారు. అప్పుడు మిగిలిన రెడ్డి ఎంఎల్ఏల్లో తీవ్రమైన అసంతృప్తి మొదలవుతుంది. ఇలాంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకునే రాజగోపాలరెడ్డికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి మల్ రెడ్డితో పాటు ఇతర రెడ్డి ఎంఎల్ఏలు కూడా మంత్రిపదవి రాలేదన్న అసంతృప్తి ఉన్నా నోరెత్తేందుకు లేదు.
గెలిచిన ప్రతిఎంఎల్ఏకీ మంత్రిఅవ్వాలనే ఆశ ఉంటుంది అనటంలో సందేహం అవసరంలేదు. కాని ఇక్కడున్నది కేవలం ముఖ్యమంత్రితో కలిపి 18 మందికే అవకాశం. ఈ 18 మందిలోనే అనేక సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇపుడు కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురిలో ఒక బీసీ, ఇద్దరు ఎస్సీలను ఎంపిక చేసుకున్నారు. మక్తల్ ఎంఎల్ఏ వాకిటి శ్రీహరి(బీసీ-ముదిరాజ్), చెన్నూరు ఎంఎల్ఏ వివేక్ వెంకటస్వామి(ఎస్సీ-మాల), ధర్మపురి ఎంఎల్ఏ అడ్లూరి లక్ష్మణ్(ఎస్సీ-మాదిగ) తీసుకుని సామాజికవర్గాల సమీకరణలో సమతూకం పాటించేందుకు అధిష్ఠానం ప్రయత్నించింది. తాజాగా ముగ్గురు కొత్త మంత్రులతో క్యాబినెట్ సంఖ్య 15కి పెరిగింది. ఇంకా మూడుస్ధానాలను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం ఖాళీగానే ఉంచింది.
మంత్రిపదవులు ఆశించి భంగపడిన సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తదితరులను అధిష్ఠానం బుజ్జగిస్తోంది. తెలంగాణ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు అసంతృప్తుల ఇళ్ళకు వెళ్ళి క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను వివరించి బుజ్జగిస్తున్నారు. మంత్రివర్గం ఏర్పాటు, విస్తరణ అన్నాక ఏపార్టీలో అయినా ఇలాంటి అసంతృప్త సన్నివేశాలు మామూలే. ఎన్నిరోజుల్లో అసంతృప్తులు సర్దుకుంటారో చూడాలి.