తెలంగాణపై మోదీకి కనికరమే కలగటంలేదా ?

మూడురాష్ట్రాల్లో మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రమంత్రివర్గం హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) అంశాన్ని మాత్రం పక్కనపెట్టేసింది;

Update: 2025-06-27 07:24 GMT
Narendra Modi and Revanth Reddy

తెలంగాణ అభివృద్ధిపై నరేంద్రమోదీకి ఏమాత్రం కనికరం కలగటంలేదు. మూడురాష్ట్రాల్లో మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రమంత్రివర్గం హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) అంశాన్ని మాత్రం పక్కనపెట్టేసింది. చెన్నైలో రెండో దశ, పూణేలో రెండో దశతో పాటు బెంగుళూరులో రెండు, మూడు దశల విస్తరణకు కేంద్రమంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అంటే ఆర్ధికసాయానికి అంగీకరించటమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడురాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు ఓకే చెప్పిన కేంద్రమంత్రివర్గం హైదరాబాద్ మెట్రోలో ఎంతో కీలకమైన రెండోదశ విస్తరణ విషయాన్ని మాత్రం ఎందుకు పక్కకు పెట్టేసింది ? రెండోదశ విస్తరణకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి అందించింది. నరేంద్రమోదీ(Narendra Modi)ని కలిసినపుడు రేవంత్(Revanth) చాలాసార్లు మెట్రో రెండోదశకు అనుమతులు, నిధులు కావాలని రిక్వెస్టులు కూడా చేశాడు. ఆర్ధికసాయంకోసం కేంద్రమంత్రులను కలిశాడు. ఎంతమందిని కలిసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు.

హైదరాబాద్ మెట్రో రెండో దశ మొదటి స్టేజిలో ఐదు క్యారిడార్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఐదు క్యారిడార్లకు కలిపి 76.4 కిలోమీటర్లకు రు. 24,269 కోట్లు వ్యయం అవుతుందని రేవంత్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పంపిన డీపీఆర్ లో స్పష్టంగా పోయిన ఏడాది నవంబర్ 4వ తేదీన ప్రతిపాదించింది. ప్రాజెక్టు పూర్తయితే రోజుకు సుమారు 2 లక్షలమంది ప్రయాణిస్తారని, వాయుకాలుష్యం తగ్గటంతో పాటు నగరంలోని ట్రాఫిక్ ఒత్తిడి కూడా చాలావరకు తగ్గుతుందని డీపీఆర్ లో వివరించింది. ప్రస్తుత మెట్రోలో రోజుకు సుమారు 5 లక్షలమంది ప్రయాణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రాజెక్టు మొత్తం వ్యయం రు. 24,269 కోట్లలో 30 శాతం అంటే రు. 7,313 కోట్లను రాష్ట్రప్రభుత్వం భరిస్తుందని, కేంద్రం తన వాటాగా 18 శాతం రు. 4,230కోట్లను భరిస్తే 48 శాతం అంటే రు. 11,693 కోట్లను రుణంరూపంలో జైకా(జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ) సర్దుబాటు చేస్తుందని రేవంత్ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. మిగిలిన 4 శాతం నిధులను రాష్ట్రప్రభుత్వమే పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్పు ద్వారా సేకరించేందుకు రంగం సిద్ధంచేసుకునేట్లుగా కేంద్రానికి చెప్పింది. కేంద్రం గనుక ఓకే అంటే వెంటనే రాష్ట్రప్రభుత్వం జైకాతో ఒప్పందాలు చేసుకోవటానికి సిద్ధంగా ఉంది. రేవంత్ ప్రభుత్వం ఇదే విషయాన్ని కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం తనసమ్మతిని తెలియజేయటంలేదు.

రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన రెండో దశలో నాగోల్-శంషాబాద్ విమానాశ్రయంకు 36.8 కిలోమీటర్లు, రాయదుర్గం-కోకాపేటకు11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్టకు 7.5 కిలోమీటర్లు, మియాపూర్-పటాన్ చెరుకు 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్-హయత్ నగర్ మధ్య 7.1 కిలోమీటర్లకు మెట్రో రైలు మార్గం అవసరమని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండో దశ ప్రాజెక్టులో కేంద్రం భరించాల్సిన మొత్తం రు. 4,230 కోట్లు తక్కువే అయినా సాంకేతిక అంశాలతో పాటు మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం తెలపాల్సింది కేంద్రప్రభుత్వమే. అందుకనే మెట్రో రెండో దశకు అనుమతితో పాటు నిధులు కూడా సర్దుబాటు చేయాలని పదేపదే రేవంత్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నది.

ఆమోదం పొందిన రాష్ట్రాలు ఏవి ?

చెన్నై రెండో దశ విస్తరణకు 2024 అక్టోబర్ లోనే కేంద్రం ఆమోదం తెలిపింది. విస్తరణ ప్రాజెక్టు వ్యయం రు. 63,246 కోట్లలో కేంద్రం తనవంతు భరించబోతోంది. బెంగుళూరు రెండో దశకు 2021, ఏప్రిల్ లోనే కేంద్రం ఆమోదం తెలిపింది. దీని వ్యయం రు. 14,788 కోట్లు. అలాగే బెంగుళూరు మూడోదశ విస్తరణకు 2024, ఆగస్టులోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వ్యయం రు. 15,611 కోట్లు. పూణే రెండో దశ విస్తరణ ప్రాజెక్టును 2025, జూన్ లో ఆమోదం తెలపగా దీని వ్యయం రు. 3,624 కోట్లు.

మిగిలిన ప్రాజెక్టుల మాటేమిటి ?

హైదరాబాద్ మెట్రో రెండో దశతో పాటు మూసీ నది(Musi River Project) సుందరీకరణ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు(త్రిబుల్ ఆర్), ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కు నిధులవిషయాన్ని కూడా కేంద్రం పట్టించుకోవటంలేదు. సో, జరుగుతున్నది చూస్తుంటే తెలంగాణ(Telangana)పై మోదీకి ఏమాత్రం కనికరం కలగటంలేదన్న విషయం అర్ధమైపోతోంది. మోదీకి కనికరం లేదు సరే మరి తెలంగాణ నుండే ఎంపీలుగా గెలిచి కేంద్రమంత్రులుగా ఉన్న జీ కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) ఏమిచేస్తున్నారు ? అన్నదే అర్ధం కావటంలేదు. మెట్రో రెండోదశ ప్రాజెక్టు డీపీఆర్ ను కేంద్రప్రభుత్వానికి పంపిన విషయం రాష్ట్రప్రభుత్వం కేంద్రమంత్రులు ఇద్దరికీ చెప్పింది. ప్రధానమంత్రితో మాట్లాడి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేట్లుగా చేయాలని రేవంత్ ఇద్దరికీ అనేకసార్లు విజ్ఞప్తులు చేసిన విషయం తెలిసిందే. తెరవెనుక ఏమి జరుగుతుందో అర్ధంకావటంలేదు కాని రాష్ట్రప్రభుత్వం పంపిన ప్రాజెక్టులకు కేంద్రం మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంలేదు.

Tags:    

Similar News