‘దేవుడిమీద ప్రమాణంచేసి అంతా నిజమే చెబుతాను’
పై ప్రమాణాల దృశ్యాలను జనాలు ఎక్కువగా సినిమా సీన్లలోనే చూస్తుంటారు;
దేవుడిమీద ప్రమాణంచేసి అంతా నిజమే చెబుతాను అనే మాటలు ఎక్కువగా కోర్టుల్లోను, తరచుగా కమిషన్ విచారణల్లో వింటుంటారు. పై ప్రమాణాల దృశ్యాలను జనాలు ఎక్కువగా సినిమా సీన్లలోనే చూస్తుంటారు. అంతా నిజమే చెబుతానని ప్రమాణంచేసిన వ్యక్తులు చెప్పేదంతా నిజమేనా ? సదరు వ్యక్తులు చెప్పే నిజాల్లో నిజాలెంతో అందరికీ బాగానే తెలుసు. ఇపుడు విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై విచారణ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు బుధవారం కేసీఆర్(KCR) హాజరయ్యారు. విచారణ మొదలయ్యేముందు కేసీఆర్ పైన చెప్పినట్లుగా ప్రమాణంచేసి కమిషన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
కమిషన్ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిస్తు కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజి(Medigadda Barrage) నిర్మాణం క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగిందన్నారు. మేడిగడ్డ బ్యారేజి స్ధలం ఎంపిక పూర్తిగా సాంకేతికమే అన్నారు. పంప్ హౌస్ హెడ్ కు తాకేంతవరకు నీటిని నిల్వచేయాలన్న నిర్ణయం కూడా ఇంజనీరింగ్ అధికారులదే అనిచెప్పారు. తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. సాంకేతిక సిఫార్సులతోనే సుందిళ్ళ, అన్నారం స్ధలాల మార్పు జరిగిందన్నారు. కేబినెట్ సబ్ కమిటి నిర్ణయాలతోనే మేడిగడ్డ నిర్మించినట్లు తెలిపారు. తమహయాంలో ఆర్ధికలావాదేవీలతో అక్రమాలకు అవకాశమే లేదన్నారు. అన్నీనిర్మాణాలకు క్యాబినెట్ ఆమోదం ఉందని చెప్పారు. హోలుమొత్తంమీద కేసీఆర్ చెప్పింది ఏమిటంటే సాంకేతికంగా జరిగిన పొరబాట్లకు, బ్యారేజీల నిర్మాణం స్ధలాల ఎంపిక అంతా ఇంజనీర్లు, నిపుణులు చెప్పినట్లే చేశాను తప్ప అందులో తన ప్రమేయం ఏమీలేదని. కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్, హరీష్, ఈటల రాజేందర్ ఒకే విధమైన సమాధానాలు చెప్పటం గమనార్హం.
కేసీఆర్ చెప్పింది నిజంకాదు : తుమ్మల
ప్రమాణంచేసి కమిషన్ ముందు కేసీఆర్ చెప్పిన దాంట్లో నిజాలు లేవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswar Rao) అన్నారు. ఒకపుడు కేసీఆర్ మంత్రివర్గంలో తుమ్మల పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ తో పాటు ఈటల రాజేందర్(Eatala Rajendar), హరీష్ రావు(Harish Rao) కమిషన్ ముందు చెప్పిందానికి, వాస్తవంగా జరిగిందానికి చాలా తేడా ఉందన్నారు. వాస్తవాలకు, వాగ్మూలాలకు చాలా తేడా ఉందని మంత్రి అన్నారు. మంత్రుల సబ్ కమిటీకి, మేడిగడ్డ నిర్మాణానికి సంబంధమే లేదన్నారు. 2016, మార్చి 15వ తేదీన ఇంజనీరింగ్ ఆఫ్ ప్రాజెక్టులపై సబ్ కమిటి ఏర్పాటైందన్నారు. అయితే మార్చి 1వ తేదీన అంటే సబ్ కమిటి ఏర్పాటుకు 15 రోజుల ముందే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని తుమ్మల గుర్తుచేశారు. తన వాదనకు మద్దతుగా తుమ్మల కొన్ని నోట్ ఫైళ్ళను కూడా చూపించారు. కేసీఆర్, ఈటల, హరీష్ చెప్పింది అబద్ధాలే అన్న తన వాదనకు మద్దతుగా కొన్ని ఫైళ్ళ వివరాలతో పీసీ ఘోష్ కమిషన్ కు లేఖ రాశారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2015లోనే కేసీఆర్ ప్రభుత్వం ఒక కన్సెల్టీసికి డీపీఆర్ తయారుచేయమని ఇచ్చిన ఆదేశాల కాపీలను కూడా సమర్పించారు.
తుమ్మల కమిషన్ కు సమర్పించిన కాపీలప్రకారం సబ్ కమిటీకి మేడిగడ్డ నిర్మాణానికి సంబంధంలేదని తేలిపోయింది. మేడిగడ్డ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ రెడీచేయాలని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీల మధ్య 2015, ఏప్రిల్ 13న జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల కాపీలను కూడా కమిషన్ కు తుమ్మల అందించారు. మేడిగడ్డ నిర్మించాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఆతర్వాత డీపీఆర్ తయారుచేసే బాధ్యతను వ్యాప్కోస్ అనే సంస్ధకు అప్పగించినట్లు అర్ధమవుతోంది. కేసీఆర్ చెప్పినట్లుగా సీడబ్య్లూసీ, వ్యాప్కోస్ సూచనల ప్రకారమే మేడిగడ్డ నిర్మించినట్లు చెప్పటం పూర్తిగా అబద్ధమని తేలిపోయింది.
అవినీతి వల్లే పార్టీని వదిలేశా : కొండా విశ్వేశ్వరరెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు తన ఘనతే అని అప్పట్లో చెప్పుకున్న కేసీఆర్ ఇపుడు మాట మార్చినట్లు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి(MP Konda Vishweshwar Reddy) ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాకుండా పోవటానికి పూర్తి బాధ్యత కేసీఆర్ దే అన్నారు. ప్రపంచంలో కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద ఇంజనీరింగ్ బ్లండర్ అని కొండా అభివర్ణించారు. మిగిలిన ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినా ప్రాజెక్టులు మిగిలాయని కాని కాళేశ్వరం అవినీతిలో చివరకు ప్రాజెక్టు కూడా మిగల్లేదని ఎంపీ మండిపడ్డారు. కాళేశ్వరం వల్ల అధికంగా దిగుబడి కూడా ఏమీ పెరగలేదన్నారు. తాను బీర్ఎస్ ను వదిలేయటానికి కాళేశ్వరంలో జరిగిన అవినీతి కూడా ఒక కారణంగా కొండా తెలిపారు.
తుమ్మల రికార్డుల ఆధారంగా కమిషన్ రాసిన లేఖ ద్వారా కేసీఆర్ ప్రమాణంచేసి చెప్పిందాంట్లో చాలా అబద్ధాలున్నాయని అర్ధమవుతోంది. కాబట్టి దేవుడిమీద ప్రమాణంచేసి అంతా నిజమే చెబుతానని చెప్పేదంతా నిజమే అని అనుకునేందుకు లేదని తాజాగా మరోసారి నిరూపితమైందా ?