ఇక అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, మంజూరుకు కమిటీలు

తెలంగాణలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను సర్కారు ఇవ్వనుంది. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ,మున్సిపల్ వార్డుల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనుంది.

Update: 2024-10-11 15:02 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వారికి శుభవార్త వెల్లడించింది. సొంత ఇల్లు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం కింద 4.5 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ, మున్సిపల్ వార్డు స్థాయిలో స్థానికులతో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రవాణ, రోడ్డు, భవనాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

- గ్రామ స్థాయిలో సర్పంచ్ లేదా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఛైర్మన్ గా సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపుల నుంచి ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు మహిళలు, అందులో ఒకరు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన స్థానికులు సభ్యులుగా, పంచాయతీ కార్యదర్శి కన్వీనరుగా ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేయాలని జీఓ విడుదల చేశారు.
- మున్సిపల్ వార్డు స్థాయిలో వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ ఛైర్మన్ గా సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపుల నుంచి ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు మహిళలు, అందులో ఒకరు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన స్థానికులు సభ్యులుగా, వార్డు ఆఫీసర్ కన్వీనరుగా ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
ఇందిరమ్మ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అర్హులను ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం కోరింది. ఇళ్ల నిర్మాణానికి డబ్బును లబ్ధిదారుడికే అందించాలని ప్రభుత్వం కోరింది. ఇందిరమ్మ కమిటీ ఈ పథకంపై సోషల్ ఆడిట్ చేయాలని సూచించింది. అనర్హులకు ఇళ్లను మంజూరు చేస్తే ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం జీఓలో పేర్కొంది.
ఇందిరమ్మ కమిటీలను మండలాభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు నివేదించనున్నారు. జిల్లా కలెక్టర్లు జిల్లా ఇన్ చార్జి మంత్రిని సంప్రదించి ఇందిరమ్మ కమిటీల నియామకం చేపట్టాలని సర్కారు ఆదేశించింది. అక్టోబరు 12వతేదీలోగా మండల, మున్సిపల్ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను నియమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ జారీ చేసిన జీఓలో పేర్కొన్నారు.


Tags:    

Similar News